
రైతు రుణమాఫీకి ప్రయత్నిస్తున్నాం: యనమల
రైతు రుణమాఫీకి ఆర్బీఐతో ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు.
సాక్షి, న్యూఢిల్లీ: రైతు రుణమాఫీకి ఆర్బీఐతో ప్రయత్నాలు చేస్తున్నామని ఏపీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ప్రభుత్వం రుణమాఫీకి కట్టుబడి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. డ్వాక్రా గ్రూపులు, ఎస్సీ, ఎస్టీ, బీసీలు, రైతుల రుణాలు మాఫీ చేయాలంటే రూ.45 వేల కోట్లు అవసరం ఉంటుం దని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీకి రూ.5 వేల కోట్లను టోకెన్ నిధులుగా కేటాయించినట్టు చెప్పారు.
పబ్లిక్ ప్రైవేటు భాగస్వామ్యం కింద పరిశ్రమలను అభివృద్ధి చేస్తామని చెప్పారు. డ్వాక్రాగ్రూపులు, ఎస్సీ,ఎస్టీ, బీసీలకు కావాల్సిన నిధులను బడ్జెట్లో కేటాయించామన్నారు. భవిష్యత్ స్వర్ణాంధ్రప్రదేశ్కు ఈ బడ్జెట్ పునాదిలాంటిదన్నారు. విశాఖపట్నం విమానాశ్రయానికి ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం కల్పించాలని, అలాగే తిరుపతి, విజయవాడ విమానాశ్రయాలను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అప్గ్రేడ్ చేస్తూ ‘వీసా ఆన్ అరైవల్’ సదుపాయం కల్పిం చాలని కేంద్రాన్ని కోరామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెండింగులో ఉన్న ప్రాజెక్టుల ప్రతిపాదనలకు సత్వరమే మంజూరీ ఇవ్వాలని మంత్రి యనమల రామకృష్ణుడు కేంద్రాన్ని కోరారు. శుక్రవారం ఢిల్లీలో నిర్వహించిన సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమల రాష్ట్ర మంత్రుల సదస్సులో ఆయన మాట్లాడారు.