ముంబై: మార్కెట్లో అవసరాలు తీర్చే యాప్స్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా వేడి వేడి ఆహారాన్ని నిమిషాల్లో డెలివరీ చేసే యాప్స్కు యమ క్రేజీ ఉంది. అయితే లాక్డౌన్ వల్ల ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఇవి నిత్యావసరాలను కూడా డెలివరీ చేయడానికి పూనుకున్నాయి. అయితే కిరాణా సామాగ్రి నుంచి ఆహారం వరకు అన్నింటినీ క్షణాల్లో తెచ్చి పట్టే యాప్ ‘డుంజో’. ఇది హైదరాబాద్ కన్నా ముంబై, చెన్నై నగరాల్లో బాగా పాపులర్. డుంజో గత నెలలో జనాలు ఫార్మసీకి సంబంధించి ఏ వస్తువులను ఎక్కువగా ఆర్డర్ చేశారన్న విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం చెన్నై, జైపూర్వాసులు హ్యాండ్వాష్ను ఎక్కువగా ఆర్డర్ చేశారు. (బగ్గా వైన్ షాప్ పేరుతో ఆన్లైన్లో మోసం)
తద్వారా కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు శుభ్రతే ప్రధాన అవసరమని గుర్తించినట్లున్నారు. బెంగళూరు, పుణె నగరాల్లో ప్రెగ్నెన్సీ కిట్లను అధికంగా డెలివరీ చేశారు. అన్నింటికన్నా భిన్నంగా ముంబైవాసులు ఆర్డర్ చేసినవాటిలో కండోమ్స్ మొదటి స్థానంలో ఉంది. "ఇలాంటి విషమ పరిస్థితుల్లోనూ ఇదేం కక్కుర్తి" అని సోషల్ మీడియాలో నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. ఇక హైదరాబాద్ విషయానికొస్తే మన భాగ్యనగర వాసులు ఐ-పిల్ అనే గర్భనిరోధక మాత్రలను విచ్చలవిడిగా వాడేశారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇదే నిజమని డుంజో చెప్పుకొచ్చింది. (‘ఆన్లైన్’ అమ్మకాలకు ప్రోత్సాహం)