కోహ్లి, రవిశాస్త్రిలను టార్గెట్‌ చేసిన యువీ!

Yuvraj Takes Subtle Dig At Virat And Ravi Shastri - Sakshi

న్యూఢిల్లీ: తనను యో-యో టెస్టు పేరుతో టీమిండియా యాజమాన్యం పదే పదే పక్కన పెట్టిన సంగతిని టీమిండియా మాజీ ఆల్‌ రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ మరోసారి గుర్తు చేసుకున్నాడు. తాను బ్యాట్‌తో మెరిసినప్పటికీ యో-యో టెస్టు పేరుతో జట్టు నుంచి వైదొలిగేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు ఎప్పుడు అవకాశం వచ్చినా యో-యో టెస్టు గురించి మాట్లాడుతున్న యువీ.. తన అసంతృప్తిని మరోమారు వ్యక్తం చేశాడు. ఈ క్రమంలోనే విరాట్‌ కోహ్లి, రవిశాస్త్రిలను టార్గెట్‌ చేస్తూ మాట్లాడాడు. కోహ్లి-రవిశాస్త్రి హయాంలోనే యో-యో టెస్టును ప్రారంభించడాన్ని పరోక్షంగా ప్రస్తావించాడు. అసలు ఒక ఆటగాడు బాగా ఆడుతుంటే యో-యో టెస్టుతో పనేంటని ప్రశ్నించాడు.

తాను జట్టులో చోటు కోల్పోవడానికి యో-యో టెస్టే కారణమని, దాంట్లో ఇక పాస్‌ కాలేననే క్రికెట్‌కు వీడ్కోలు చెప్పానని యువీ తెలిపాడు. ఆ సమయంలో బీసీసీఐ చీఫ్‌గా గంగూలీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని యువీ పేర్కొన్నాడు. తన కెరీర్‌ను అర్థాంతరంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నాడు. కేన్సర్‌ బారినుంచి బయటపడ్డాక క్రికెట్‌లో పునరాగమనం చేసిన యువరాజ్‌ను యో-యో టెస్ట్‌ పాస్‌కాలేదంటూ పలుమార్లు జట్టుకు దూరం పెట్టారు. 2017లో వెస్టిండీస్‌ టూర్‌ నుంచి వచ్చాక ఇదే కారణంతో యువీని జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సమయమొచ్చినప్పుడల్లా యో-యో టెస్ట్‌పై అతడు అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top