
సాక్షి,న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్గా రాహుల్ పగ్గాలు చేపట్టేందుకు సర్వం సిద్ధమైంది. అధ్యక్ష రేసులో ఎవరూ లేకపోవడంతో రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమవుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. షెడ్యూల్ ప్రకారం సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ గడువు ముగుస్తుంది. రాహుల్ సోమవారమే నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన ఒక్కరే నామినేషన్ వేస్తే అదే రోజు పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైనట్టు ప్రకటించే అవకాశం ఉంది.
అయితే షెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న పార్టీ అధ్యక్ష ఎన్నికలు, 19న కౌంటింగ్ చేపట్టాల్సి ఉంది. పార్టీ చీఫ్గా రాహుల్ మినహా మరే నేత బరిలో దిగే అవకాశం లేకపోవడంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. రాహుల్ తరపున పలు రాష్ట్రాల పార్టీ యూనిట్లు నామినేషన్లు దాఖలు చేస్తుండటంతో ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో అధ్యక్ష ఎన్నికల కోలాహలం నెలకొంది.