‘నగర ప్రజలకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా.. సహించేది లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో జాప్యం తగదు. టౌన్ ప్లానింగ్లో దళారీ వ్యవస్థను కట్టడి చేయండి’ అని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
టౌన్ప్లానింగ్లో దళారీలను కట్టడి చేయాలి
దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎల్ఆర్ఎస్ చేయాలి
టౌన్ప్లానింగ్ అధికారులపై ఎమ్మెల్యే అజయ్కుమార్ ఆగ్రహం
ఖమ్మం : ‘నగర ప్రజలకు అన్ని వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయల నిధులు విడుదల చేస్తోంది. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ఎవరు వ్యవహరించినా.. సహించేది లేదు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో జాప్యం తగదు. టౌన్ ప్లానింగ్లో దళారీ వ్యవస్థను కట్టడి చేయండి’ అని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్కుమార్ కార్పొరేషన్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎల్ఆర్ఎస్ను జాప్యం చేస్తున్నారనే ఫిర్యాదు మేరకు శనివారం ఎమ్మెల్యే కార్పొరేషన్ కార్యాలయంలోని టౌన్ప్లానింగ్ విభాగాన్ని పరిశీలించారు. ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు ఎన్ని వచ్చాయి..? ఇప్పటి వరకు ఎన్నింటిని పూర్తి చేశారనే అంశాలను ఏసీపీ రామచందర్ను, టీపీఓ ప్రకాష్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. ఈ నెల 31 వరకు ఎల్ఆర్ఎస్ ప్రక్రియ పూర్తవుతుందనే విషయంపై డైరెక్టర్ ఆఫ్ సిటీ ప్లానర్ అధికారులతో ఎమ్మెల్యే ఫోన్లో మాట్లాడి గడువు పెంచాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే విలేకరులతో మాట్లాడారు. ఎల్ఆర్ఎస్ ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయని, వాటిని సరిచేసుకోవాలని సూచించారు. వచ్చిన దరఖాస్తులన్నింటినీ వరుస క్రమంలో పంచ్ చేసి.. వేర్వేరు కౌంటర్లు పెట్టాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఈ నెల 31 చివరి తేదీ అనే విషయంపై నగర ప్రజల్లో ఆందోళన ఉందని, అయితే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ ఎల్ఆర్ఎస్ చేస్తామని, గడువు పెంచినట్లు ప్రచారం చేయాలని కమిషనర్ను ఆదేశించారు. దరఖాస్తులను ఆధారంగా తీసుకుని ప్రతి ఒక్కరికీ సెల్ మెసేజ్ అందించడంతోపాటు నోటీసులు కూడా జారీ చేయాలని తెలిపారు. వారి విన్నపాలను, వారికి తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు ఉద్యోగులు సిద్ధంగా ఉండాలన్నారు. లైసెన్స్ సర్వేయర్లు చెప్పిందే వేదంగా కార్పొరేషన్లో అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తంచేశారు. సర్వేయర్లను కార్యాలయం చాంబర్లోకి రానివ్వడంతోపాటు వారే దరఖాస్తులను తీసుకోవడం విడ్డూరంగా ఉందని, మరోసారి ఇలా జరిగితే వారికి సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్పొరేషన్లో అంతా పారదర్శకంగా ఉండాలని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించడం, అధికారులు డబ్బులకు కక్కుర్తిపడి నిబనంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం సహించేది లేదని పేర్కొన్నారు. సమావేశంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, టౌన్ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.