ఆ వార్తను పోస్ట్‌ చేసింది మీరేనా? | Facebook Official Meet User on Fake News Post | Sakshi
Sakshi News home page

ఆ వార్తను పోస్ట్‌ చేసింది మీరేనా?

Apr 10 2019 10:24 AM | Updated on Apr 10 2019 10:24 AM

Facebook Official Meet User on Fake News Post - Sakshi

తప్పుడు వార్తలు, నకిలీ వీడియోల ఆరోపణలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ఫేస్‌బుక్‌ తాజాగా మరో వివాదంలో చిక్కుకుంది. ఫేస్‌బుక్‌లో ఒక రాజకీయ వార్తను పోస్టు చేసిన యూజర్‌ ఇంటికి ఫేస్‌బుక్‌ ప్రతినిధి స్వయంగా వెళ్లి ఆ వార్తను పోస్టు చేసింది అతనేనా కాదా అన్నది నిర్ధారణ చేసుకున్నట్టు ఐఏఎన్‌ఎస్‌ వార్తా సంస్థ తెలిపింది. న్యూఢిల్లీ వాసి అయిన ఆ యూజర్‌ ఇంటికి ఫేస్‌బుక్‌ ప్రతినిధి వెళ్లి ఆధార్‌ కార్డు తదితర ధ్రువీకరణ పత్రాలు అడిగారని తెలిపింది. అయితే, ఆ యూజర్‌ పేరు వెల్లడించలేదు. ‘పాస్‌పోర్టు వెరిఫికేషన్‌ కోసం పోలీసులు ఇంటికి వచ్చినట్టు ఫేస్‌బుక్‌ ప్రతినిధి మా ఇంటికి వచ్చారు. ఆయన తన గురించి చెప్పడంతో షాక్‌కు గురయ్యా. ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది నేనేనని నిర్ధారణ చేసుకోవడం కోసం నా ఆధార్‌ కార్డు, ఇతర సర్టిఫికెట్లు అడిగారాయన.

కేవలం ఒక పోస్టు కోసం ఫేస్‌బుక్‌ ప్రతినిధే స్వయంగా రావడం నాకు ఆశ్చర్యం కలిగించింది’ అన్నారా యూజర్‌. యూజర్‌ ఇంటికి ప్రతినిధిని పంపడం ఫేస్‌బుక్‌ చరిత్రలో ఇంత వరకు జరగలేదు. ఈ విషయమై వివరణ కోరడానికి వార్తా సంస్థ రెండు ఈ–మెయిళ్లు పంపినా అటు నుంచి సమాధానం రాలేదు. ఫేస్‌బుక్‌ చర్య కచ్చితంగా వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించడమేనని సైబర్‌ నిపుణులు అంటున్నారు. పోస్టుపై అనుమానం వస్తే దాన్ని తొలగించడమో, సదరు యూజర్‌ ఖాతాను రద్దు చేయడమో చేయాలే కాని ఇలా ఇంటికి మనిషిని పంపడం దారుణమని, ఇది గోప్యత హక్కును కాలరాయడమేనని సైబర్‌ లా నిపుణుడు పవన్‌ దగ్గల్‌ అంటున్నారు. ఇది ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టాన్ని అతిక్రమించడమేనని కూడా అన్నారు. ఇలాంటిది జరిగినప్పుడు యూజర్‌ ఫేస్‌బుక్‌పై కేసు పెట్టవచ్చని, ఇలాంటి చర్యలకు అనుమతించినందుకు ప్రభుత్వాన్ని కూడా కోర్టుకు లాగవచ్చని దగ్గల్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement