
అనంతపురం: ఎంపీ జేసీ దివాకర్రెడ్డి దళితులను కించపరిచే విధంగా మరోసారి నోరుజారి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెనుదుమారం రేపుతున్నాయి. ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్పై టీడీపీ మహానాడు వేదికపైనుంచి ఎంపీ జేసీ దివాకర్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా ‘అనంత’లో ఆ పార్టీ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించాయి. ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నా ఓబులేసు ఆధ్వర్యంలో దిష్టిబొమ్మ శవయాత్ర నిర్వహించి దహనం చేసేందుకు ప్రయత్నించారు.
శనివారం అనంతపురంలోని తన నివాసంలో జేసీ విలేకరులతో మాట్లాడుతూ ‘‘నా శవయాత్ర చేశారు. అంతమంది కొడుకులు నాకున్నారని తెలీదు. శవాన్ని తీసుకెళ్లి ఊరేగింపు నిర్వహించి దహనం చేసేది కొడుకులే. ఈ జిల్లాలో నాకు ఇంత మంది కొడుకులా? ఎప్పుడు కనింటినో ఏమో నాకే తెలీదు.’’ అని వాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై దళిత సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
జేసీ నోరు జాగ్రత్త...: దళిత, గిరిజనులంటే ఎప్పుడూ జేసీ కుటుంబానికి చులకనే. ఇటీవల మహానాడులో ఎరుకుల కులస్తులను కించపరిచేలా మాట్లాడాడు. దిష్టిబొమ్మను శవయాత్ర చేసిన మమ్ముల్ని నా కొడుకులు అని మాట్లాడాడు.మొత్తం దళిత జాతిని కించపరిచాడు. ప్రజాప్రతినిధి అనే స్పృహ జేసీకి ఉందా? గతంలో సామాజిక మాధ్యమాల్లో అతని గురించి కొత్తకొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. చేతనైతే వాటిపై సమాధానం చెప్పాలి. మా నాయకుడు వైఎస్ జగన్ సభ్యత, సంస్కారం నేర్పారు. జేసీ.. నోరు అదుపులో పెట్టుకో.. లేకుంటే దళితజాతి సత్తా ఏమిటో చూపిస్తాం.