యువరక్తం.. కొత్త రూపు | New look to the CPI with youngsters | Sakshi
Sakshi News home page

యువరక్తం.. కొత్త రూపు

Jan 14 2017 2:14 AM | Updated on Sep 5 2018 9:18 PM

యువరక్తం.. కొత్త రూపు - Sakshi

యువరక్తం.. కొత్త రూపు

రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పటిష్టతపై నాయకత్వం దృష్టి సారించింది. కొత్త జిల్లాల్లో పార్టీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది.

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పటిష్టతపై నాయకత్వం దృష్టి సారించింది. కొత్త జిల్లాల్లో  పార్టీని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటోంది. యువతను పెద్ద ఎత్తున ఆకర్షించి యువరక్తాన్ని ఎక్కించడం, యువ తరానికి నాయకత్వ బాధ్యతలు అప్పగించి కొత్త రూపు ఇవ్వడంపై కసరత్తు చేస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంతోపాటు  వచ్చే ఆరునెలల కాలానికి ఉద్యమ కార్యాచరణను సీపీఐ రూపొందించుకుంది. జనవరి–జూన్‌ల మధ్యలో ఏ నెలకు ఆ నెల ప్రాధాన్యతను సంతరించుకున్న ఆయా అంశాలు, సమస్యలపై  వివిధ రూపాల్లో ఆందోళనలు, నిరసనలు నిర్వహించనుంది.

ఈ కార్యక్రమాలకు ముగింపుగా రాష్ట్ర దిగ్బంధం (తెలంగాణ బ్లాకేడ్‌)తోపాటు ఎక్కడికక్కడ మానవహారాల ఏర్పాటు ద్వారా రాజకీయంగా ప్రభావం చూపి రాష్ట్రస్థాయిలో ప్రజలను కదిలించాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్త ఉద్యమ కార్యాచరణలో భాగంగా పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు, దళితులకు 3 ఎకరాల భూమి, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు తదితర వర్గాల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ›ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని తీర్మానించింది. గతంతో పార్టీకి కంచుకోటలుగా ఉన్న గ్రామాలు, పార్టీలో క్రియాశీలక ంగా ఉంటూ, త్యాగాలు చేసిన వ్యక్తులు, కుటుంబాలను గుర్తించి, వాటిల్లో పార్టీని మళ్లీ పూర్తిస్థాయిలో బలోపేతం చేసేందుకు సన్నద్ధమవుతోంది.

కొత్తరక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు...
ఈ నెలలో పార్టీ సభ్యత్వనమోదు చేపట్టడం, యువతను పార్టీలోకి ఆకర్షించి కొత్త రక్తాన్ని నింపడం,  ఫిబ్రవరిలో మండల, గ్రామస్థాయిల్లో పార్టీ యంత్రాంగ పటిష్టం, ఏప్రిల్‌–మే నెలల్లో రాష్ట్రవ్యాప్త బస్సుయాత్రను నిర్వహించడం వంటివి నిర్వహించాలని నిర్ణయించింది. మే చివర్లో లేదా జూన్‌లో రాష్ట్ర దిగ్బంధం, మానవహారాల నిర్మాణానికి  ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. రాజకీయంగా సత్తా చాటేలా పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంతో పాటు అందుకు అనుగుణంగా పెద్ద ఎత్తున ప్రభావం చూపేలా కార్యక్రమాలను చేపట్టాలని ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది.

పార్టీకి కొత్తరూపును ఇవ్వడంలో భాగంగా  నూతన నాయకత్వాన్ని, యువతను ప్రోత్సహించాలని నిర్ణయిం చింది. వివిధస్థాయిల్లో యువతరానికి నాయకత్వ స్థానాల్లో అవకాశం కల్పించడం ద్వారా పార్టీని, కేడర్‌ను మరింత చైతన్యవంతం చేసి నూతనోత్తేజం కలిగించేలా చూడాలని భావిస్తోంది. గతంలో సీపీఐగా ఉన్న ఆదరణను తిరిగి సాధించే దిశలో తీవ్రంగా శ్రమించాలని, అందుకు అవసరమైన కార్యాచరణను, ప్రణాళికలను కూడా రూపొందించుకుంటోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 534 మండలా లకుగాను 388 మండలాల్లో పార్టీ కమిటీలు ఉన్నందున, మిగిలిన మండలాల్లో కూడా కమిటీలు ఏర్పాటు చేసుకోను న్నారు. ప్రస్తుతం పంచాయతీ స్థాయితోపాటు, అన్ని గ్రామాల్లోనూ చిన్నదో, పెద్దతో  పార్టీ యూనిట్‌ ఉండేలా చూడాలని ఈ సందర్భంగా నిర్ణయించింది.

పార్టీ నేతలకు పని విభజన
ముఖ్యనేతలు, రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యులకు పని విభజన చేసి, ఆయా సమ స్యలు, వర్గాలవారీగా బాధ్యతలను చేప ట్టేలా ఏర్పాటు చేసింది. వారంలో మూడు రోజుల చొప్పున రాష్ట్రస్థాయిలో పార్టీ సమ న్వయం, ఆయా అంశాల పరిశీలన, ఇతర బాధ్య తలను రాష్ట్ర సహాయ కార్యదర్శులు పల్లా వెంకటరెడ్డి, కూనంనేని సాంబశివరావులకు అప్పగించారు.  మాజీ ఎంపీ అజీజ్‌ పాషాకు ముస్లిం మైనారిటీలు, మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేశ్‌కు షెడ్యూల్డ్‌ కులాలు సమస్యలపై,  కార్యదర్శివర్గ సభ్యుడు ఈర్ల నర్సింహకు బీసీ, ఎంబీసీ, అంజ య్యనాయక్‌కు గిరిజన, ఆదివాసీల సమస్యలపై కార్యక్ర మాలను రూపొందించే బాధ్యతలను అప్పగించినట్లు సమాచారం. ఈ సామాజిక రంగాలకు సంబంధించిన సమస్యలు,ఇతరత్రా అంశాలను ఈ నేతల నేతృత్వం లో అధ్యయనం చేసి ఆయా ముఖ్యమైన, ప్రాధాన్యత సంతరించుకున్న వాటిపై సొంతంగా ఉద్యమాలను నిర్మించేలా కార్యక్ర మాలను రూపొందిం చుకోనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement