మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ సోమవారం జిల్లాకు రానున్నారు.
సాక్షి, ఖమ్మం: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్. విజయమ్మ సోమవారం జిల్లాకు రానున్నారు. రెండు రోజుల పాటు ఆమె మధిర, ఇల్లెందు, కొత్తగూడెం, సత్తుపల్లి మున్సిపాలిటోల్లో రోడ్ షో ద్వారా ప్రచారం నిర్వహించి, ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన వివరాలను పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త పొంగులేటి శ్రీనివాసరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.
పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయమ్మ పర్యటనను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఇటీవల ఖమ్మంలో పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న జనభేరి సభకు అనూహ్య స్పందన రావడంతో ఇదే ఉత్సాహంతో పార్టీ నేతలు, శ్రేణులు విజయమ్మ పర్యటనను విజయవంతం చేయడానికి కదులుతున్నారు. పంచాయతీ ఫలితాల స్ఫూర్తితో మున్సిపాలిటీల్లో కూడా విజయఢంకా మోగిస్తామని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీగా జన సమీకరణ చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. జిల్లాలోనే రెండు రోజుల పాటు మున్సిపల్ ఎన్నికల ప్రచారాన్ని ఆమె నిర్వహిస్తుండడంతో జిల్లా పార్టీ నేతలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
పర్యటన షెడ్యూల్ ఇలా..
సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మధిర చేరుకుంటారు. ఇక్కడ రోడ్షోలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అక్కడి నుంచి ఇల్లెందు చేరుకుంటారు.
రాత్రి 7 గంటల నుంచి ఇల్లెందులో ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం కొత్తగూడెం చేరుకుంటారు.
మంగళవారం ఉదయం 9 గంటలకు కొత్తగూడెంలో రోడ్షో ప్రారంభిస్తారు. మధ్యాహ్నం వరకు ఇక్కడే ప్రచారం నిర్వహించి ప్రసంగిస్తారు.
కొత్తగూడెం నుంచి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలు సత్తుపల్లి చేరుకుంటారు. ఇక్కడ నగనరపంచాయతీలో ప్రచారం నిర్వహిస్తారు.