హైదరాబాద్‌లో స్టార్‌ క్రికెటర్ల సందడి

Pujara and  Jadeja in hyderabad for Vijay Hazare one day trophy - Sakshi

 నేటి నుంచి విజయ్‌ హజారే ట్రోఫీ

 బరిలో జడేజా, పుజారా, రాబిన్‌ ఉతప్ప

 తొలి మ్యాచ్‌లో సర్వీసెస్‌తో హైదరాబాద్‌ ‘ఢీ’

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో అంతర్జాతీయ క్రికెటర్ల సందడి మొదలైంది. దేశవాళీ క్రికెట్‌ టోర్నీ విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా గ్రూప్‌ ‘డి’ మ్యాచ్‌లకు హైదరాబాద్‌ ఆతిథ్యం ఇవ్వనుండటంతో ఆయా జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్న స్టార్‌ క్రికెటర్లు నగరానికి విచ్చేశారు. ఈ గ్రూప్‌లో ఆతిథ్య హైదరాబాద్‌తో పాటు విదర్భ, సర్వీసెస్, ఛత్తీస్‌గఢ్, సౌరాష్ట్ర, జార్ఖండ్, జమ్మూకశ్మీర్‌ జట్లు బరిలో దిగనున్నాయి. నేటినుంచి ఈ నెల 14 వరకు జరుగనున్న ఈ టోర్నీలో భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన మొహమ్మద్‌ సిరాజ్, రవీంద్ర జడేజా, చతేశ్వర్‌ పుజారా, రాబిన్‌ ఉతప్ప, వసీమ్‌ జాఫర్, ఉమేశ్‌ యాదవ్, వరుణ్‌ అరోన్, జైదేవ్‌ ఉనాద్కట్‌లతో పాటు పర్వేజ్‌ రసూల్, ఇషాన్‌ కిషన్, సౌరభ్‌ తివారి, అనుకూల్‌ రాయ్, ఫైజ్‌ ఫజల్, రజనీశ్‌ గుర్బానీ ఆయా రాష్ట్ర జట్ల తరఫున బరిలోకి దిగనున్నారు.

తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ జట్టు సర్వీసెస్‌తో తలపడనుంది. ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియం వేదికగా సోమవారం జరుగనున్న ఈ మ్యాచ్‌లో హైదరాబాద్‌కు అక్షత్‌ రెడ్డి సారథ్యం వహించనున్నాడు. సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టోర్నీ వివాదం నేపథ్యంలో స్టార్‌ ప్లేయర్‌ అంబటి రాయుడుపై రెండు మ్యాచ్‌ల నిషేధం విధించడంతో అతను అందుబాటులో లేకుండా పోయాడు. సిరాజ్, ప్రజ్ఞాన్‌ ఓజా, ఆశిష్‌ రెడ్డి, ఆకాశ్‌ భండారి, మెహదీ హసన్, రవితేజ, సుమంత్‌ కొల్లాలతో హైదరాబాద్‌ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top