మంచానికి కట్టేసి.. పెట్రోలు పోసి..
సాక్షి, చెన్నై : నేరమే చేశాడో లేక పాతపగలతో ఎవరైనా కసిగా కక్షనే తీర్చుకున్నారో తెలియదు.. ఓ యువకుడిని మంచానికి కట్టేసి, పెట్రోలు పోసి నిప్పంట్టించారు. యువకుడిని కిరాతకంగా సజీవదహనం చేసిన ఉదంతం తేనీ జిల్లాలో గురువారం జరిగింది. తేనీ జిల్లా మూనార్ జాతీయ రహదారిలోని బోడినాయకనూరులో భూగర్భ డ్రైనేజీ నీటి శుద్ధీకరణ కేంద్రం ఉంది. ఈ కేంద్రం ఆవరణలో మంచానికి యువకుడు కట్టేసి పూర్తిగా కాలిపోయిన స్థితిలో పడిఉన్నాడు. ఉదయం విధులకు హాజరయ్యేందుకు వచ్చిన నీటి శుద్ధీకరణ కేంద్రం ఉద్యోగులు ఆ దృశ్యాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడికి వచ్చిన పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి పంపారు. యువకుడి దేహంతోపాటూ ముఖం కూడా పూర్తిగా కాలిపోవడంతో అతడు ఎవరో గుర్తించలేకపోయారు. డీఎస్పీ ఈశ్వరన్ నేతృత్వంలో పోలీసులు విచారణ చేపట్టారు.