
స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా
దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని, దీనిని దెబ్బతీయాలని చూసేవారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
ఇసుక అక్రమాలకు పాల్పడితే ఎవరినీ వదలం: సీఎం
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచిత ఇసుక విధానం అమల్లోకి తెచ్చామని, దీనిని దెబ్బతీయాలని చూసేవారిని వదిలే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక మాఫియాపై ప్రతిపక్షనేత వైఎస్ జగన్, విపక్ష సభ్యులు అసెంబ్లీలో విమర్శనాస్త్రాలు సంధించడంతోదీనిపై సీఎం మాట్లాడారు. ‘మొదట డ్వాక్రా సంఘాలకు ఇచ్చి ఇసుకను రెగ్యులరైజ్ చేయాలని ప్రయత్నించాం. వారు సరిగా చేయలేకపోవడంతో అన్నీ ఆలోచించి ప్రజలకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.
తప్పులుంటే సలహాలిస్తే సరిదిద్దుకుంటాం. ఇసుకను సరిహద్దులు దాటించాలని ఎవరు ప్రయత్నించినా పీడీ చట్టం కింద కేసులు పెడతాం. డ్రైవర్ పైనే కాదు వాహన యజమానిపైనా కేసులు నమోదు చేస్తాం. రాష్ట్రంలో 491 ఇసుక రేవులకు పర్యావరణ అనుమతులు తీసుకుని ప్రజలు ఉచితంగా ఇసుక తీసుకెళ్లే అవకాశం కల్పించాం. ఇంకా ఎవరికైనా దగ్గర రీచ్లు ఉంటే వినియోగించుకోవచ్చు. కాల్ సెంటర్ కూడా పెట్టాం. పొలాల్లో ఇసుక ఉంటే తవ్వకం ఖర్చులు మాత్రమే తీసుకుని డిస్పోజ్ చేయాలి. ధరలు పెట్టి అమ్మరాదు. గతంలో తెలిసో, తెలియకో తప్పు చేసినా ఇక ఇసుక దందా మానేయండి. లేదంటే కఠిన శిక్షలు తప్పవని ఈ సభ ద్వారా అందరికీ తెలియజేస్తున్నా. ఇసుక వ్యవహారాన్ని నేనే స్వయంగా పర్యవేక్షిస్తున్నా. ఉచిత ఇసుక ప్రజల హక్కు. ఎవరైనా డబ్బు అడిగితే మీరు వారిని రెండు దెబ్బలు కొట్టడానికి కూడా భయపడవద్దు. కేసులు పెట్టం. పైసా అవినీతి జరిగినా సహించే ప్రసక్తే లేదు’ అని చంద్రబాబు తెలిపారు.
అక్రమాలను చంద్రబాబు కంటిచూపుతో చంపేస్తారు: మంత్రి పీతల
కాగా అంతకుముందు మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ.. కంటిచూపుతోనే అక్రమాలను చంద్రబాబు చంపేస్తారని అన్నారు. డ్వాక్రా సంఘాలు ఇసుక సరఫరా చేసే సమయంలో ఇసుక అక్రమ రవాణా, తవ్వకాలు జరిపిన వారిపై 5,565 కేసులు పెట్టామని మంత్రి తెలిపారు. ఇసుక అక్రమాలపై వైఎస్సార్సీపీ సభ్యులు మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.