పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు.
పింప్రి, న్యూస్లైన్: పుణే-బెంగళూరు జాతీయ రహదారిపై సోమవారం రాత్రి పది గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది దుర్మరణం చెందారు. 40 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ఖండాలా హైవే పోలీసులు తెలిపిన వివరాల మేరకు..
గుజరాత్లోని పోరుబందర్కు చెందిన యాత్రికులు జనవరి 26వ తేదీ నుంచి దక్షిణాది ప్రాంతాలను సందర్శించేందుకు యాత్రకు బయలు దేరారు. కన్యాకుమారి, తిరుపతి ప్రాంతాలకు వెళ్లి ముంబైకి బయల్దేరారు. ఇదే సమయంలో పుణేలో మార్గమధ్యలో బెంగరూట్వాడి వద్ద ‘ఎస్’ ఆకార రోడ్డు మార్గంలో ముంబైకి వెళుతున్న ఓ కంటైనర్ అదుపుతప్పి ముందుగా వ్యాగోనార్ను తర్వాత జీపు, మరో జీపును ఢీకొంది.
ఈ వాహనాలు రోడ్డుపక్కన పార్క్ చేసిన అంకుర్ ట్రావెల్స్ ఏసీ బస్సును ఢీకొట్టాయి. ఈ బస్సు అదుపుతప్పి సుమారు 20 అడుగుల లోయలోకి పడిపోయింది. అయితే బస్సులో ఉన్న సుమారు 47 మంది ప్రయాణికుల్లో 10 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు. అయితే మరో ఇద్దరిని గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఖండాళా, శిర్వాళాలోని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ప్రమాదం విషయం తెలిసిన రక్షక బృందాలు ఘటనాస్థలికి చేరుకొని సహాయక పనులను వేగిరంగా చేపట్టారని పోలీసులు చెప్పారు. ఇదిలావుండగా ఇదే ప్రాంతంలో తరచు ప్రమాదాలు సంభవిస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత నెలలో ఇదే చోట జరిగిన ప్రమాదంలో తొమ్మిదిమంది మరణించారు.