
పోర్బందర్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మత్స్యకారులతో సభను నిర్వహించారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన రాహుల్.. పనిలోపనిగా వారికి ప్రత్యేక వరాన్ని ప్రకటించాడు.
గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ గనుక అధికారంలోకి వస్తే మత్స్యకారుల సంక్షేమం కోసం కృషి చేస్తామని.. ఇందుకోసం మంత్రిత్వ శాఖను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ‘‘గుజరాత్ కేవలం పారిశ్రామికవేత్తలకు చెందింది కాదు. రైతులు, కూలీలు, చిరు వ్యాపారస్థులు కూడా రాష్ట్ర అభివృద్ధికి దోహదపడ్డారు. కానీ, గత కొన్నేళ్లుగా ఇక్కడి ప్రభుత్వం వారి సంక్షేమం గురించి పట్టించుకోవటమే మానేసింది. కొందరు వ్యాపారస్థుల కోసమే పని చేయటం ప్రారంభించింది. అందుకు ప్రతిఫలంగా ఎన్నికల ప్రచార సమయంలో వారి నుంచి లబ్ధి కూడా పొందారు’’ అని ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ ఆరోపణలు గుప్పించారు.
ప్రధాని మోదీని కాంగ్రెస్ చెప్పేది వినమని కోరుకోవటం లేదని.. ప్రజల గోడును పట్టించుకోమనే కోరుతున్నామని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం కోసం 33,000 వేల కోట్లను కేటాయిస్తే.. టాటా నానో ఫ్యాక్టరీల కోసం 33,000 కోట్లు కేటాయించామని మోదీ గర్వంగా చెప్పుకోవటం సిగ్గుచేటన్నారు. ఒక వ్యక్తి వేల కోట్ల రూపాయలు ధారపోసే ఈ ప్రభుత్వం.. మత్స్యకారుల కోసం 300 కోట్లు కూడా కేటాయించకపోవటం దారుణమని రాహుల్ వ్యాఖ్యానించారు. నోట్ల రద్దు నల్ల డబ్బును తెల్లడబ్బుగా మార్చేందుకు తప్ప ఎందుకూ పనికి రాలేదన్నాడు. గుజరాత్ ప్రజలకు మంచి రోజులు రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని రాహుల్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.