వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు మధిర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మధిర నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహించిన రోడ్షోకు అపూర్వస్పందన లభించింది.
మధిర, న్యూస్లైన్: వైఎస్ఆర్సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మకు మధిర ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మధిర నగరపంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిర్వహిం చిన రోడ్షోకు అపూర్వస్పందన లభించింది. కృష్ణాజిల్లా నందిగామ మండలం జొన్నలగడ్డ నుంచి మధిర నగరపంచాయతీ పరిధిలోని మడుపల్లి గ్రామంలోకి సాయంజనపథం త్రం 5.20 గంటలకు విజయమ్మ చేరుకున్నారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు పాయం వెంకటేశ్వర్లు, ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, మధిర నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ జి.సామాన్యకిరణ్, నాయకులు మెండెం జయరాజు, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఆమెను జిల్లా సరిహద్దులో ఘనంగా స్వాగతించారు. మార్గంమధ్యలో రోడ్డుపక్కన కనిపించిన కూలీలను విజయమ్మ పలకరిం చారు. మడుపల్లిలోకి కాన్వాయ్ ప్రవేశించాక విజయమ్మ ప్రచారరథంపైకి ఎక్కి ప్రజలకు అభివాదంచేశారు.
జై జగన్..జైజై జగన్, జోహార్ వైఎస్ఆర్, జగనన్న నాయకత్వం వర్ధిల్లాలి అనే నినాదాల నడుమ రోడ్షో కొనసాగింది. గ్రామానికి చెందిన రిటైర్డ్ ఇంజినీర్ యరమల జగన్మోహన్రెడ్డి నివాసంలో విజయమ్మ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, అల్పాహారం స్వీకరించారు. తాను దుమ్ముగూడెం ప్రాజెక్టు ఏఈగా పనిచేస్తున్నప్పుడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని పలుమార్లు కలిసినట్లు జగన్మోహన్రెడ్డి తెలిపారు. విజయమ్మను చూసేందుకు పెద్దసంఖ్యలో మహిళలు అక్కడకు తరలివచ్చారు. వైఎస్ఆర్ సెంటర్లో విజయమ్మ ప్రసంగించారు. అక్కడి నుంచి రోడ్షో నిర్వహిస్తూ మధిరకు చేరుకున్నారు.
నందిగామ బైపాస్ రోడ్డువద్ద పట్టణ ప్రజలు విజయమ్మకు ఘనస్వాగతం పలికారు. వేలాదిగా వచ్చిన మహిళలు కాన్వాయ్ వెంట అంబేద్కర్ సెంటర్వరకు చేరుకున్నారు. అక్కడ విజయమ్మ ప్రసంగం ముగిసిన తరువాత రాయపట్నం సెంటర్, మెయిన్రోడ్, రైల్వేఓవర్ బ్రిడ్జిమీదుగా వైఎస్ఆర్ చౌరస్తావరకు రోడ్షో నిర్వహించారు. అక్కడకూడా విజయమ్మ ప్రసంగించారు. విజయమ్మ రాకతో మధిర ప్రజలు మురిసిపోయారు. ఆమె రాకతో వైఎస్ఆర్ కాంగ్రెస్, సీపీఎం శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. వైఎస్ఆర్సీపీ, సీపీఎం జెండాలు చేతబట్టి రోడ్షోలో నాయకులు, కార్యకర్తలు ముందుకు సాగారు. ప్రతిచోటా విజయమ్మ, పొంగులేటి ప్రసంగిస్తూ మధిర నగరపంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్, సుత్తి, కొడవలి, నక్షత్రం గుర్తులపై ఓట్లువేసి గెలిపించాలని పిలుపునిచ్చారు.