షాకింగ్‌.. లైంగిక వేధింపుల డీజీపీకి సెల్యూట్‌.. | Sakshi
Sakshi News home page

షాకింగ్‌.. లైంగిక వేధింపుల డీజీపీకి సెల్యూట్‌..

Published Mon, Jan 29 2018 11:34 AM

Former cop found guilty of molestation invited to Republic Day - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో దోషి అయిన ఓ మాజీ పోలీసు అధికారికి పవిత్రమైన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చోటుకల్పించారు. జిల్లా స్థాయిలో నిర్వహిస్తున్న పరేడ్‌కు ఆహ్వానించి ముందు వరుసలో ఓ ఎస్పీ పక్కన కూర్చొబెట్టారు. అంతేకాగు ఓ గార్డుతో ఆయనకు సెల్యూట్‌ కూడా చేయించారు. ఈ సంఘటన హర్యానాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఒకప్పుడు డీజీపీగా పనిచేసిన ఎస్‌పీఎస్‌ రాథోర్‌పై 14 ఏళ్ల బాలిక రుచి గిర్హోత్రాపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు నమోదైన విషయం తెలిసిందే.

ఈ ఘటన చోటుచేసుకున్న 19 ఏళ్లకు సీబీఐ కోర్టు 2009లో ఆయనను దోషిగా ప్రకటించింది. ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా ఆమోదించింది. అలాంటి తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్న ఒక వ్యక్తిని ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎలా ఆహ్వానించి గౌరవిస్తారని ఇప్పుడు పలువురు మండిపడుతున్నారు. 1990 ఆగస్టు 12న పంచకులలోని తన నివాసంలో రాథోర్‌ 14 ఏళ్ల రుచి గిర్హోత్రాపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాధితురాలు మరొక సాక్షి కలిసి కేసు పెట్టగా దాదాపు మూడేళ్ల తర్వాత పోలీసుల వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ కేసులో దాదాపు 26 ఏళ్లపాటు పోరాటం చేసిన ఆనందర్‌ ప్రకాశ్‌ అనే వ్యక్తి ఈ ఏడాది జనవరి 12న చనిపోయారు.

Advertisement
Advertisement