మన్నికైన లా కు క్లాట్ వాక్!


యూజీ, పీజీ లా కోర్సుల్లో ప్రవేశానికి ప్రతి ఏటా జాతీయస్థాయిలో నిర్వహించే  పరీక్ష.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్). ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ద్వారా  మొత్తం 14 జాతీయ న్యాయ విశ్వవిద్యాలయాల్లో లా కోర్సులు అభ్యసించొచ్చు. 2014 సంవత్సర ప్రవేశాలకు క్లాట్ ప్రకటన వెలువడింది. గాంధీనగర్‌లో ఉన్న గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఈ పరీక్షను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో అర్హతలు, ప్రవేశ ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ ప్లాన్‌పై ఫోకస్..




 

 

 యూజీ కోర్సులకు పరీక్ష ఇలా..

 యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష మొత్తం 200 మార్కులకు ఉంటుంది. దీన్ని రెండు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. మొత్తం ప్రశ్నల సంఖ్య 200. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత విధిస్తారు.

 

 యూజీ కోర్సుల పరీక్ష విధానం


 

 విభాగం    మార్కులు

 ఇంగ్లిష్ ఇన్‌క్లూడింగ్ కాంప్రహెన్షన్    40

 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్    50

 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్

 (న్యూమరికల్ ఎబిలిటీ)    20

 లీగల్ ఆప్టిట్యూడ్    50

 లాజికల్ రీజనింగ్    40




 

 పీజీ కోర్సుల పరీక్ష విధానం:

 రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్ష మొత్తం 150 మార్కులకు ఉంటుంది. ఇందులో మొదట వ్యాసరూప విధానంలో ఉండే నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు 25 మార్కుల చొప్పున నాలుగు ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నలన్నీ కాన్‌స్టిట్యూషనల్ లా, జ్యురిప్రుడెన్స్ ల నుంచి అడుగుతారు. మిగిలిన 50 మార్కులకు మల్టిపుల్ చాయిస్ విధానంలో 50 ప్రశ్నలు ఇస్తారు. ఈ ప్రశ్నలన్నీ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన యూజీ కోర్సు సబ్జెక్టులను ఆధారం చేసుకుని ఉంటాయి. కాన్‌స్టిట్యూషన్ లా, జురిప్రుడెన్స్ మినహాయించి అన్ని సబ్జెక్టులపై ప్రశ్నలడుగుతారు. మల్టిపుల్ చాయిస్‌లో తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులు కూడా ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు కోత విధిస్తారు.




 

 మార్కులు సమమైతే:


 యూజీ పరీక్షలో ఇద్దరు అభ్యర్థులు ఒకే మార్కులు సాధిస్తే లీగల్ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు సాధించినవారిని పరిగణనలోకి తీసుకుంటారు. అక్కడ కూడా సమానమైతే ఎక్కువ వయసున్న అభ్యర్థికి ప్రాధాన్యమిస్తారు. పీజీ పరీక్షలో అయితే వ్యాసరూప ప్రశ్నల్లో ఎక్కువ మార్కులు సాధించినవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుంది.




 

 అందుబాటులో ప్రీవియస్ ప్రశ్నపత్రాలు:

 గతంలో నిర్వహించిన పాత ప్రశ్నపత్రాలను కూడా అభ్యర్థులు పొందొచ్చు. ఇందుకోసం రూ.250 చెల్లించి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ప్రశ్నపత్రాలను పొందే వీలుంది. పోస్ట్ ద్వారా ప్రశ్నపత్రాలు కావాల్సినవారు తపాల ఖర్చుల కింద అదనంగా మరో రూ.150 పంపాలి.

 

 యూజీ కోర్సుల అర్హత:

 జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగులు 45 శాతం (ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం) మార్కులతో 10+2 ఉత్తీర్ణత. 2014లో ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాసేవారు అర్హులే.

 వయోపరిమితి: జూలై 1, 2014 నాటికి జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగులకు 20 ఏళ్లు (ఎస్సీ/ఎస్టీలకు 22 ఏళ్లు) మించరాదు.

 పీజీ కోర్సులకు అర్హత:

 జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగులు 55 శాతం (ఎస్సీ, ఎస్టీలకు 50 శాతం) మార్కులతో ఎల్‌ఎల్‌బీ/ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎల్‌ఎల్‌బీ ఉత్తీర్ణత.

 

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా

 దరఖాస్తు రుసుం:  జనరల్/ఓబీసీ/శారీరక వికలాంగులకు రూ.4,000

 ఎస్సీ/ఎస్టీలకు రూ.3500

 ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: జనవరి 1, 2014

 ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 31, 2014

 పరీక్ష తేదీ: మే 11, 2014

 వెబ్‌సైట్: www.clat.ac.in

 

 ఇన్‌స్టిట్యూట్లు

 

 క్లాట్ ద్వారా ప్రవేశం కల్పించే యూనివర్సిటీలు:

 నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్‌ఎల్‌ఎస్‌ఐయూ) - బెంగళూరు

 నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా (నల్సార్) - హైదరాబాద్

 నేషనల్ లా ఇన్‌స్టిట్యూట్ యూనివర్సిటీ - భోపాల్

 ద వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జురిడికల్ సెన్సైస్ - కోల్‌కతా

 నేషనల్ లా యూనివర్సిటీ - జోధ్‌పూర్

 హిదయతుల్లాహ్ నేషనల్ లా యూనివర్సిటీ - రాయ్‌పూర్

 గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ-గాంధీనగర్

 డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ - లక్నో

 రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా - పాటియాలా

 చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ - పాట్నా

 ద నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ - కోచి

 నేషనల్ లా యూనివర్సిటీ - కటక్ (ఒడిశా)

 నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా - రాంచీ

 నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యుడీషియల్ అకాడమీ - గువహటి (అసోం)

 

 

 రిఫరెన్స్ బుక్స్

 ఇంగ్లిష్ గ్రామర్ - రెన్ అండ్ మార్టిన్, వర్డ్ పవర్ మేడ్ ఈజీ-నార్మన్ లూయిస్.

 లీగల్ అవేర్‌నెస్ అండ్ లీగల్ రీజనింగ్ ఫర్ ది క్లాట్-ఏపీ భరద్వాజ్

 ఏ మోడ్రన్ అప్రోచ్ టు లాజికల్ రీజనింగ్ - ఆర్‌ఎస్ అగర్వాల్

 క్లాట్ ఎగ్జామ్ గైడ్-అరిహంత్ పబ్లికేషన్స్

 క్లాట్ ప్రీవియస్ ప్రశ్నపత్రాలు

 జనరల్ నాలెడ్జ్ కోసం మళయాల మనోరమ ఇయర్‌బుక్, కరెంట్ అఫైర్స్ కోసం ఏవైనా మ్యాగజైన్లు, దినపత్రికలు.

 

 

 ప్రిపరేషన్ ప్లాన్..

 ఇంగ్లిష్ కాంప్రహెన్షన్:

 అభ్యర్థి ఇంగ్లిష్ వ్యాకరణాన్ని, గ్రహణశక్తిని పరిశీలించే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన విభాగం ఇంగ్లిష్. ఇచ్చిన ప్యాసేజ్ ప్రధాన విషయాన్ని గుర్తించడంతోపాటు పదాలను అర్థాలను తెలుసుకుని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. గ్రామర్ విభాగంగా తప్పుగా ఇచ్చిన వాక్యాలను గుర్తించి వాటిని సరిగా రూపొందించడం, వాక్యాల మధ్య ఇచ్చిన ఖాళీలో సరైన పదాన్ని నింపడం వంటివాటిపై ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. ఇంగ్లిష్‌లో అత్యధిక మార్కులు సాధించడానికి గ్రామర్‌ను వీలైనంతమేర ప్రాక్టీస్ చేయాలి. దీంతోపాటు ఏవైనా ఆంగ్ల దిన పత్రికల్లో ఒక ప్యాసేజ్‌ను పెన్సిల్‌తో నోట్‌బుక్‌లో రాసుకుని మధ్య ఖాళీలను చెరిపేసి సరైన పదాలతో నింపడం సాధన చేయాలి.




 

 జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్:

 వర్తమాన వ్యవహారాలపై అభ్యర్థికున్న పట్టును తెలుసుకోవడానికి ఉద్దేశించిన విభాగం జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. నిర్దేశిత సిలబస్ అంటూ లేని ఈ విభాగంలో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సమాధానం గుర్తించడానికి సిద్ధంగా ఉండాలి. ఈ విభాగంలో వ్యక్తులు - నియామకాలు, అవార్డులు, క్రీడలు - రికార్డులు, సమావేశాలు, ముఖ్యమైన దినోత్సవాలు, బిరుదులు, ముఖ్యమైన అంతర్జాతీయ సంఘటనలు, శాస్త్ర, సాంకేతిక అంశాలు, భారతదేశ స్వాతంత్య్రోద్యమం, శాస్త్రవేత్తలు - ఆవిష్కరణలు, భారతదేశ చరిత్ర - సంస్కృతి, ఐక్యరాజ్యసమితి, ఇస్రో ప్రయోగాలు, భారతదేశ క్షిపణి పరీక్షలు మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. ఈ విభాగంలో విజయం సాధించడానికి మలయాల మనోరమ ఇయర్‌బుక్‌తోపాటు ఫ్రంట్‌లైన్, కాంపిటీషన్ సక్సెస్ రివ్యూ వంటి మ్యాగజీన్లను చదవాలి. ప్రతిరోజు ఏవైనా రెండు దినపత్రికలను చదువుతుండాలి.




 

 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్:

 ఇందులో గణితంలో ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేలా ప్రశ్నలు ఎదురవుతాయి. పదో తరగతి స్థాయిలోనే ఈ ప్రశ్నలుంటాయి. ప్రాథమిక సూత్రాలు, ప్రాథమిక భావనలు, కాలం-దూరం, వడ్డీ, చక్రవడ్డీ, పని-సమయం వంటివాటిపై ప్రశ్నలుంటాయి. 8 నుంచి పదో తరగతి వరకు ఉన్న మ్యాథ్స్ టెక్ట్స్‌బుక్స్‌లోని సమస్యలను సాధన చేయాలి.




 

 లీగల్ ఆప్టిట్యూడ్:

 పరీక్షలో ఎక్కువ వెయిటేజ్ ఉన్న విభాగం లీగల్ ఆప్టిట్యూడ్. ఇందులో ప్రధానంగా స్టడీ ఆఫ్ లా, రీసెర్చ్ ఆప్టిట్యూడ్, సమస్య పరిష్కార సామర్థ్యంలో అభ్యర్థిని అంచనా వేసేలా ప్రశ్నలడుగుతారు. ఇచ్చిన న్యాయ సూత్రాలు, న్యాయ ప్రతిపాదనలు ఉపయోగించి ఇచ్చిన వాస్తవ సమితికి సరైన ముగింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన ప్రతిపాదనలు తప్పు లేదా కరెక్ట్ కావచ్చు. అయితే అభ్యర్థులు ఇచ్చిన ప్రతిపాదనలు నిజమైనవని భావించి సరైన సమాధానం గుర్తించాలి.




 

 లాజికల్ రీజనింగ్:

 తార్కిక నమూనాలు, లాజికల్ లింక్స్‌ను గుర్తించడంతోపాటు తర్కవిరుద్ధమైన వాదనలను సరిచేయడంలో అభ్యర్థి సామర్థ్యాన్ని పరీక్షించేలా ప్రశ్నలుంటాయి. ఇందులో భాగంగానే లాజికల్ సీక్వెన్సెస్, ఎనాలజీస్ మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. తార్కిక విశ్లేషణ శక్తిని పరీక్షించే ఈ విభాగంలో రాణించడానికి సమయస్ఫూర్తి, వేగం ప్రధాన ఆయుధాలు.

Read latest Education News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top