
దయ్యాల వల్లే చనిపోయారట!
రైతుల ఆత్మహత్యలకు దయ్యాలే కారణమట! ఈ మాట చెప్పింది ఏ మంత్రగాడో కాదు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం, అదీ అసెంబ్లీలో.
భోపాల్: రైతుల ఆత్మహత్యలకు దయ్యాలే కారణమట! ఈ మాట చెప్పింది ఏ మంత్రగాడో కాదు. సాక్షాత్తూ ఒక రాష్ట్ర ప్రభుత్వం, అదీ అసెంబ్లీలో. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సొంత జిల్లా సెహోర్లో గత మూడేళ్లలో 418 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకు కారణం ఆర్థిక బాధలు కాదని, దయ్యాలని హోం మంత్రి భూపేంద్ర అసెంబ్లీలో బుధవారం చెప్పారు. తమవారు దయ్యాల వల్లే చనిపోయారని ఆత్మహత్య చేసుకున్న రైతుల బంధువులిచ్చిన సమాచారం ఆధారంగానే ఈ వివరాలు ఇస్తున్నట్లు వివరించారు.
విపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేంద్ర పటేల్ అడిగిన ప్రశ్నకు మంత్రి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. దయ్యాలు ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం నమ్ముతుందా అని పటేల్ ప్రశ్నించారు. అసెంబ్లీ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ... రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వం చెప్పిన సమాధానం హాస్యాస్పదంగా ఉందని వ్యాఖ్యానించారు. 418 మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటే 117 మంది బలవన్మరణాలకు కారణాలు నమోదు చేయలేదన్నారు.