శాంతి సిపాయి | Special Story About Soldier Suman Gavani | Sakshi
Sakshi News home page

శాంతి సిపాయి

May 28 2020 12:38 AM | Updated on May 28 2020 12:38 AM

Special Story About Soldier Suman Gavani - Sakshi

రెండు దేశాలు ఘర్షణ పడుతున్నాయి. ‘బ్రో.. బ్రో..’ ఆగండి అంటుంది యు.ఎన్‌. వచ్చి. ‘ఓకే.. బ్రో’ అని ఒక దేశం గన్‌ దించేస్తుంది. రెండో దేశం ‘ఓకే’ అనదు. ‘బ్రో’ అనదు. యు.ఎన్‌. మళ్లొకసారి ‘ఓ.. శాంతి’ అంటుంది. వినలేదా.. ‘పీస్‌ కీపర్స్‌’ దిగుతారు. పీస్‌ కీపర్స్‌.. యు.ఎన్‌. శాంతి సాయుధ దళాలు. మరి.. పీస్‌ కీపర్స్‌ మధ్యే డిసిప్లీన్‌ మిస్‌ అయితే? గవానీ లాంటిæమహిళలు వారిని నడిపిస్తారు. 

సుమన్‌ గవానీకి ఐక్యరాజ్యసమితి రేపు ప్రతిష్టాత్మకమైన ఒక అవార్డును ఇవ్వబోతోంది. రేపటికి, రేపు ఇచ్చే ఆ అవార్డుకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. యు.ఎన్‌. పీస్‌ కీపర్స్‌ (శాంతి పరిరక్షకులు) అంతర్జాతీయ దినోత్సవం రేపు. ఇక ఆ అవార్డు.. తొలిసారిగా ఒక భారతీయ సోల్జర్‌కు లభించిన గౌరవ పురస్కారం. ‘యు.ఎన్‌. మిలిటరీ జెండర్‌ అడ్వొకేట్‌ అవార్డు’ అది. యు.ఎన్‌. శాంతి పరిరక్షక దళంలో అన్ని దేశాల సైనికులు పనిచేస్తుంటారు. అలాగే గవానీ కూడా చేస్తున్నారు. 2018లో ఐక్యరాజ్య సమితి ఆమెను ప్రత్యేకమైన పనిమీద దక్షిణ సూడాన్‌కు పంపించింది. అక్కడ 230 మంది సమితి సైనిక పరిశీలకులను ఆమె పర్యవేక్షిస్తుండాలి. ప్రతి టీమ్‌లోనూ మహిళా సైనిక పరిశీలకులు ఉండేలా చూసుకోవాలి.

ఘర్షణ జరుగుతున్న ప్రాంతాలలో లైంగిక హింసను చెలరేగనివ్వకుండా చూడటం ఆ పరిశీలకుల పని. తన పర్యవేక్షణను విజయవంతంగా పూర్తి చేసినందుకు, సైనిక పరిశీలకులను క్రమశిక్షణతో నడిపించి ౖలñ ంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితి చేపట్టిన ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినందుకు 2019 సంవత్సరానికి గాను సుమన్‌ గవానీకి ఈ అవార్డు వచ్చింది. ఈ అవార్డును గవానీ తన పీస్‌ కీపింగ్‌ సహచరురాలు. ్ర»ñ జిల్‌ మిలటరీ మహిళా కమాండర్‌ కార్లా అరౌజోతో పంచుకోబోతున్నారు. వీళ్లిద్దరినీ శక్తిమంతులైన ఆదర్శప్రాయులుగా గుర్తిస్తూ సమితి ప్రధాన కార్యదర్శి ఏంటానియో గుటెరస్‌లో ఆన్‌లైన్‌లో అవార్డును ఇవ్వబోతున్నారు. నాలుగేళ్లుగా ఏటా ఈ అవార్డును ఇస్తూ వస్తోంది సమితి. 

ఆర్మీ మేజర్‌గా యు.ఎన్‌. పీస్‌ కీపింగ్‌లోకి వెళ్లిన సుమన్‌ గవానీ కెరియర్‌ భారత సైనికురాలిగా 2011లో మొదలైంది. ఇండోర్‌లోని మిలటరీ కాలేజ్‌ ఆఫ్‌ టెలీకమ్యూనికేషన్స్‌లో టెలీ కమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ డిగ్రీ, డెహ్రాడూన్‌ గవర్నమెంట్‌ పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కాలేజ్‌లో ‘డిగ్రీ ఇన్‌ ఎడ్యుకేషన్‌’ చేశారు గవానీ. ఆఫీసర్స్‌ ట్రెయినింగ్‌ అకాడమీలో శిక్షణ పొంది, ఆర్మీ సిగ్నల్‌ కోర్స్‌లో చేరారు. సైనిక సమాచార వ్యవస్థ విభాగం అది. అందులో కీలకమైన విధులు నిర్వహించారు. అట్నుంచి యు.ఎన్‌. పీస్‌ కీపింగ్‌కి వెళ్లిపోయారు. ఉత్తరాఖండ్‌లోని తెహ్రీ గర్వాల్‌లో పొఖర్‌ గ్రామం నుంచి వచ్చిన గవాని నేడు అంతర్జాతీయంగా సమున్నత శాంతిపరిరక్షణ స్థానానికి చేరుకున్నారు. ‘‘మా పని ఏదైనా, పొజిషన్, ర్యాంకు ఎంతటిదైనా మా రోజువారీ విధి నిర్వహణల్లో స్త్రీ, పురుషులను, మిగతా జెండర్‌లను కలుపుకునిపోతూ స్త్రీలకు, శాంతికి, భద్రతకు విఘాతం కలగకుండా జాగ్రత్త పడటం అన్నది కూడా పీస్‌కీపర్స్‌గా మా బాధ్యత. ఆ బాధ్యతను సమర్థంగా నిర్వహించినందుకు గుర్తింపుగా అవార్డు రావడం సంతోషకరమైన సంగతే కదా’’ అని మేజర్‌ సుమన్‌ గవానీ అంటున్నారు.

యు.ఎన్‌. (ఐక్యరాజ్య సమితి) అవార్డును అందుకోనున్న భారత ఆర్మీ మేజర్‌ సుమన్‌ గవానీ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement