ఆగని పాక్ దురాగతం | Pak incessant atrocity | Sakshi
Sakshi News home page

ఆగని పాక్ దురాగతం

Oct 25 2016 2:25 AM | Updated on Mar 23 2019 8:40 PM

ఆగని పాక్ దురాగతం - Sakshi

ఆగని పాక్ దురాగతం

జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది.

కాల్పుల్లో చిన్నారి, జవాను మృతి...
- 9 మందికి గాయాలు
- మిలిటరీ పోస్టులు, పౌరులు లక్ష్యంగా దాడులు
 
 జమ్మూ: జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దులో పాకిస్తాన్ మళ్లీ కాల్పులకు తెగబడింది. ఆదివారం రాత్రి నుంచి మోర్టార్ బాంబులు, ఆటోమేటిక్ ఆయుధాలతో విచక్షణారహితంగా జరిపిన దాడుల్లో ఆరేళ్ల చిన్నారి బలయ్యాడు. తీవ్రంగా గాయపడిన బీఎస్‌ఎఫ్ జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. మరో 9 మంది గాయపడగా... ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది.  కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించిన పాక్ సైన్యం... 25 సరిహద్దు ఔట్‌పోస్టు (బీఓపీ)లు, జమ్మూ జిల్లాలోని నివాస ప్రాంతాలైన ఆర్‌ఎస్ పురా, ఆర్నియా, సుచేత్‌గఢ్, కనచక్, పర్గ్వాల్ సెక్టార్లలో అసాధారణ రీతిలో కాల్పులు జరిపింది. 

రాత్రంతా లాల్యాల్-గర్ఖాల్ ప్రాంతంలోని బంకర్లలో ఉన్న బిహార్ కార్మిక కుటుంబానికి చెందిన విక్కీకుమార్ ఆడుకునేందుకు బయటకు వెళ్లిన వెంటనే మోర్టార్ బాంబు శకలం తగిలి మరణించాడు. ఆర్‌ఎస్ పురాలో హరియాణ కురుక్షేత్రకు చెందిన బీఎస్‌ఎఫ్ జవాను సుశీల్‌కుమార్ మెడకు బాంబు శకలం తగిలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. కాగా, 30కి పైగా పశువులు కూడా కాల్పుల్లో మరణించాయని, మరో 130 గాయపడ్డాయని అధికారులు తెలిపారు. పాక్ దాడులను సరిహద్దు భద్రతా దళాలు (బీఎస్‌ఎఫ్) సమర్థవంతంగా తిప్పికొడుతున్నాయన్నారు.

 భారతే కవ్వించింది: పాక్
 భారత సైనికులు హర్పాల్, పుఖ్లియన్, చర్వా సరిహద్దుల్లో కాల్పులు జరిపారని, ఇందులోఆరు నెలల పసిబిడ్డ సహా మరో పౌరుడు మరణించారని పేర్కొంది. ఏడుగురు గాయపడ్డారని వెల్లడించింది.

 ఉగ్రవాది హతం
 శ్రీనగర్: కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా లోలబ్‌లో ఆదివారం భద్రతా దళాలు జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. అతడి వివరాలు తెలియాల్సి ఉందని ఆర్మీ అధికారి ఒకరు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement