ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కోహ్లి

Kohli Keeps His Promise Gets Charulata Patel World Cup Tickets - Sakshi

బర్మింగ్‌హామ్ ‌: టీమిండియా సారథి విరాట్‌ కోహ్లి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌ తదుపరి మ్యాచ్‌, రెండు సెమీఫైనల్స్‌‌, ఫైనల్‌ మ్యాచ్‌ టికెట్లను 87 ఏళ్ల క్రికెట్‌ వీరాభిమాని చారులత పటేల్‌కు అందేలా చేశాడు. ఈ విషయాన్ని చారులత పటేల్‌ మనవరాలు అంజలీ పటేల్‌ వెల్లడించారు. దీంతో సోషల్‌మీడియా వేదికగా విరాట్‌ కోహ్లిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోహ్లి ఆటతోనే కాకుండా మంచి మనసుతో అభిమానుల మనసులను గెలుచుకున్నాడని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. (చదవండి: బామ్మ అభిమానానికి కోహ్లి ఫిదా!
ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియా-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 87 ఏళ్ల క్రికెట్‌ అభిమాని చారులత పటేల్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుండగా.. చెంపలకు మువ్వన్నెల రంగులు వేసుకోని చేతిలో త్రివర్ణపతాకంతో ఈ బామ్మ తెగ సందడి చేసింది. మ్యాచ్ ఆద్యంతం ఆమె టీమిండియాకు మద్దతు పలకడం అందరినీ ఆకట్టుకుంది. బామ్మగారి హడావుడిని టీవీలో పదేపదే చూపించడం, అభిమానానికి వయసుతో సంబంధంలేదని కామెంటేటర్స్‌ కొనియాడటం.. ప్రేక్షకులను ఆకర్షించింది. (చదవండి: పంత్‌.. నీ ఆట ఎంతో ఘనం)
 
మ్యాచ్‌ అనంతరం సారథి విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ప్రేక్షకుల గ్యాలరీలో ఉన్న బామ్మని ప్రత్యేకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అంతేకాకుండా భారత్‌ మిగిలిన మ్యాచ్‌లకు మద్దతుగా స్టేడియానికి రావాలని కోహ్లి ఆహ్వానించాడు. ఈ క్రమంలో మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్లను తాను ఏర్పాటు చేస్తానని మాట ఇచ్చాడు. దీనిలో భాగంగానే కోహ్లి ఆ బామ్మకు టికెట్లు పంపించాడు. ఇక ఈ క్రికెట్‌ వీరాభిమానికి మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా కూడా ఫిదా అయ్యారు. ఆ బామ్మ హాజరయ్యే తదుపరి క్రికెట్‌ మ్యాచ్‌లకు తాను స్పాన్సర్‌గా వ్యవహరిస్తానని ట్వీట్‌ చేశారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top