విఫలమైన మరో ప్రేమ వివాహం | Married Woman Suspicious death | Sakshi
Sakshi News home page

అనుమానానికి మరో యువతి బలి!

Apr 16 2018 12:26 PM | Updated on Oct 17 2018 6:10 PM

Married Woman Suspicious death - Sakshi

ప్రవళిక మృతదేహం

నిజామాబాద్‌ క్రైం(నిజామాబాద్‌అర్బన్‌): పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్న ఓ యువతి.. మూడు నెలలు కూడా తిరక్కుండానే అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఇటీవలే ప్రేమ విఫలమై ప్రజ్ఞ ఆత్మహత్య చేసుకున్న ఘటన జరిగి వారం కూడా కాకముందే మరో ప్రేమికురాలు అర్ధంతరంగా తనువు చాలించింది. ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకున్న భర్తే ఆమె మృతికి కారణమై ఉంటాడని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భార్యను ఆస్పత్రిలో చేర్చించిన అతడు మృతి విషయం తెలిసిన వెంటనే పరారు కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం.. నగరంలోని హమాల్‌వాడీకి చెందిన ప్రవళ్లిక(22) సదాశివనగర్‌ మండలం దగ్గి గ్రామానికి చెందిన ప్రేమ్‌ని మూన్నెళ్ల క్రితం పెళ్లి చేసుకుంది. వీరిద్దరు డిచ్‌పల్లి మండలంలోని తిరుమల నర్సింగ్‌ కళాశాలలో బీ ఫార్మసీ చదివారు. అప్పుడే వారి పరిచయం ప్రేమగా మారింది. ప్రేమ్‌కు డబ్బులు అవసరం ఉండటంతో అప్పుడప్పుడు దాదాపు రూ. 40 వేల వరకు ఇచ్చినట్లు తెలిసింది. రెండు కుటుంబాల పెద్దలకు గొడవలు కావడంతో వారిద్దరు కలుసుకోవద్దని కాగితాలు రాసుకుని, ప్రవళిక ప్రేమ్‌కు ఇచ్చిన డబ్బులను ఇప్పించారు.

అయితే వీరిద్దరు మూన్నెళ్ల క్రితం జాన్కంపేట్‌ లక్ష్మీనరసింహ ఆలయంలో పెళ్లి చేసుకున్నారు. నగరంలోని గాయత్రినగర్‌లో కాపురం పెట్టారు. ప్రేమ్‌ నగరంలోని తిరుమల ఆస్పత్రిలో పనిలో చేరాడు. కొద్ది రోజులుగా ప్రేమ్‌ ప్రవళికను అనుమానించటం మొదలుపెట్టాడు. ‘నువ్వు చాలా అందంగా ఉంటావు, నిన్ను చాలామంది చూస్తుంటారని, ఎక్కడికైనా వెళ్లితే ఎవరిని కలిశావంటూ వేధించాడు. శనివారం కూతురు తల్లి జయకు ఫోన్‌ చేసి వేధిస్తున్న విషయాలు చెప్పుకుని బాధపడింది. దాంతో తల్లి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో గాయత్రినగర్‌లో ఉంటున్న కూతురి వద్దకు వెళ్లి అల్లుడును సముదాయించింది. ఇంతలో ప్రవళిక వాంతులు చేసుకోవటంతో ప్రేమ్‌ టాబ్లెట్స్‌ తెచ్చి వేశాడు. వారిద్దరు కలిసి బయటకు వెళ్లడంతో కూతురు, అల్లుడు బాగున్నారని జయ ఇంటికి వెళ్లిపోయింది. రాత్రి 12 గంటల ప్రాంతంలో ప్రేమ్‌ అత్తకు ఫోన్‌ చేసి నీ కూతురి ఆరోగ్యం బాగాలేదని, తిరుమల ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించినట్లు చెప్పడంతో ఆమె ఆందోళనకు గురైంది. అక్కడ ఆమె చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినది. విషయం తెలుసుకున్న ప్రేమ్‌ ఆస్పత్రి నుంచి పారిపోయాడు. విషయం తెలుసుకున్న నాల్గోటౌన్‌ పోలీసులు ఆస్పత్రి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతురాలి తల్లి జయ అల్లుడు ప్రేమ్‌ తన కూతురిని వేధించటంతో మృతిచెందినట్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రేమ్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఆదివారం రాత్రి ప్రవళిక అంత్యక్రియలు పూర్తి చేశారు.

ప్రవళిక కుటుంబానిది దీనగాథ..
పేదరికంలో ఉన్న ప్రవళిక తన కుటుంబంపై తన పెళ్లి భారం కాకూడదని భావించింది. తండ్రి కొన్నేళ్ల క్రితం మృతిచెందగా, కుటుంబానికి పెద్ద దిక్కు అన్న సంతోష్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమయ్యాడు. దాంతో ఈ కుటుంబ పరిస్థితి దాయనీయంగా మారింది. ఈ క్రమంలో ప్రియుడిని పెళ్లి చేసుకుది. భర్త వేధింపులు భరించలేక బాధను తల్లితో చెప్పుకోగా విషయం బయటపడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement