ఇంటికి వస్తున్నా అన్నాడు.. కాసేపటికే..

Man Died in Road Accident PSR Nellore - Sakshi

నాయుడుపేటలో మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు

నాయుడుపేటటౌన్‌: మండల పరిధిలోని మేనకూరు గ్రామ సమీపంలో రహదారిపై గురువారం రాత్రి సన్నిబోయిన అనిల్‌కుమార్‌యాదవ్‌ (28) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. పెళ్లకూరు మండల దిరసనమాల గ్రామానికి చెందిన అనిల్‌కుమార్‌ మేనకూరు సెజ్‌లోని ఓ పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఆరు సంవత్సరాల క్రితం శ్రీలక్ష్మి అనే మహిళతో వివాహమైంది. ఇద్దరు మగపిల్ల లున్నారు. గురువారం రాత్రి అనిల్‌ డ్యూటీ నుంచి మోటార్‌బైక్‌లో బయలుదేరుతూ కుటుంబసభ్యులకు ఫోన్‌ చేసి ‘ఇంటికి వస్తున్నాను’ అని చెప్పాడు.

కొద్దిసేపటికే అతను రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని కుటుంబసభ్యులకు సమాచారం అందింది. దీంతో కన్నీరుమున్నీరుగా విలపించారు. శుక్రవారం ఉదయం స్థానిక ప్రభుత్వ వైద్యశాల వద్దకు మృతుడి తల్లిదండ్రులతోపాటు భార్య, బంధువులు, అతని స్నేహితులు చేరుకున్నారు. పోస్టుమార్టం గదిలో నిర్జీవంగా ఉన్న అనిల్‌కుమార్‌ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందించారు. అదేవిధంగా ఈ ప్రమాదంలో రోడ్డుపై నడిచి వెళుతున్న మేనకూరు గ్రామానికి చెందిన మైలారి గోవర్ధన్‌ అనే వ్యక్తిని మోటార్‌బైక్‌ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. అతని పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో గురువారం రాత్రి చికిత్స నిమిత్తం నెల్లూరుకు తీసుకెళ్లినట్టు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top