ఇండియా బ్యాట్స్మెన్కు కోహ్లీ వార్నింగ్
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి జరగబోతున్న టెస్ట్ మ్యాచ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని టీమిండియా బ్యాట్స్మెన్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ హెచ్చరించాడు.
ఆస్ట్రేలియాతో గురువారం నుంచి జరగబోతున్న టెస్ట్ మ్యాచ్ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని టీమిండియా బ్యాట్స్మెన్ను కెప్టెన్ విరాట్ కోహ్లీ హెచ్చరించాడు. ముఖ్యంగా ఆస్ట్రేలియన్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈమధ్య కాలంలో బాగా రాణిస్తున్నాడని, రివర్స్ స్వింగ్తో భారత బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టగలడని, అతడిని తేలిగ్గా తీసుకోవద్దని తన వాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. గత సంవత్సరం శ్రీలంకతో జరిగిన సిరీస్లో అతడు 24 వికెట్లు తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టులో కోహ్లీ, స్టార్క్ కలిసి ఆడారు. దాంతో అతడి ఆట తీరు గురించి కోహ్లీకి బాగా తెలుసు.
అతడు ప్రపంచస్థాయి బౌలర్ అని, తరచు గాయాలబారిన పడుతున్నా.. వాటిని అధిగమించి మరీ మంచి బౌలర్గా ఎదగడం మంచి పరిణామమని కోహ్లీ అన్నాడు. పాత బంతితో కూడా రివర్స్ స్వింగ్ చేయడం ఎలాగన్నది అతడు బాగా నేర్చుకున్నాడని, స్టార్క్ తన నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్న తీరును ప్రపంచంలో ప్రతి క్రికెటర్ ఆరాధించాలని కూడా కోహ్లీ చెప్పాడు. టెస్టులలో ప్రపంచంలో రెండో ర్యాంకులో ఉన్న ఆస్ట్రేలియా.. టాప్ ర్యాంకర్ టీమిండియాతో తలపడుతోంది. టీమిండియా గత 19 టెస్టులలో ఒక్కసారి కూడా ఓటమి చూడలేదు. మరోవైపు ఆస్ట్రేలియా మాత్రం ఆసియా ఖండంలో ఆడిన గత తొమ్మిది టెస్టుల్లో ఓడిపోయింది.