రోడ్డు ప్రమాదంలో లారీ క్లీనర్ దుర్మరణం
భీమడోలు : జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ క్లీనర్ మరణించాడు.
భీమడోలు : జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద గురువారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ లారీ క్లీనర్ మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన లారీ క్లీనర్ ప్రవీణ్(22) కొత్తిమీర లోడుతో వస్తున్న లారీపై పనిచేస్తున్నాడు. ఆ లారీ అమలాపురం వెళుతుండగా, జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద గురువారం తెల్లవారుజామున ప్రమాదానికి గురైంది. ముందు వెళ్తున్న మరో లారీ సడన్ బ్రేక్ వేయడంతో వేగంగా వస్తున్న ఈ లారీ దానిని ఢీకొంది. ఢీకొట్టిన లారీలో ఉన్న క్లీనర్ ప్రవీణ్ క్యాబిన్లోనే మరణించాడు. ప్రమాదంలో లారీ ముందుభాగం నుజ్జునుజ్జయింది. సమాచారం అందుకున్న భీమడోలు ఎస్సై బి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.