లాక్డౌన్: ఆత్మహత్యకు యత్నించిన కానిస్టేబుల్
భోపాల్: మండుటెండలను లెక్క చేయకుండా పోలీసులు విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా భయాన్ని పక్కనపెట్టి ప్రజల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఏ పూటకో ఇంటికి చేరుకుంటున్నారు. అయితే ఈ డ్యూటీ ఒత్తిడిని తట్టుకోలేక ఓ పోలీసు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మధ్యప్రదేశ్లో చోటు చేసుకుంది. భోపాల్కు చెందిన పోలీసు కానిస్టేబుల్ చేతన్ సింగ్ రెండు నెలల క్రితం విధుల్లోకి చేరాడు. ప్రస్తుతం విధించిన లాక్డౌన్ వల్ల అధిక పని ఒత్తిడితో సతమతమవుతున్నాడు. (కరోనా: యువత..జాగ్రత్త!)
అంతేకాక ఈ విధుల వల్ల తనకు కూడా కరోనా వైరస్ సంక్రమిస్తుందని భయాందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం డ్యూటీ చేస్తున్న సమయంలో తొలుత సర్వీస్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపాడు. అనంతరం తన ఎడమ చేతిపై కాల్చుకున్నాడు. దీంతో గాయపడ్డ కానిస్టేబుల్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఇదిలావుండగా భోపాల్లో ఇప్పటివరకు 10 మందికి పైగా పోలీసు అధికారులు కరోనా బారిన పడ్డారు. (కరోనా: నిర్లక్ష్యం వైరస్)