వానొస్తున్న జాడలు | Rain in Telugu states in two days | Sakshi
Sakshi News home page

వానొస్తున్న జాడలు

Jun 1 2017 12:29 AM | Updated on Sep 5 2017 12:28 PM

వానొస్తున్న జాడలు

వానొస్తున్న జాడలు

జనాన్ని ఎడాపెడా ఠారెత్తించిన గ్రీష్మం నిష్క్రమణకు రోజులు దగ్గర పడ్డాయి.

జనాన్ని ఎడాపెడా ఠారెత్తించిన గ్రీష్మం నిష్క్రమణకు రోజులు దగ్గర పడ్డాయి. కేరళలోని దక్షిణ భాగాన్ని సోమవారం తాకిన నైరుతి రుతు పవనాలు మరి రెండు రోజుల్లో తెలుగు రాష్ట్రాలను పలకరించబోతున్నాయి. జూన్‌ 1న రావాల్సిన రుతుపవనాలు రివాజుకు భిన్నంగా రెండు రోజుల ముందే కేరళకు వచ్చాయి. వరసగా నాలుగేళ్లపాటు కరువు కాటకాలు పీల్చి పిప్పి చేశాక నిరుడు సాధారణ వర్షపాతం కురిసింది. అయితే అది దక్షిణాదిన అంత ఆశాజనకంగా లేదు. అందువల్ల కరువు తప్పలేదు.

ఈ నేపథ్యంలో రుతు పవనాల గురించి ఏప్రిల్‌ నెలలో భారత వాతావరణ విభాగం చేసిన ప్రకటన ఎన్నో ఆశలు రేకెత్తిచ్చింది. రుతుపవనాలు ఈసారి సజావుగా, సాఫీగా సాగిపోతాయని, హెచ్చుతగ్గులు లేకుండా మెరుగైన రీతిలో వానల్ని అందిస్తాయని ఆ ప్రకటన తెలియజేసింది. ఈ వర్షరుతువులో దీర్ఘకాలిక వర్షపాత సగటు(ఎల్‌పీఏ) 96 శాతం ఉంటుందని చెప్పింది. ఎల్‌పీఏ 96 శాతం కన్నా తక్కువుంటే దాన్ని ‘సాధారణం కంటే తక్కువ వర్షపాతం’గా, 96–104 శాతాల మధ్య ఉంటే ‘సాధారణ వర్షపాతం’గా, 104–110 శాతం మధ్య ఉంటే దాన్ని ‘సాధారణ వర్షపాతం కన్నా అధికం’గా వాతావరణ శాస్త్రవేత్తలు పరిగణిస్తారు.

పాడిపంటలు,  ద్రవ్యోల్బణం...మొత్తంగా దేశ ఆర్ధిక వ్యవస్థ రుతుపవనాలతో ముడిపడి ఉంటాయి. మనకు కావలసిన వర్షపాతంలో దాదాపు 80 శాతం రుతుపవనాలే అందించడం, 60 శాతంపైగా సాగుభూమి వర్షాధారం కావడం ఇందుకు కారణాలు. అదునుకు వానలు పడితే సాగు పనులతో పల్లెసీమలు కళకళలాడతాయి. అందరికీ పుష్కలంగా పనులు దొరుకుతాయి. పశు గ్రాసానికి కూడా కొరత ఉండదు. కానీ రుతుపవనాలు ముఖం చాటేస్తే పల్లెసీమలు విలవిల్లాడతాయి. జనం ఉపాధి కోసం ఉన్న ఊరు వదిలి వలసలు పోవాల్సిన దుస్థితి ఏర్పడుతుంది. నిరుడంతా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పిల్లాపాపలనూ, వృద్ధులనూ ఇళ్ల వద్దే వదిలి కుటుంబ పోషణ కోసం వలసపోయిన కుటుంబాలు ఎన్నో! ఈసారి ఆ పరిస్థితి తలెత్తదని ఆశించాలి.

నైరుతి రుతుపవనాల రాక, వాటి గమనం ఎన్నో అంశాలపై ఆధారపడి ఉంటుంది. పసిఫిక్‌ మహా సముద్ర ఉపరితలంపై ఉష్ణోగ్రత అధికంగా ఉంటే గాలిలో తేమ శాతం పెరిగి ఎల్‌ నినో ఏర్పడి రుతుపవనాలు బలహీనంగా ఉంటాయని, వర్షాలు కురవక కరువు విలయతాండవం చేస్తుందని అంటారు. ఆ ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటే లానినా ఏర్పడి కుంభవృష్టి, వరదలు తప్పవని చెబుతారు. ఈ సీజన్‌ రెండో భాగం నాటికి ఎల్‌నినో ఏర్పడుతుందని అంతర్జాతీయ వాతావరణ నిపుణులు అంటున్నారు. అయితే మన హిందూ మహాసముద్రానికి ఒక స్వభావం ఉంది.

ఈ మహా సముద్ర పశ్చిమ ప్రాంత ఉపరితలంలో వేడి గాలులు వీచి ఉష్ణోగ్రత అధికమైనప్పుడు దాని తూర్పు ప్రాంతంలో సరిగ్గా అందుకు విరుద్ధమైన పోకడ ఉంటుంది. ఈ స్వభావం పసిఫిక్‌ మహాసముద్రంలో ఏర్పడే ఎల్‌నినో ప్రభావాన్ని తటస్థం చేస్తుంది. హిందూమహాసముద్రంపై ఆవరించి ఉండే మేఘాల స్థితిగతులు, వాతావరణంలో ఉండే గాలి తుంపరలు, అటవీసాంద్రత వంటివెన్నో ఎల్‌నినోను ప్రభావితం చేస్తాయి. అందువల్లే ఒక్కోసారి పసిఫిక్‌లోఎల్‌నినో ఏర్పడినా మన దేశంలో రుతుపవనాలు సజావుగా ఉంటాయి. అసలు ఎల్‌నినో ప్రభావాన్ని ముందుగా అంచనా వేయడం అశాస్త్రీ యమని కొందరు శాస్త్రవేత్తల భావన.

అయితే వర్షాలు సజావుగా పడటం వల్ల మాత్రమే అంతా అయిపోదు. ‘దేవుడు వరమిచ్చినా పూజారి ఇవ్వలేద’న్నట్టు ప్రకృతి తన పని తాను చేసినా పాలకుల్లో కదలిక లేకపోతే అంతా వృథా అవుతుంది. వానలు మొదలై దుక్కి దున్నడానికి రైతు సిద్ధపడే సమయానికి అతడికి డబ్బు అందుబాటులో ఉండాలి. పంట రుణాలు చేతికందకపోతే పనులు ఆలస్యమవుతాయి. సకాలంలో నాట్లు పడకపోతే పైరు ఎదుగుదల సక్రమంగా ఉండదు. మంచి దిగుబడి సాధ్యపడదు. రుణమాఫీ అమలు అంతంతమాత్రంగా ఉండటంతో బ్యాంకుల్లో అప్పు పుట్టక ఆంధ్రప్రదేశ్‌లో రైతులు గత మూడేళ్లుగా ఇబ్బందులు పడుతున్నారు.

ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. వారితో పోలిస్తే తెలంగాణ రైతుల స్థితి మెరుగ్గా ఉంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌కైనా బాబు సర్కారు మేల్కొనాలి. ఏటా రైతుల్ని బాధించే మరో అంశం విత్తనాల అలభ్యత. ఖరీఫ్‌ సీజన్‌కు విత్తనాలు రెడీ చేశామని, కొరత ఉండే సమస్యలేదని వ్యవసాయ శాఖ చెప్పడం, తీరా వాటి కోసం చేంతాడంత క్యూలు తప్పకపోవడం రివాజు. ఏ ఏ ప్రాంతాల్లో రైతులు ఏ పంట వైపు మొగ్గు చూపుతున్నారో, ఆ అవసరాలు తీరడానికి ఎన్ని క్వింటాళ్ల విత్తనాలు అవసరమో అంచనాకు రావడం, వాటిని సకాలంలో అందించడం ముఖ్యం. మరోపక్క కల్తీ విత్తనాలు మార్కెట్‌లోకి రాకుండా చూడాల్సిన బాధ్యత పాలకులపై ఉంటుంది. ఇలాంటి విత్తనాల కారణంగా ఏటా రైతులు కోట్లాది రూపాయలు నష్టపోతున్నారు.

రుతుపవనాలు సక్రమంగా ఉంటేనే సరిపోదు.... కురిసే వర్షాల వల్ల వచ్చే ఉపద్రవాలను ఎదుర్కొనే సంసిద్ధత పాలకులకు ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల నిర్వహణ సక్రమంగా లేకపోతే కురిసిన నీరంతా ఊళ్లను ముంచె త్తుతుంది. పట్టణ ప్రాంతాల్లో సక్రమంగా లేని డ్రైనేజీ వ్యవస్థ ప్రాణాం తకమవుతుంది. నాలాలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లి బస్తీలన్నీ అస్తవ్యస్థమవు తాయి. గట్టిగా ఏడెనిమిది సెంటీమీటర్ల వర్షం కురిసిందంటే మన పట్టణాలు, నగరాలు నరకాలకు నకళ్లవుతాయి. చిగురాటాకుల్లా వణుకుతాయి.

కనుక శిథి లావస్థలో ఉన్న భవనాలను గుర్తించి సరిచేయించాలి. నివాసానికి అసలే పని కిరావనుకున్న వాటిని కూల్చేయాలి. ప్రభుత్వ యంత్రాంగం చురుగ్గా వ్యవహరించి ముందస్తు ప్రణాళికలు రచించుకుని జాగ్రత్తగా వ్యవహరిస్తే... జనాన్ని ఎప్ప టికప్పుడు అప్రమత్తం చేస్తే నష్టం కనిష్టంగా ఉంటుంది. సమస్యలు త్వరగా సమసిపోతాయి. ఈసారి వర్షాలపై వాతావరణ శాఖ నెల్లాళ్లక్రితం అందించిన అంచనాలతో ప్రభుత్వాలు ఈపాటికే తగిన కార్యాచరణ సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నాయని ఆశిద్దాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement