పట్టాలు తప్పిన జనతా ఎక్స్ప్రెస్ | Janta Express derailed in Rae Bareli, over 12 people | Sakshi
Sakshi News home page

పట్టాలు తప్పిన జనతా ఎక్స్ప్రెస్

Mar 20 2015 12:57 PM | Updated on Sep 2 2017 11:09 PM

పట్టాలు తప్పిన జనతా ఎక్స్ప్రెస్

పట్టాలు తప్పిన జనతా ఎక్స్ప్రెస్

డెహ్రాడూన్-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్ప్రెస్ శుక్రవారం పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు.

రాయబరేలీ:  డెహ్రాడూన్-వారణాసి మధ్య నడిచే జనతా ఎక్స్ప్రెస్ శుక్రవారం ఉత్తరప్రదేశ్ రాయబరేలీ జిల్లాలోని బచ్రావాన వద్ద పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతి చెందారు. దాదాపు 150 మంది గాయపడ్డారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను వైద్య చికిత్స నిమిత్తం లక్నోలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. జనతా ఎక్స్ప్రెస్ రైలు డెహ్రాడూన్ నుంచి వారణాసి వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.  

ఇంజన్తోపాటు రెండు బోగీలు పట్టాలు తప్పటంతో అందులోని ప్రయాణికులు గాయపడ్డారు. మరోవైపు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ప్రమాద ఘటనపై రైల్వే మంత్రిత్వశాఖ విచారణకు ఆదేశించింది. వారణాసి - డెహ్రాడూన్ రైలు మార్గంలోని రైళ్లను మరో మార్గం ద్వారా మళ్లిస్తున్నారు.

రైలు ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో మృతులకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ఇవ్వనున్నట్లు ఆయన ప్రకటించారు. రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ప్రమాదం జరిగిన ప్రాంతానికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించ వచ్చని ఉన్నతాధికారులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement