మద్యం మాఫియా ఆగడం : జర్నలిస్టు మృతి
లక్నో: యూపీలో లిక్కర్ మాఫియా బరితెగించింది. సహరన్పూర్లో ఆదివారం ఓ జర్నలిస్ట్, ఆయన సోదరుడిని మద్యం మాఫియా కాల్చిచంపిన ఘటన కలకలం రేపింది. ప్రముఖ హిందీ వార్తాపత్రికలో పనిచేసే జర్నలిస్ట్ను గతంలోనూ పలు సందర్భాల్లో మద్యం మాఫియా బెదిరించిందని సమాచారం. దుండగుల కాల్పుల్లో గాయపడిన జర్నలిస్ట్ ఆశిష్ జన్వాని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించగా, ఆయన సోదరుడు ఘటనా స్ధలంలోనే మరణించారు. ఈ ఘటనకు సంబందించి పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు.
జర్నలిస్ట్ను మద్యం మాఫియా హతమార్చడంతో ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తనకు బెదిరింపులు రావడంపై ఆశిష్ పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని స్ధానికులు ఆరోపించారు. కాగా మద్యం మాఫియా జర్నలిస్టుపై కాల్పులు జరిగిన సమాచారం అందగానే డీఐజీ ఉపేంద్ర అగర్వాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతులకు రూ 5 లక్షల చొప్పున యూపీ ప్రభుత్వం పరిహారం ప్రకటించింది.