
వరుణుడే విజేత
ఓవైపు టెస్టు కెప్టెన్సీని విజయంతో మొదలుపెట్టాలని కోహ్లి ఆరాటం... మరోవైపు కనీసం ఆఖరి రోజు ఆట సజావుగా సాగినా...
భారత్, బంగ్లాదేశ్ ఏకైక టెస్టు డ్రా
♦ బంగ్లా తొలి ఇన్నింగ్స్ 256 ఆలౌట్
♦ రాణించిన అశ్విన్, హర్భజన్
♦ గురువారం నుంచి వన్డే సిరీస్
ఆటగాళ్ల పట్టుదల కంటే వరుణుడి ప్రభావమే అధికంగా కనిపించిన భారత్, బంగ్లాదేశ్ టెస్టు మ్యాచ్లో ఊహించిన ఫలితమే వచ్చింది. ఆఖరి రోజు భారత స్పిన్నర్లు సత్తా చాటినా... వర్షం కారణంగా తొలి సెషన్ ఆట రద్దు కావడంతో ఇరు జట్లు ‘డ్రా’తో సంతృప్తి పడ్డాయి. ఓవరాల్గా పొట్టి ఫార్మాట్లో చూపెట్టిన ఫామ్ను టీమిండియా టెస్టులోనూ కొనసాగించడం సానుకూలాంశం కాగా, సుదీర్ఘకాలం తర్వాత జట్టులోకి వచ్చిన ‘టర్బోనేటర్’ హర్భజన్ పూర్వపు ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.
ఫతుల్లా : ఓవైపు టెస్టు కెప్టెన్సీని విజయంతో మొదలుపెట్టాలని కోహ్లి ఆరాటం... మరోవైపు కనీసం ఆఖరి రోజు ఆట సజావుగా సాగినా రెండుసార్లు బంగ్లాదేశ్ను ఆలౌట్ చేయాలని టీమిండియా ప్రయత్నాలు.. కానీ ఇవేమీ ఫలించలేదు. ఐదో రోజు కూడా వరుణుడు తన ప్రతాపం చూపెట్టడంతో భారత్, బంగ్లాదేశ్ల మధ్య ఆదివారం ముగిసిన ఏకైక టెస్టు ‘డ్రా’ అయ్యింది. భారత స్పిన్నర్ల జోరుకు ఫాలోఆన్లో పడిన బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 23 పరుగులు చేసింది. ఈ దశలో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో ఇరుజట్ల కెప్టెన్లు ఆటను ముందుగానే ముగించారు.
అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 111/3తో ఆట కొనసాగించిన ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్లో 65.5 ఓవర్లలో 256 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్కు 206 పరుగుల ఆధిక్యం దక్కింది. ఇమ్రూల్ కైస్ (139 బంతుల్లో 72; 12 ఫోర్లు), లిట్టన్ దాస్ (45 బంతుల్లో 44; 8 ఫోర్లు, 1 సిక్స్), సౌమ్య సర్కార్ (54 బంతుల్లో 37; 7 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. అశ్విన్ 5, హర్భజన్ 3 వికెట్లు తీశారు. శిఖర్ ధావన్కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈనెల 18న తొలి మ్యాచ్తో ఈ రెండు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ మొదలవుతుంది.
అక్రమ్ను అధిగమించిన హర్భజన్
ఈ మ్యాచ్ సందర్భంగా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మరో రికార్డును సాధించాడు. అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో పాక్ బౌలింగ్ దిగ్గజం వసీమ్ అక్రమ్ (414)ను వెనక్కి నెట్టి 416 వికెట్లతో తొమ్మిదో స్థానానికి ఎగబాకాడు. బంగ్లా బ్యాట్స్మన్ కైస్ను అవుట్ చేయడం ద్వారా అతను ఈ ఘనతను అందుకున్నాడు. అక్రమ్ 104 మ్యాచ్ల్లో ఇన్ని వికెట్లు తీస్తే.. ఈ పంజాబ్ ప్లేయర్ 102 మ్యాచ్ల్లోనే సాధించాడు.
భారత్ ర్యాంక్ 4
బంగ్లాదేశ్తో మ్యాచ్ ‘డ్రా’ కావడంతో భారత్ ఐసీసీ ర్యాంకింగ్స్లో మూడో స్థానం నుంచి నాలుగో స్థానానికి పడిపోయింది. 99 పాయింట్లతో బంగ్లాదేశ్కు వెళ్లిన భారత్ ప్రస్తుతం 97 పాయింట్ల వద్ద ఉంది. పాకిస్తాన్, ఇంగ్లండ్ ఖాతాలోనూ 97 పాయింట్లు ఉన్నా.. దశాంశమానం తేడాతో కోహ్లి సేనకు నాలుగో ర్యాంక్ దక్కింది.
స్కోరు వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 462/6 డిక్లేర్డ్
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్: తమీమ్ (స్టంప్డ్) సాహా (బి) అశ్విన్ 19; కైస్ (స్టంప్డ్) సాహా (బి) హర్భజన్ 72; మొమినుల్ హక్ (సి) ఉమేశ్ (బి) హర్భజన్ 30; ముష్ఫికర్ రహీమ్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 2; షకీబ్ (సి) సాహా (బి) అశ్విన్ 9; సౌమ్య సర్కార్ (బి) ఆరోన్ 37; లిట్టన్ దాస్ (సి) రోహిత్ (బి) అశ్విన్ 44; షువగత (సి) రోహిత్ (బి) అశ్విన్ 9; తైజుల్ నాటౌట్ 16; షహీద్ (సి) ధావన్ (బి) హర్భజన్ 6; జుబేర్ రనౌట్ 0; ఎక్స్ట్రాలు: 12; మొత్తం: (65.5 ఓవర్లలో ఆలౌట్) 256
వికెట్ల పతనం : 1-27; 2-108; 3-110; 4-121; 5-172; 6-176; 7-219; 8-232; 9-246; 10-256.
బౌలింగ్ : ఇషాంత్ 7-0-24-0; అశ్విన్ 25-6-87-5; ఉమేశ్ 7-0-45-0; ఆరోన్ 9-0-27-1; హర్భజన్ 17.5-2-64-3.
బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ : తమీమ్ నాటౌట్ 16; కైస్ నాటౌట్ 7; మొత్తం: (15 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా) 23.
బౌలింగ్ : ఉమేశ్ 2-1-4-0; అశ్విన్ 6-2-8-0; హర్భజన్ 5-2-11-0; విజయ్ 1-1-0-0; ధావన్ 1-1-0-0.
సెషన్-1: ఆట రద్దు
రాత్రంతా వర్షం కురవడంతో ఉదయం ఆట సాధ్యం కాలేదు. దీంతో తొలి సెషన్లో ఒక్క బంతి కూడా పడలేదు. ఓవరాల్గా ఐదు రోజుల్లో మొత్తం 250 ఓవర్ల ఆట నష్టమైంది.
సెషన్-2 : అశ్విన్ హవా
111/3 ఓవర్నైట్ స్కోరుతో ఆఖరి రోజు ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాను అశ్విన్, హర్భజన్లు దెబ్బతీశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. సెషన్ మొదలైన మూడో ఓవర్లోనే అనుభవజ్ఞుడు షకీబ్ (9)ను అశ్విన్ అవుట్ చేశాడు. తర్వాత సౌమ్య సర్కార్, కైస్లు కొద్దిసేపు ఎదురుదాడి చేయడంతో స్కోరు బోర్డు వేగంగా కదలింది. అయితే ఆరు బంతుల వ్యవధిలో ఈ ఇద్దరు అవుట్ కావడంతో బంగ్లా 176 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఈ ఇద్దరు ఐదో వికెట్కు 51 పరుగులు జోడించారు. ఈ దశలో కొత్త కుర్రాడు లిట్టన్ దాస్ భారీ షాట్లతో విరుచుకుపడినా... రెండో ఎండ్లో షువగత (9) నిరాశపర్చాడు.
ఓవర్లు: 27.1; పరుగులు: 108; వికెట్లు: 4
సెషన్-3 : చకచకా వికెట్లు
క్రీజులో కుదురుకున్న లిట్టన్ టీ తర్వాత జోరు పెంచే ప్రయత్నం చేశాడు. తైజుల్ (16 నాటౌట్) కూడా సమయోచితంగా స్పందించడంతో బంగ్లా ఫాలోఆన్కు అవసరమైన పరుగులు చేస్తుందని భావించారు. అయితే అశ్విన్ ఎక్స్ట్రా బౌన్స్తో వేసిన బంతి ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకోని లెగ్సైడ్లో నేరుగా రోహిత్ చేతిలోకి వెళ్లడంతో లిట్టన్ అవుటయ్యాడు. తర్వాత షాహిద్ (6), జుబేర్ (0)లు కూడా విఫలం కావడంతో ఫాలోఆన్కు 7 పరుగుల దూరంలో బంగ్లా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించినా... తమీమ్ (16 నాటౌట్), కైస్ (7 నాటౌట్)లు ఫలితం రాదని తేలడంతో నెమ్మదిగా ఆడారు. బౌలర్లను మారుస్తూ కోహ్లి ఒత్తిడి పెంచే ప్రయత్నం చేసినా ఈ ఇద్దరు ఓపిగ్గా ఆడి వికెట్ ఇవ్వలేదు.
ఓవర్లు: 23.3; పరుగులు: 60; వికెట్లు: 3