
కరువు మండలాలు 231
ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 231 మండలాలను కరువు మండలాలుగా
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలను ప్రకటించింది. 231 మండలాలను కరువు మండలాలుగా పేర్కొంటూ ఉత్తర్వులు జారీచేసింది. వర్షాభావం ఎక్కువగా ఉన్న ఏడు జిల్లాల్లో గుర్తించిన కరువు మండలాల జాబితాను విడుదల చేసిం ది. రాష్ట్ర ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం కమిషనర్ బి.ఆర్.మీనా మంగళవారం ఈమేరకు నోటిఫికేషన్ జారీ చేశారు. ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలు మినహా ఏడు జిల్లాల్లో కరువు తీవ్రత ఉన్నట్లుగా ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లోని అన్ని మండలాల్లో కరువు నపరిస్థితులు ఉన్నాయని, రంగారెడ్డి, కరీంనగర్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో పాక్షికంగా కరువు ఉందని నిర్ధారించింది.
మహబూబ్నగర్ జిల్లాలో 64 మండలాలను, మెదక్ జిల్లాలో 46, నిజామాబాద్లో 36, రంగారెడ్డిలో 33, నల్లగొండలో 22, కరీంనగర్లో 19, వరంగల్లో 11 మండలాలను ఈ జాబితాలో చేర్చింది. సగానికిపైగా మండలాల్లో కరువు దుర్భర పరిస్థితులున్నందున తక్షణమే రూ. వెయ్యి కోట్ల ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించాలని కూడా విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు, కరువు మండలాల ప్రకటనపై మంగళవారం ఉదయం కేసీఆర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి మీనా, సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగరావు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ నివేదికను కేంద్రానికి పంపింది.
నివేదికల ఆధారంగా ప్రకటన
అత్యల్ప వర్షపాతం నమోదైన మండలాలు, వర్షాల మధ్య వ్యవధి, పంట నష్టం తీరు తెన్నులను వివరిస్తూ అన్ని జిల్లాల కలెక్టర్లు పంపిన నివేదికలను ప్రభుత్వం పరిశీలించింది. తీవ్ర దుర్భిక్షం నెలకొన్న మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని కలెక్టర్లు నివేదికల్లో కోరారు. అలాగే వాతావరణ శాఖ, వ్యవసాయ శాఖ, వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇచ్చిన నివేదికలను పరిశీలించేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కరువు నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ చేసిన సిఫారసుల మేరకు కరువు మండలాలను ప్రకటించినట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ఆధారంగా జిల్లా స్థాయిలో కలెక్టర్లు కరువు మండలాల నోటిఫికేషన్ జారీ చేసి జిల్లా గెజిట్లో నమోదు చేస్తారు.
ఖరీఫ్లో తీవ్ర నష్టం
రాష్ట్రంలో జూన్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ సీజన్లో వర్షాభావం వెంటాడింది. నాలుగు నెలల వ్యవధిలో సాధారణంగా 713.6 మి.మీ. వర్షపాతం నమోదుకావాల్సి ఉండగా కేవలం 610.8 మి.మీ. నమోదైంది. దాదాపు 14 శాతం తక్కువ వర్షం కురిసింది. రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో వర్షాభావం ఎక్కువగా ఉండటం, వర్షాల మధ్య వ్యవధి ఎక్కువగా ఉండటంతో పంటలు ఎండిపోయాయి. మిగిలిన పంటల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. వర్షాధార పంటలకు భారీ నష్టం వాటిల్లింది.