రకుల్‌ రేటు పెంచేసిందా.?

Rakul plans to hike remuneration - Sakshi

సాక్షి, సినిమా : ముద్దొచ్చినప్పుడే చంక ఎక్కాలన్న సామెతను నటి రకుల్‌ప్రీత్‌సింగ్‌ అక్షరాలా పాటిస్తోందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్‌ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. నిన్నటి వరకూ టాలీవుడ్‌లో అవకాశాల వరద. ఇప్పుడక్కడ రకుల్‌ దూకుడు తగ్గిందనే చెప్పాలి. అయితే కోలీవుడ్‌లో పూర్తి రివర్స్‌. మొన్నటి వరకూ ఒకే ఒక్క విజయం కోసం ఆరాటపడిన ఈ అమ్మడికి ఎట్టకేలకు కార్తీతో రొమాన్స్‌ చేసిన ధీరన్‌ అధికారం ఒండ్రు చిత్రం ఆ ముచ్చట తీర్చింది. అంతే కాదు వరుసగా అవకాశాలు లైన్‌ కడుతున్నాయి. ప్రస్తుతం సూర్యకు జంటగా సెల్వరాఘవన్‌ దర్శకత్వంలో ఎన్‌జీకే అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం నిర్మాణంలో ఉండగానే రకుల్‌ప్రీత్‌సింగ్‌ మరోసారి కార్తీతో జత కట్టడానికి రెడీ అయిపోయింది. ఇంకేముందు సక్సెస్‌ఫుల్‌ నటిగా ముద్రవేసుకున్న రకుల్‌ తన చేతి వాటాన్ని చూపించేస్తోందట. అది తనకు సక్సెస్‌ రుచి చూపించిన కార్తీ చిత్రం నుంచే మొదలెట్టేసిందట. 

తాజాగా కార్తీకి జంటగా నటిçస్తున్న ఈ చిత్రానికే తన పారితోషికాన్ని పెంచేసిందనే ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ చిత్రం ద్వారా రజత్‌ రవిశంకర్‌ అనే నవ దర్శకుడు పరిచయం అవుతున్నాడు. రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థతో కలిసి ప్రిన్స్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ కథ ఇలా ఉంటే టాలీవుడ్‌లో అవకాశాలు తగ్గుముఖం పట్టడంతో రకుల్‌ప్రీత్‌సింగ్‌ అక్కడ మాత్రం పారితోషికాన్ని తగ్గించడానికి సిద్ధమైనట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఇదంతా చూస్తుంటే నెగ్గాలంటే ఎక్కడ తగ్గాలో తెలిసిన నటి రకుల్‌ ప్రీత్‌సింగ్‌ అని అనిపిస్తోంది కదూ!
 

Read latest South India News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top