రొనాల్డో కోసం రాత్రంతా మేలుకుని ఎదురుచూస్తున్నాం... మెస్సీ మ్యాజిక్ గురించి రోజంతా చర్చిస్తున్నాం... నెయ్మార్ మీద ఎనలేని ఆసక్తి చూపుతున్నాం...
రొనాల్డో కోసం రాత్రంతా మేలుకుని ఎదురుచూస్తున్నాం... మెస్సీ మ్యాజిక్ గురించి రోజంతా చర్చిస్తున్నాం... నెయ్మార్ మీద ఎనలేని ఆసక్తి చూపుతున్నాం... ఇన్నాళ్లూ ఏ దేశం వాళ్లో కూడా తెలియని ఆటగాళ్ల మీద ఫుట్బాల్ ప్రపంచకప్ పుణ్యమాని విపరీతమైన అభిమానం చూపుతున్నాం. ఎవరో ఎక్కడో ఆడుతుంటేనే ఇలా ఉన్నాం... ఒకవేళ భారత జట్టు ప్రపంచకప్ ఆడితే... ఎవరైనా మనకు తెలిసిన ఆటగాడు ఒకరు ప్రపంచకప్లో ఆడుతుంటే... ఆ మజాయే వేరు. ఇప్పటి తరానికి ఈ అదృష్టం లేదు. కానీ ఒక్కసారి చరిత్రలోకి వెళితే... ఒకప్పుడు హైదరాబాద్ ప్రపంచకప్ ఫుట్బాల్పై తన ముద్ర వేసింది. గోల్కొండ నవాబులు, అసఫ్జాహీల తరహాలోనే హైదరాబాద్ ఫుట్బాల్కు కూడా ఘనమైన రికార్డే ఉంది. వరుసగా ఒలింపిక్స్లో పాల్గొన్న ప్రతిభ మన సొంతం. ఒకప్పుడు భారత ఒలింపిక్ జట్టులో ఏకంగా తొమ్మిది మంది హైదరాబాదీలే ఉన్నారంటే ఆటపై మన ముద్ర ఏమిటో తెలుస్తుంది. అయితే ఇప్పుడు భాగ్యనగరం ఫుట్బాల్ పరిస్థితి మారింది...23 ఏళ్లుగా ఒక్క హైదరాబాదీ కనీసం భారత జట్టులో కూడా చోటు దక్కించుకోలేకపోయాడు. కనీసం స్కూల్ స్థాయి పోటీలు కూడా నిర్వహించే దిక్కు లేక హైదరాబాద్ చేసుకున్న సెల్ఫ్ గోల్ ఇది.
- మొహమ్మద్ అబ్దుల్ హాది
స్వర్ణ యుగం...
1950నుంచి 1962 వరకు హైదరాబాద్ ఫుట్బాల్కు స్వర్ణ యుగం వంటిదేనని చెప్పవచ్చు. ఒకరా...ఇద్దరా... ఏకంగా 16 మంది ఒలింపిక్స్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు. 1948 లండన్ ఒలింపిక్స్లో ధన్రాజ్ మొదటి సారి ఆడితే, 1952 హెల్సింకీలో మొయిన్, నూర్, అజీజ్ బరిలోకి దిగారు. ఇక 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్లో అయితే నవరత్నాల్లాంటి 9 మంది హైదరాబాదీలు భారత్ భారాన్ని మోశారు. జుల్ఫిఖరుద్దీన్, బలరామ్, పీటర్ తంగరాజ్, మొహమ్మద్ సలామ్, లతీఫ్, అహ్మద్ హుస్సేన్, అజీజ్, నూర్ మొహమ్మద్లు ఆడారు.
పైగా ఈ జట్టుకు మరో దిగ్గజం రహీం సాబ్ కోచ్గా కూడా వ్యవహరించారు. ఈ టోర్నీలో జట్టు నాలుగో స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత 1960 రోమ్లో ఇందులోని ఏడుగురు మళ్లీ ఆడారు. 1962 జకార్తా ఆసియా క్రీడల్లో భారత్ స్వర్ణ పతకం సాధించడం వరకు ఈ జోరు కొనసాగింది. ఒలింపిక్స్ మాత్రమే కాకుండా దాదాపు పాతిక మంది హైదరాబాద్ ప్లేయర్లు వేర్వేరు దశలలో అంతర్జాతీయ టోర్నీల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించారు.
పోలీస్ పవర్
అప్పట్లో జాతీయ ఫుట్బాల్లో హైదరాబాద్ సిటీ పోలీస్ జట్టంటే అందరికీ హడల్. కేవలం రెండో స్థానం కోసమే ఇతర జట్లు పోటీ పడాలేమో అని అప్పట్లోనే వినిపించేది. 1950-59 మధ్య జరిగిన 12 జాతీయ స్థాయి పోటీల్లో హైదరాబాద్ పోలీస్ ఆడితే అన్నింటా అదే జట్టుకు విజయం దక్కింది. రహీంసాబ్ కోచ్గా ఉన్న సమయంలోనే ఎనిమిది సార్లు ప్రతిష్టాత్మక రోవర్స్ కప్, నాలుగు సార్లు డ్యురాండ్ కప్ గెలుచుకుంది. 1964లో భారత కోచ్ ఒకరు బ్రెజిల్లో ప్రత్యేక్ష శిక్షణ కోసం వెళ్లారు. తిరిగి వచ్చాక ఆయన ‘ఎప్పుడో పదేళ్ల క్రితం రహీంసాబ్ చెప్పిన విషయాలు వారూ చెబుతున్నారు. నాకు కొత్తగా ఏమీ నేర్చుకోవాల్సిన అవసరం రాలేదు’ అన్నారు. అలనాటి దిగ్గజాల గొప్పతనం ఈ ఒక్కమాటలో ప్రతిఫలించిందంటే అతిశయోక్తి కాదు.
తడబడిన అడుగులు
అయితే ఈ దిగ్గజాలు దాదాపు ఒకే సమయంలో రిటైర్ కావడం హైదరాబాద్ ఫుట్బాల్ను దెబ్బ తీసింది. వారి వారసత్వాన్ని కొనసాగించడంలో చాలా మంది విఫలమయ్యారు. 70వ దశకంలో కొన్ని ఒడిదుడుకులతో పడుతూ, లేస్తూ సాగినా...80లలో మాత్రం పరిస్థితి ఇంకా ఇబ్బందికరంగా తయారైంది. ముఖ్యంగా సిటీ పోలీస్ టీమ్ బాగా బలహీన పడటం జాతీయ జట్టుపై కూడా ప్రభావం చూపించింది. అప్పట్లో వేర్వేరు కారణాలతో చాలా మంది యువకులు పోలీస్ విభాగంలో చేరేందుకు ఆసక్తి కనబర్చలేదు. దీంతో జట్టుగా కాకుండా తమ ఆటను నమ్ముకున్న ఒక్కొక్కరు వ్యక్తిగతంగా తమ ప్రయత్నాల్లో పడిపోయారు.
చాలా మంది కోల్కతాకు వలస వెళ్లిపోయి అక్కడి లీగ్లలో ఆడటం ప్రారంభించారు. వారికి అవకాశం దక్కేందుకు హైదరాబాద్ పేరు సరిపోయేది. దానిని వారు అందిపుచ్చుకొని చాలా వరకు అక్కడే స్థిర పడిపోయారు. నగరంలో అట్టహాసంగా నిర్వహిస్తూ వచ్చిన నిజాం గోల్డ్ కప్ టోర్నీ కూడా ఆ తర్వాత మూలన పడింది. దాంతో ఎన్నో ఏళ్లుగా అభిమానుల మనసుల్లో పదిలంగా ఉన్న ఆట వారినుంచి దూరమవుతూ వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగాలు ఆటగాళ్లకు ఇచ్చే విషయంలో ఆ సమయంలో కొన్నాళ్ల పాటు వచ్చిన స్తబ్దత, కుర్రాళ్ళ ఆసక్తిని కూడా దూరం చేసింది.
పనికి రాని సంఘాలు
చరిత్రలో అద్భుతాల తర్వాత కొన్నాళ్లు చురుగ్గా ఆట సాగకపోయినా హైదరాబాద్లో ఆట పూర్తిగా ముగిసిపోలేదు. రహీమ్ లీగ్ నిర్వహణ కారణంగా ఎంతో కొంత ఫుట్బాల్ కనిపించేది. కానీ 2000 తర్వాత ఏపీ ఫుట్బాల్ సంఘంలో వచ్చిన విభేదాలు ఇప్పటికీ ఆటను పట్టి పీడిస్తున్నాయి. రెండు వర్గాలు, వారికి రాజకీయ నాయకులు, అధికారుల అండ. ఇద్దరూ మాదే అసలు సంఘం అంటారు. ఒకరికి అనుకూలంగా కోర్టులో తీర్పు వస్తే, మరొకరు మరో కోర్టులో కొత్త కేసు ఫైలు చేస్తారు. ఒకరు తాత్కాలికంగా ఉత్తర్వులు తెచ్చుకుంటే మరో వర్గం దాన్ని ఛాలెంజ్ చేస్తుంది. దానిపై తుది తీర్పు రాదు. ఎవరూ వెనక్కి తగ్గరు. ఆటకు మేలు చేసేందుకు కూర్చొని మాట్లాడుకోరు. ఆటపై ప్రాణం ఉన్నవారు మధ్యేమార్గంగా పరిష్కారం చూపించేందుకు సిద్ధమైతే వారిని లెక్క చేయరు. రాష్ట్ర విభజన తర్వాత ప్రతీ క్రీడా సంఘం వేర్వేరు శాఖలు ఏర్పాటు చేసుకుంటుంటే వీరు మాత్రం ఇప్పటికీ ఏపీ సంఘం గురించే కోర్టు కేసుల్లో తలమునకలై ఉన్నారు. దీంతో ఫలితమే ఆటకు దశ, దిశ లేకుండా పోయింది.
మారేదెలా..?
సౌకర్యాల పరిస్థితి ఎలా ఉన్నా...చెప్పుకోదగ్గ మైదానాలు లేకపోయినా... అన్నింటికి మించి ఈ ఆట ఆడితే భవిష్యత్తుపై భరోసా ఏమీ లేకపోయినా... ఇప్పటికీ నగరంలో ఫుట్బాల్ క్రేజ్ కొన్ని చోట్ల మిగిలే ఉంది. హైదరాబాద్ స్పోర్టింగ్, హైదరాబాద్ గ్లోబ్, బొల్లారం స్పోర్టింగ్, మైసారం క్లబ్, తిరుమలగిరి క్లబ్, శాస్త్రి క్లబ్, సిటీ కాలేజ్ ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ తదితర 20 జట్లు సొంత ఆసక్తితో ఆటను కొనసాగిస్తున్నాయి. ఇక్కడ చిన్న టోర్నీలు, కాదంటే పక్క రాష్ట్రానికి వెళ్లి మరీ ఆడి వస్తున్నాయి. అయితే ఇది పెద్ద స్థాయిలో ఫలితాలు ఇచ్చేది కాదు. ప్రాథమిక స్థాయిలో, చిన్న వయసులోనే ఆటగాళ్ల నైపుణ్యాన్ని గుర్తించి వారిని శిక్షణా శిబిరాల ద్వారా, టోర్నీల ద్వారా సానబెడితే అత్యుత్తమ ఫలితాలు వస్తాయి. గతంలో సరిగ్గా ఇలాంటి ఆలోచనలతోనే నిర్వహి స్తూ వచ్చిన రహీమ్లీగ్ అద్భుతం గా విజయ వంతమైంది. హైదరా బాద్ ఫుట్బాల్ కు చిరు నామా అయిన ఈ లీగ్లో ఆడటం అంటే ఆటగాడికి ఒకప్పు డు ప్రతిష్టాత్మకం. తనను తాను నిరూపించుకునేందుకు వారికి ఇంతకంటే మెరుగైన వేదిక లేదు. రహీమ్ లీగ్ ఎ, బి, సి డివిజన్ లీగ్ల ద్వారా ఎందరో వెలుగులోకి వచ్చారు. ఇప్పుడు టోర్నీలే లేవు. ఇక ఆటగాళ్లు ఎలా వెలుగులోకి వస్తారు? కొంత మంది ప్రైవేట్ సంస్థల సహకారంతో అప్పుడప్పుడు టోర్నీలు నిర్వహిస్తున్నా వాటికి ఎలాగూ గుర్తింపు దక్కడం లేదు. బడా కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నా... బాధ్యత తీసుకునే వ్యక్తులు వారికి కనబడటం లేదు. అసోసియేషన్ సరిగ్గా లేనప్పుడు వారెవరూ ముందుకొచ్చే ధైర్యం చేయడం లేదు. అంతా సక్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా ఉంటే టోర్నీలు నిర్వహించుకోవచ్చు.
‘ఇంతటి ప్రతికూల పరిస్థితుల్లోనూ చాలా మంది ఫుట్బాల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తుండటం సంతోషకరమైన విషయం. ఈ ఆటలో హైదరాబాద్ గొప్పతనం గురించి వారికి గుర్తు చేస్తే చాలు. వారిలో ఎక్కడ లేని ఉత్సాహం పొంగుకొస్తుంది. ప్రస్తుత స్థితిలో ఆటగాళ్లకు సరైన దిశానిర్దేశం చేయడంలో విఫలమవుతున్నాం. వారికి ఆర్ధికపరమైన భరోసా కూడా కల్పించాల్సి ఉంది. నిర్మాణాత్మకంగా ఫుట్బాల్కు చేయూతనిచ్చేందుకు ఇప్పటికీ చాలా కార్పొరేట్ సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అయితే అసోసియేషన్ బలంగా ఉంటేనే అన్నీ సాధ్యమవుతాయి. సదుపాయాలు, కోచింగ్ అకాడమీలు కావాలి. ఒక్కసారి రహీమ్ లీగ్ పునరుద్ధరిస్తే చాలు. ఎంత గొప్ప ఆటగాళ్లు వెలుగులోకి వస్తారో చూడండి. అప్పుడు గత వైభవం గురించి తలచుకోవడమే కాదు... భవిష్యత్తులో కూడా మన హైదరాబాద్ ఫుట్బాల్ మెరుపుల గురించి మళ్ళీ మళ్లీ మాట్లాడుకోవచ్చు.
- విక్టర్ అమల్రాజ్, భారత్ ఫుట్బాల్ మాజీ కెప్టెన్