బడుగు రైతుకు ఆదాయ భద్రత!

Kheyti Foundation Helps Poor Farmers - Sakshi

లాభసాటి వ్యవసాయం దిశగా చిన్న రైతుల అడుగులు

5 గుంటల నెట్‌ హౌస్‌లో రోజుకు వెయ్యి లీటర్ల నీటితోనే పంటల సాగు

కరువు సీమలో ఏడాది పొడవునా రైతులకు కాసుల వర్షం

రైతులకు అండగా నిలుస్తున్న ‘ఖేతీ’ స్వచ్ఛంద సంస్థ

కేవలం 5 గుంటల(12.5 సెంట్లు) స్థలం..రూ. 3 లక్షల బ్యాంకు రుణంతోనెట్‌ హౌస్‌ నిర్మాణం..రైతు వాటా రూ. 35 వేలతోపాటు రోజుకు 2 గంటలు శ్రమ..అతి తక్కువ నీటితో, మార్కెట్‌లో గిరాకీ ఉన్న పంటలు కరువు కాలంలోనూనిశ్చింతగా పండించడం..పొలం దగ్గరే రైతులకుగిట్టుబాటు ధర చెల్లించడం..ప్రతి వంద రోజులకో పంట..ప్రతి సారీ పంటల మార్పిడి..పంట పంటకూ రూ. 50 వేల నికరాదాయం..ఇదంతా అందమైన కల లాగా ఉందా?కల కాదు.. నిజమే. నిజంగా నిజమే!చిన్న, సన్నకారు రైతుల అనుభవంలో నిగ్గుతేలిన విషయమిది. ‘ఖేతీ’ అనే లాభాపేక్ష లేని సంస్థ మార్గదర్శనంలో పలువురు రైతులు ఏడాది పొడవునా, తీవ్ర కరువు కాలంలోనూ, ఆదాయ భద్రత పొందుతున్నారు!!   

మెతుకు సీమ మెదక్‌ జిల్లా ఇప్పుడు భూగర్భ జలాలు ఇంకిపోయి కరువు సీమగా మారింది. నాలుగైదు వందల అడుగుల లోతుకు బోరు వేస్తే కానీ నీరు రాని పరిస్థితి.. వేసిన బోర్లలో కూడా సక్రమంగా నీరు వస్తుందనే నమ్మకం లేదు. ఒకటికి పది బోర్లు వేసినా నీటి కొరత తీరక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్న రైతులు ఈ ప్రాంతంలోనే అధికంగా ఉన్నారు. అందుకోసమే నష్టాలతో సాగు చేయలేక హైదరాబాద్, ముంబై, దుబాయ్‌ వంటి ప్రాంతాలకు వలస వెళ్లి బతుకు జీవుడా అని కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. అయితే ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ఏడారిలో ఒయాసిస్సులాగా ‘ఖేతీ’ లాభాపేక్ష లేని సంస్థ రైతులకు అండగా నిలుస్తోంది. వ్యవసాయం దండుగ అన్న చోటనే పండుగలా చేసేందుకు ప్రయత్నిస్తున్నది. అన్నీ తానై చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయిస్తోంది.

5 గుంటల (12.5 సెంట్లు) భూమిలో బ్యాంకు రుణం రూ. 3 లక్షల(8.8% వడ్డీ)తో నెట్‌ హౌస్‌ నిర్మిస్తోంది. రైతు వాటా రూ. 35 వేలు చెల్లించాలి. చుట్టూ పురుగులను లోనికి రానీయకుండా నెట్‌ ఉంటుంది. లోపల పంటల పైన షేడ్‌ నెట్‌ ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉండే రోజుల్లోనే ఈ షేడ్‌నెట్‌ను వాడుతుంటారు. ఎండ తీవ్రతను 2 డిగ్రీల సెల్షియస్‌ మేరకు తగ్గిస్తే 20% దిగుబడి పెరుగుతుందని ‘ఖేతీ’ చెబుతోంది.
ఆరు బయట డ్రిప్‌ ద్వారా వాడే నీటిలో కేవలం 10 శాతం నీటిని (రోజుకు వెయ్యి లీటర్లు) మాత్రమే వాడుతుండడం మరో విశేషం. 100 రోజుల్లో రూ. 90 వేల విలువైన కనీసం 3 టన్నుల కీర దోస వంటి స్వల్పకాలిక పంటలు పండించేలా బడుగు రైతులకు ‘ఖేతీ’ మార్గదర్శనం చేస్తున్నది. ఆరుబయట డ్రిప్‌తో ఇంత దిగుబడి తీయడానికి రోజుకు పది వేల లీటర్ల నీరు, అదే నీరు పారగట్టే పద్ధతిలో అయితే 50 వేల లీటర్ల నీరు అవసరమవుతుందని ‘ఖేతీ’ అంచనా. రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకం 90% తగ్గించగలుగుతోంది. పండించడం వరకే కాదు.. పంటను మార్కెట్‌ ధర చెల్లించి పొలం దగ్గరే మార్కెట్‌ ధరకే కొంటున్నది. మార్కెట్‌లో ధర మరీ తగ్గినప్పుడు కూడా కిలోకు రూ. 20 చొప్పున రైతులకు చెల్లించడం విశేషం. 

ఉన్న కొద్దిపాటి నీటి వనరులను ఉపయోగించుకొని కీరదోస సాగు లాభసాటిగా ఉందని సిద్ధిపేట జిల్లా గజ్వేల్‌ మండలం దాచారం రైతులు చెబుతున్నారు. 1హెచ్‌పి మోటర్, వెయ్యి లీటర్ల వాటర్‌ ట్యాంక్‌ నుంచి డ్రిప్‌ ద్వారా నీరు, ద్రవరూప ఎరువులు అందిచడంతో పంట దిగుబడి అధికంగా వస్తున్నదని రైతు గుండ తిరుమలగిరి, వజ్రమ్మ దంపతులు చెబుతున్నారు. పంట నాటిన నెల రోజుల నుంచి దిగుబడి మొదలైందన్నారు.

పంటలు వేసి నష్టపోయిన రైతులకు ‘ఖేతీ’ స్వచ్ఛంద సంస్థ అండగా నిలిచింది. సంస్థ అధ్యక్షులు సత్య రఘు రైతులను కలిసి, ఉమ్మడి మెదక్, మేడ్చల్‌ జిల్లా పరిధిలో 500 మంది రైతులను ఎంపిక చేశారు. కీర పంట నాటిన నెల రోజులకు దిగుబడి ప్రారంభమవుతుంది. రోజు తప్పి రోజు కీర దోసకాయలను రైతులు కోస్తున్నారు. ‘ఖేతీ’ సంస్థ ప్రతినిధులు నెట్‌ హౌస్‌ వద్దకే వచ్చి కాంటా పెట్టుకొని ఆన్‌లైన్‌ మార్కెట్లలో ఆ రోజు ఉన్న రేటుకు కొనుగోలు చేసి.. నగరాల్లోని మాల్స్‌కు సరఫరా చేస్తున్నారు. రైతులకు నెలకోసారి డబ్బు చెల్లిస్తున్నారు. గరిష్టం ఐదేళ్లలో బ్యాంకు రుణం తీరిపోతుంది. అప్పటి వరకూ ‘ఖేతీ’ సంస్థ రైతులకు వెన్నుదన్నుగా ఉంటుంది. ఆ తర్వాత రైతులే నిర్వహించుకోవాలి.   – ఈరగాని బిక్షం, సాక్షి, సిద్ధిపేటఫొటో జర్నలిస్టు : కె. సతీష్‌

పనులు మేమే చేసుకుంటాం..!
నాకు మూడున్నర ఎకరాల భూమి ఉంది. బోరు కొద్డిగా పోయడంతో పంటలు మధ్యలోనే ఎండిపోయేవి. కానీ ఈ సార్లు వచ్చి కొద్దిపాటి నీళ్లతో 5 గుంటల్లో పంటలు సాగు చేసుకోవచ్చని చెప్పారు. మా వాటా రూ. 35 వేలు ఇచ్చాం. బ్యాంకు లోన్‌ వచ్చింది. నెట్‌ హౌస్‌ వేశాం. పంటలు వేయడం, మందులు వాటం అంతా వారే చెప్పారు. రోజు వారీగా తోటలో పనులు మేమే చేసుకుంటున్నాం. ఇప్పుడు రెండు నెలలైంది. మాకు 2 టన్నుల కీర దోస పండింది. కిలో రూ. 32 నుండి రూ. 35 వరకు పలుకుతున్నది. ఇప్పటి వరకు మాకు రూ. 60 వేలు వచ్చినయి. మరో టన్ను దిగుబడి వస్తుంది. వంద రోజుల్లో రూ. 90 వేల పంట పండుతుంది. ప్రతి రోజూ పని చేస్తే మంచి లాభాలు వస్తాయి.– గుండ తిరుమలగిరి, కీర రైతు,(88976 74823), దాచారం, గజ్వేల్‌ మండలం, సిద్ధిపేట జిల్లా

తక్కువ విస్తీర్ణం.. ఎక్కువ లాభం!
తక్కువ విస్తీర్ణంలో చిన్న, సన్నకారు రైతులతో లాభసాటి వ్యవసాయం చేయించడం, వ్యవసాయం దండుగ కాదని రుజువు చేయడమే మా సంస్థ లక్ష్యం. కేవలం 5 గుంటల స్థలంలో నెట్‌ హౌస్‌ నిర్మించడంతో పాటు డ్రిప్‌ తదితర వసతులన్నీ కల్పించాం. మా వ్యవసాయ నిపుణులు రైతుల పొలాల వద్దకు వెళ్లి ఎప్పటికప్పుడు సూచనలిస్తున్నాం. తీవ్ర కరువులోనూ మంచి దిగుబడి వస్తున్నది. మార్కెటింగ్‌ ఇబ్బందులు లేకుండా పొలం వద్దకే వెళ్లి మేమే కొనుగోలు చేస్తున్నాం. కీర దోస, క్యాప్సికం, చెర్రీ టమాటా, కర్బూజ, మిర్చి పంటలను పంటల మార్పిడి పద్ధతిలో సాగు చేయిస్తున్నాం. రైతులకు లాభసాటిగా ఉంది.– దిలీప్‌ (83400 65000),ఖేతీ సంస్థ ప్రతినిధి

రోజుకు 2 గంటలు పని!
నేను ఉదయం మిల్క్‌ డైరీలో పనిచేస్తా.. నాకు వ్యవసాయం ఉంది. కానీ దిగుబడి రాక వ్యవసాయం చేయడంలేదు. ‘ఖేతీ’ సంస్థ వారు చెప్పిన మాటలు విని 5 గుంటల్లో నెట్‌ హౌస్‌ వేసి కీర దోస వేశాను. ఉదయం గంటసేపు, సాయంత్రం గంటసేపు పంట బాగోగులు చూసుకుంటున్నా. డ్రిప్‌ ద్వారా నీళ్లు, మందులు వేస్తాం. పంట వేసి 70 రోజులు అవుతుంది. ఇప్పటి వరకు నాకు రూ. 68 వేల ఆదాయం వచ్చింది. కాయలు కోయగానే పొలం దగ్గరకు వచ్చి వాళ్లే కొనుగోలు చేస్తారు. అమ్ముకోవడానికి ఎక్కడికో వెళ్లాల్సిన పని లేదు. మంచి సౌకర్యంగా, లాభంగా ఉంది. పాల డైరీ పనిచేసుకుంటూనే ఈ కీర దోస పండించిన. ఈ పంట అయిపోగానే క్యాప్సికం లేదా చెర్రీ టమాటా వేస్తాం.– వెంకటస్వామి, కీర రైతు(9030189288), దాచారం, గజ్వేల్‌ మండలం, సిద్ధిపేట జిల్లా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top