భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది.
భర్త వేధింపులు తట్టుకోలేక ఓ వివాహిత వంటి పై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఆదివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పట్టణంలోని నల్లబండకు చెందిన శాంతి(24)కి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు ఆడపిల్లలు. గత కొంత కాలంగా భార్యా భర్తల మధ్య తరచు గొడవలు జరుగుతుండేవి. ఈ మధ్య కాలంలో వేధింపులు ఎక్కువవడంతో.. శాంతి ఆదివారం రాత్రి అందరు నిద్రిస్తున్న సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంది. దీంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. భర్తే హత్య చేసి ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నాడని.. మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.