సమస్యల సుడి.. సర్కారీ బడి | Govt schools have more problems of water crisis | Sakshi
Sakshi News home page

సమస్యల సుడి.. సర్కారీ బడి

Mar 29 2016 2:37 AM | Updated on Sep 18 2018 8:38 PM

సమస్యల సుడి.. సర్కారీ బడి - Sakshi

సమస్యల సుడి.. సర్కారీ బడి

టాయిలెట్లు ఉండవు.. ఉన్నచోట నీళ్లుండవ్! కొన్ని వేల స్కూళ్లలోని పిల్లలకు గుక్కెడు మంచినీళ్లూ దొరకవు!

- మౌలిక వసతుల్లేక సతమతం
- 6,874 స్కూళ్లలో తాగునీటికి తంటాలు
- 17,332 పాఠశాలల్లో టాయిలెట్లకు నీటి వసతి కరువు
- 11,206 స్కూళ్లకు కిచెన్ షెడ్లు లేవు
- విద్యుత్తు సరఫరాకు నోచుకోని 2,415 స్కూళ్లు
- 11,937 స్కూళ్లకు ఆట స్థలాలు లేవు
- విద్యాశాఖ నివేదిక చెబుతున్న కఠోర వాస్తవాలు

 
సాక్షి, హైదరాబాద్: టాయిలెట్లు ఉండవు.. ఉన్నచోట నీళ్లుండవ్! కొన్ని వేల స్కూళ్లలోని పిల్లలకు గుక్కెడు మంచినీళ్లూ దొరకవు! కంప్యూటర్లు ఉన్నా కరెంటు లేక మూలన ఉంటాయి! చివరికి ఆడుకుందామంటే ఆటస్థలం కూడా ఉండదు. ఏటా వేల కోట్లు వెచ్చిస్తున్నా సర్కారీ బడులు సమస్యల సుడిగుండం నుంచి బయటపడడం లేదు. మౌలిక సదుపాయాల్లేక నిత్యం ఏదో ఒక సమస్యతో సతమతమవుతున్నాయి. సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ) వంటి పథకాల కింద భారీగా నిధులను వెచ్చిస్తున్నా మౌలిక వసతులు పూర్తిస్థాయిలో సమకూరడం లేదు.
 
 2015-16 విద్యా సంవత్సరంలో అన్ని పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణాన్ని పూర్తి చేసినా వాటిలో సగానికి పైగా స్కూళ్లకు నీటి సరఫరా లేదు. చాలా స్కూళ్లలో మధ్యాహ్న భోజనం అందించేందుకు తీసుకువచ్చే వంట సామగ్రిని దాచేందుకు కిచెన్ షెడ్లు లేవు. ఇక ప్రహరీ గోడలు, ఆట స్థలాల పరిస్థితి సరేసరి! స్వయంగా విద్యాశాఖ రూపొందించిన నివేదికలోనే ఈ కఠోర సత్యాలు వెల్లడయ్యాయి.
 
 ఆటలకు స్థలమేది?
 విద్యార్థి మానసిక వికాసానికి దోహదపడే ఆటలకు ప్రోత్సాహం కరువైంది. రాష్ట్రంలో 11,937 స్కూళ్లలో ఆట స్థలాలే లేవు. 14,029 పాఠశాలలకు ఆట స్థలాలు ఉన్నా.. వాటి నిర్వహణ సరిగా లేదు. దీంతో చాలాచోట్ల పిల్లలు ఇండోర్ గేమ్స్‌కే పరిమితం అవుతున్నారు.
 
 తాగునీటికి తంటాలు
 సర్కారీ బడుల్లో విద్యార్థులకు తాగునీటి తంటాలు తప్పడం లేదు. పాఠశాలల్లో తాగునీరు లేక అనేక చోట్ల పిల్లలు ఇళ్ల నుంచి బాటిళ్లలో నీళ్లను తీసుకెళ్లాల్సి వస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు 25,966 ఉంటే అందులో 19,092 పాఠశాలల్లో తాగునీటి సదుపాయం ఉంది. మిగతా 6,874 స్కూళ్లకు తాగునీటి సదుపాయం లేదు. తాగునీటి సదుపాయం ఉన్న 19,082 స్కూళ్లలో 8,525 స్కూళ్లకు మాత్రమే నల్లాల ద్వారా రక్షిత తాగునీరు అందుతోంది. మిగతా పాఠశాలల విద్యార్థులు రక్షిత తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి కోసం 554 స్కూళ్లు బావులపై, మరో 10,013 స్కూళ్లు చేతి పంపుపై ఆధారపడాల్సి వస్తోంది.
 
 ఆహార పరిశుభ్రతేదీ?
 మధ్యాహ్నం భోజనం అన్ని పాఠశాలల్లో అమలు అవుతున్నా.. 14,760 పాఠశాలల్లోనే కిచెన్ షెడ్లు ఉన్నాయి. మిగతా 11,206 స్కూళ్లలో వంట సామగ్రి భద్రపరిచేందుకు కిచెన్ షెడ్లు లేవు. దీంతో వంట పాత్రలు, బియ్యం, కూరగాయలు, నూనె వంటివి దాచేందుకు ఏజెన్సీలు తంటాలు పడాల్సి వస్తోంది. వర్షాకాలం వస్తే చాలు కిచెన్ షెడ్లు లేక అనేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. వర్షం వస్తే వంట ఎక్కడ చేయాలో తెలియని పరిస్థితి నెలకొంది. కొన్ని సందర్భాల్లో వంట చేయకపోవడంతో విద్యార్థులు అర్ధాకలితో అలమటించాల్సి వస్తోంది. గాలి, వానల వల్ల బియ్యం, నూనెల్లో చెత్తాచెదారం పడుతుండటంతో అవి కలుషితం అవుతున్నాయి.
 
 టాయిలెట్లకు నీళ్లేవి?
 రాష్ట్రంలోని 25,966 ప్రభుత్వ స్కూళ్లలో 8,634 స్కూళ్లలోనే టాయిలెట్లకు నీటి సరఫరా ఉంది. 17,332 పాఠశాలల్లో వాటికి నీటి సరఫరా లేదు. దీంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. స్వచ్ఛ విద్యాలయలో భాగంగా కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రభుత్వం 2015-16 విద్యా సంవత్సరంలో టాయిలెట్లు నిర్మించింది. అయితే చాలాచోట్ల నీటి సరఫరా లేక వాటి నిర్వహణను గాలికొదిలేశారు.
 
 కరెంటు లేదు
 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో కంప్యూటర్ విద్యకు (ఐసీటీ) ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత విద్యా సంవత్సరం నుంచి కంప్యూటర్ విద్యను పక్కాగా అమలు చేసేందుకు చర్యలు చేపడుతున్నాయి. అయితే రాష్ట్రంలోని చాలా స్కూళ్లకు విద్యుత్ సదుపాయం లేదు. 23,551 పాఠశాలలకు విద్యుత్ కనెక్షన్లు ఉండగా.. మరో 2,415 స్కూళ్లకు కనెక్షన్లు లేవు. కనెక్షన్లు ఉన్నా కొన్ని స్కూళ్లలో బిల్లులు చెల్లించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement