వరుడి తల్లి చదువుకుంటేనే!

Indian Human Development Survey Statistics - Sakshi

కులాంతర వివాహాలకు ఓకే..

ప్రభావం చూపని పెళ్లి కూతురు తల్లి విద్య..

భారత దేశ వివాహ వ్యవస్థలో కుటుంబ నిర్ణయాలే ప్రధానం. మనదేశంలో జరుగుతున్న పెళ్లిళ్లలో వ్యక్తిగత ఇష్టాయిష్టాలకంటే కుటుంబ నిర్ణయాలకే ప్రాధాన్యం ఎక్కువ. 2011 లెక్కల ప్రకారం మన దేశంలో 73 శాతం పెళ్లిళ్లు పెద్దలు కుదిర్చినవే. వారిలో అతి కొద్ది మందికి మాత్రమే తాము చేసుకోబోయే వారితో కనీస పరిచయం ఉంటోంది.

63 శాతం మంది పెళ్లి రోజు వరకూ ఒకరినొకరు చూసుకోనివారే ఉన్నారు. తాజా అధ్యయనం మాత్రం తల్లి చదువు కులాంతర వివాహాలకు ఊతమిస్తోందని తేల్చి చెప్పింది. గత నలభయ్యేళ్లుగా మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతమే. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో కులాంతర వివాహాలు 5.82 శాతం మాత్రమే. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం గత నలభయ్యేళ్లుగా కులాంతర వివాహాల శాతం అదేమాదిరిగా కొనసాగడం.

కులాంతర వివాహాలకు ప్రోత్సాహం..
భారత్‌లో కులాంతర వివాహాలను అమితంగా ప్రభావితం చేస్తున్న అంశం చదువేనని తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. కులాంతర వివాహాల సానుకూలతకు కారణం పెళ్లి కొడుకు చదువో, పెళ్లి కూతురు చదువో కాదట. పెళ్లి కుమారుడి తల్లి చదువేనట.

పెళ్లి కుమారుడి తల్లి విద్యావంతురాలైతే కులాంతర వివాహాలకు కుటుంబాల్లో సానుకూలత ఉంటున్నట్లు ఢిల్లీకి చెందిన ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌ తాజా అధ్యయనం తేల్చి చెప్పింది. 2011–12 ఇండియన్‌ హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ సర్వే గణాంకాల ఆధారంగా 2017లో చేసిన ఈ అధ్యయనం మనదేశంలోని కులవ్యవస్థకు సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను వెలుగులోకి తెచ్చింది. చదువుకున్న తల్లులు కులాల కట్టుబాట్ల విషయంలో మరింత చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఈ అధ్యయనం వెల్లడించింది.

వరుడి తల్లి విద్యాధికురాలైతే కులాంతర వివాహాల్లో దేశం పదేళ్ల ముందుంటుందని ఈ సర్వే తేల్చింది. పెళ్లి కొడుకు తల్లి చదువుకున్న కుటుంబాల్లో 1.8 శాతం కులాంతర వివాహాలు జరిగినట్లు వెల్లడయ్యింది. అయితే పెళ్లి కూతురి తల్లి చదువు కులాంతర వివాహాలను ప్రభావితం చేయడం లేదన్నది గమనార్హం.
కుటుంబాలు, దగ్గరి బంధువులు, సంబంధీకుల మధ్య వివాహాల్లో మన దేశానికి, ఇతర దేశాలకి పోలిక లేదని ఈ అధ్యయనం తేల్చి చెప్పింది. దీనికి మనదేశంలో కుటుంబ వ్యవస్థ పునాదులు బలీయమైనవి కావడమేననీ, కుటుంబాల్లో వ్యక్తిగత స్వేచ్ఛకు అంత ప్రాధాన్యం లేకపోవడం కూడా ప్రధాన కారణంగా ఈ సర్వే వెల్లడించింది.  
సహజంగా పారిశ్రామికీకరణ, విద్యాభివృద్ధి, పట్టణీకరణ, సామాజిక చైతన్యం వల్ల దగ్గరి సంబంధాల వివాహాలు తగ్గి, కులాంతర, వర్గాంతర వివాహాలు పెరుగుతాయని భావిస్తారు. కానీ వీటన్నింటిలో అభివృద్ధి కనబడుతున్నా 1970 నుంచి 2012 వరకు కులాంతర వివాహాలు మాత్రం పెరగకపోవడాన్ని బట్టి మోడర్నైజేషన్‌ థియరీ తప్పు అని తేలింది. గ్రామీణ ప్రాంతాలకంటే మెట్రోపాలిటన్‌ సిటీస్‌లో కులాంతర వివాహాలు తక్కువని కూడా స్పష్టమైంది.
పెళ్లి కుమారుడు, పెళ్లికూతురి తరఫు ఆర్థిక స్తోమత సైతం కులాంతర వివాహాలను ప్రభావితం చేయట్లేదు. పైగా ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నాయి.
దళితుల్లో ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు పెరుగుతున్నాయి.
అగ్రకులాల్లో ఆర్థిక స్తోమత పెరిగే కొద్దీ కులాంతర వివాహాలు తగ్గుతున్నట్టు తేల్చి చెప్పింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top