‘నమో’ బాణాలు! | Narendra Modi-Mamata Banerjee closeness, Congress-CPM envious | Sakshi
Sakshi News home page

‘నమో’ బాణాలు!

Feb 7 2014 3:54 AM | Updated on Aug 14 2018 4:44 PM

ఎన్నికలు సమీపిస్తున్నాయనేసరికి ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. మళ్లీ అధికారం అందిపుచ్చుకోగలమో, లేదోనని పాలకపక్షం బెంగపడితే .... అన్నీ అనుకూలించి దాన్ని ఓడించడానికి మార్గం సుగమం అవుతుందా,

సంపాదకీయం: ఎన్నికలు సమీపిస్తున్నాయనేసరికి ఒక్కొక్కరిది ఒక్కో సమస్య. మళ్లీ అధికారం అందిపుచ్చుకోగలమో, లేదోనని పాలకపక్షం బెంగపడితే .... అన్నీ అనుకూలించి దాన్ని ఓడించడానికి మార్గం సుగమం అవుతుందా, లేదా అని విపక్షాలు ఆత్రుతపడతాయి. సామాన్యుడి బెంగ వేరు. ఈ ఎన్నికల రుతువులో వినవచ్చే పరస్పర దూషణలకూ, విమర్శలకూ ఎప్పుడు బ్రేకుపడుతుందా... ఎప్పుడు ప్రాణం హాయిగా ఉంటుందా అని ఎదురుచూస్తాడు. అయితే, కాలం మారింది. మిగిలిన రుతువులన్నీ కిందమీదవుతున్నట్టే ఎన్నికల రుతువు కూడా ముందే వచ్చేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికే ఇంకా 20 రోజులకుపైగా వ్యవధి ఉండగా పార్టీలన్నీ ఎన్నడో ప్రచారాన్ని ప్రారంభించేశాయి. అధికా రంలో ఉన్న యూపీఏ చేసేవన్నీ చేసిపోదామని తొందరపడుతుంటే... దాన్ని సందర్భం చిక్కినప్పుడల్లా ఉతికి ఆరేయాలని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తాపత్రయపడుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి అయితే ఈ విషయంలో సొంత పార్టీకి కూడా చిక్కనంత వేగంగా పరుగులు పెడుతున్నారు. సందర్భమో, అసందర్భమో... కాంగ్రెస్‌పై వీలు కుదిరినప్పుడల్లా బాణాలేస్తున్నారు. అది ఆగస్టు పదిహేనా, రిపబ్లిక్ డేనా... ఫలానా విషయంపై విమర్శించవచ్చా, లేదా అనే విచక్షణ కూడా ఆయనకు లేదు. తనకు మాత్రమే ప్రత్యేకమైన సంభాషణా చతురతతో... దానికి సహజసిద్ధమైన నాటకీయత జోడించి ఆయన మాట్లాడే మాటలు తరచూ వివాదాస్పదం కూడా అవుతున్నాయి.
 
 కోల్‌కతాలో బుధవారం జరిగిన బీజేపీ ర్యాలీలో చేసిన ప్రసంగం ఆ కోవలోనిదే. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని కావలసిన అన్ని అర్హతలూ ఉన్నా కాంగ్రెస్ నాయకత్వం ఆయన్ను ఎదగనీయలేద ని మోడీ విమర్శించారు. 1984లో ప్రధాని అయినప్పుడు రాజీవ్‌గాంధీ తన కేబినెట్‌లో ఆయనకు చోటీయకుండా మొహం చాటేస్తే, 2004లో సోనియాగాంధీ ప్రధాని పదవికి మన్మోహన్‌ను ఎంచుకుని ప్రణబ్‌కు మరోసారి అన్యాయం చేశారని మోడీ విమర్శల సారాంశం. నిజానికి ఇవేమీ కొత్త విషయాలు కాదు. ప్రణబ్ స్వతంత్రంగా వ్యవహరిస్తారనో, సంక్షోభ పరిష్కర్తగా పేరున్న ఆయనను ప్రధాని పదవిలో కూర్చోబెడితే ఇతరత్రా సమస్యలపై దృష్టిపెట్టేవారుండరన్న భయమో... మొత్తానికి సోనియాగాంధీ ప్రణబ్‌ను కాదని మన్మోహన్‌ను ఎంచుకున్న సంగతి నిజమే.
 
 అయితే, బీజేపీలోని మిగిలినవారికీ, మోడీకీ ఇక్కడే తేడా ఉంది. రాష్ట్రపతి పదవిలో ఉన్నవారి గురించి వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయొద్దన్న సంప్రదాయాన్ని వారు పాటిస్తారు. మోడీ అలా చేయరు. సభ జరుగుతున్నది బెంగాల్‌లో గనుక అక్కడివారిని ప్రశంసించి, దానిద్వారా కాంగ్రెస్‌పై ఓ రాయి వేయడమే ఆయనకు కావాల్సింది. ఈ హడావుడిలో ఇదే సూత్రం బీజేపీకీ వర్తిస్తుందని ఆయన మరిచిపోతారు. బీజేపీ కురువృద్ధుడు ఎల్.కె.అద్వానీ లోక్‌సభలో ఏక సంఖ్యగా ఉన్న బీజేపీ బలాన్ని తన రథయాత్రతో ముందు రెండంకెలకూ, అటుతర్వాత మూడంకెలకూ ఉరకలెత్తించిన వారు. అలాంటి నేతను కాదని ఈసారి ప్రధాని అభ్యర్థిగా పార్టీ తనకే పట్టంగట్టిన సంగతిని మోడీ మరచిపోకూడదు. అద్వానీ విషయంలో బీజేపీకి ఉన్నట్టే... ప్రణబ్‌ను కాదనుకోవడానికో, ఆయనకు అన్యాయం చేయడానికో కాంగ్రెస్‌కుండే కారణాలు కాంగ్రెస్‌కుంటాయి.
 
  వామపక్షాల పుట్టిల్లయిన బెంగాల్‌లో ఆయన కాంగ్రెస్‌తోపాటు తృతీయ ఫ్రంట్‌పై కూడా విమర్శనాస్త్రాలు సంధించారు. ఇంకా పుట్టని, పేరైనాపెట్టని ఆ ఫ్రంట్‌పై మోడీకి ఎందుకింత తొందరో అర్థం కాదు. అసలు మూడో ఫ్రంట్‌లో ఏ ఏ పక్షాలు కలుస్తాయి...వారికి ఉండగల ఉమ్మడి కార్యక్రమమేమిటి... ఆ ఫ్రంట్‌కు నేతృత్వంవహించేవారెవరన్న స్పష్టత లేకుండానే అది అధికారంలోకొస్తే దేశానికి రాగల అరిష్టాలేమిటో మోడీ ఏకరువుపెట్టడం దిగ్భ్రాంతిపరిచే విషయం. మమతాబెనర్జీ మొదలుకొని జయలలిత, ములాయంసింగ్ వరకూ చాలామందికి ఈసారి ప్రధాని పదవిపై మమకారం ఏర్పడిన సంగతి నిజమే.
 
 
  అయితే, వీరిలో పరస్పరం పొసగనివారున్నారు. మమత ప్రమేయం ఉండే ఏ ఫ్రంట్‌లోనూ వామపక్షాలుండవు. ములాయం ఉన్నచోట మాయావతికి చోటుండదు. ఇద్దరికీ ప్రధాని పదవిపై ఆశ ఉన్నది గనుక ములాయం, జయలలితల్లో ఎవరో ఒకరే ఆ ఫ్రంట్‌లో ఉంటారు. పరిస్థితులు ఇంత గందరగోళంగా, కంగాళీగా ఉండగా... మూడో ఫ్రంట్ ఏర్పడినట్టు, జనం అప్పుడే దానివైపు చూస్తున్నట్టు లెక్కలేసుకుని ఆ ‘ప్రమాదం’నుంచి దేశాన్ని కాపాడే బృహత్తర బాధ్యతను మోడీ నె త్తినేసుకున్నట్టు కనబడుతోంది. ఆ థర్డ్ ఫ్రంట్ వస్తే దేశం అధమస్థాయికి వెళ్లిపోతుందట! అలాంటి ప్రయత్నాలు చేసే వారిని రాజకీయాల్లో ఏకాకులను చేయాలట! ఉనికిలో లేని పక్షంపై ఇన్ని విమర్శలు సంధించిన మోడీ, అలాంటి ఏదో ఒక ఫ్రంట్‌లో భాగస్వామి కాగల అవకాశం ఉన్న బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని మాత్రం పల్లెత్తుమాట అనలేదు.
 
  పైగా ఆమెను ప్రశంసలతో ముంచెత్తారు. సరిగ్గా వారంక్రితం మోడీ సభ చేసినచోటే మమతా బెనర్జీ కూడా పెద్ద సభను నిర్వహించారు. అప్పుడామె మోడీపై నేరుగా విమర్శలు సంధిస్తూ ఆయన నేతృత్వంలో ఏర్పడేది ‘అల్లరిమూకల సర్కారే’నని ఎద్దేవా చేశారు. అయినా మోడీ ఆమెను ఒక్క మాట అనలేదు. భవిష్యత్తులో ఏర్పడగల రాజకీయ సమీకరణాల్లో ఆమె పార్టీతో చెలిమి అవసరం ఉంటుందని మోడీ అంచనాకు రావడమే ఇందుకు కారణమని వేరే చెప్పనవసరం లేదు. మొత్తానికి మోడీ మెరుపు వేగం ఏకకాలంలో బీజేపీకి బలమూ, బలహీనతా కూడా. అందులో ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది మున్ముందు తేలుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement