ఎత్తులు..జిత్తులు

Cyber Crimes Rises in Hyderabad - Sakshi

అప్‌డేట్‌ అవుతున్న సైబర్‌ నేరగాళ్లు

ఓ పక్క అకౌంట్‌ టేకోవర్లు మరోపక్క కోర్టుల పేరుతో కాల్స్‌

ప్రముఖ సంస్థలు పంపినట్లు ఈ–మెయిల్స్‌

తక్కువ ధరకు ఫోన్లంటూ అందినకాడికి టోకరా

కలిసి వస్తున్న వ్యవస్థాపరమైన లోపాలు

బహుపరాక్‌ అంటున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

సాక్షి, సిటీబ్యూరో: ఇటీవలి కాలంలో సైబర్‌ నేరగాళ్లు కొత్త ఎత్తులు వేస్తున్నారు. అకౌంట్‌ టేకోవర్లు, ప్రముఖ సంస్థల పేరుతోనే ఈ–మెయిల్స్‌కు తోడు న్యాయస్థానాల్లో కేసులంటూ ఫోన్లు చేస్తూ రెచ్చిపోతున్నారు. వ్యవస్థాపరమైన లోపాలే వీరికి కలిసి వస్తున్నట్లు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు పేర్కొంటున్నారు. 

హ్యాకింగ్‌లో వేల సంఖ్యలో ఈ–మెయిల్‌ ఖాతాలు...
సైబర్‌ నేరాలన్నింటికీ మూలం బాధితుడి ఈ–మెయిల్‌ అకౌంట్‌. సైబర్‌ క్రైమ్‌ పోలీసుల గణాంకాల మేరకు నిత్యం వేల అకౌంట్లు హ్యాక్‌ అవుతున్నాయి.  ‘కీ–లాగర్స్‌’ అనే వైరస్‌ను పంపడం ద్వారా వినియోగదారుడికి తెలియకుండానే మెయిల్‌లో వారు వేసే ప్రతి అడుగూ సైబర్‌ నేరగాడు సేకరించి అందులోని వివరాలను సంగ్రహిస్తూ అవసరమైనప్పుడు గాలం వేస్తున్నారని పోలీసులు చెబున్నారు. పర్సనల్‌ కంప్యూటర్లలో అశ్లీల వెబ్‌సైట్లు చూసే వారికి ‘కీ–లాగర్స్‌’ ముప్పు అధికంగా ఉంటుందన్నారు. 

ఆర్థిక లావాదేవీలుంటే అకౌంట్‌ టేకోవర్‌...
నైజీరియన్లు సూత్రధారులుగా ఇటీవల కాలంలో ఉత్తరాదిలో జోరుగా సాగుతున్న అకౌంట్‌ టేకోవర్‌ తాలూకు ఛాయలు నగరంలోనూ బయటపడుతున్నాయి. హ్యాక్‌ చేసిన ఈ–మెయిల్స్‌లోని వ్యాపార లావాదేవీలను గమనిస్తున్న సైబర్‌ నేరగాళ్లు చెల్లింపుల సమయంలో పంజా విసురుతున్నారు. బ్యాంకు ఖాతా నెంబర్‌ మారిందంటూ వ్యాపారులే పంపినట్లు కస్టమర్లకు మెయిల్‌ పంపుతున్నారు. దీనిని సరిచూసుకోకుండా ఎవరైనా కస్టమర్‌ చెల్లింపులు చేస్తే  సదరు వ్యాపారికి చేరాల్సిన నగదు వీరి ఖాతాలో పడిపోతోంది. వెంటనే ఏటీఎం కార్డులు, సెల్ఫ్‌ చెక్కుల ద్వారా డబ్బు డ్రా చేసుకుంటున్నారు. దీనినే సాంకేతికంగా అకౌంట్‌ టేకోవర్‌గా పేర్కొంటారు. 

కోర్టుల పేరుతో కాల్స్‌..
ఇటీవల నగరంలోని పలువురికి ఢిల్లీ, ముంబై న్యాయస్థానాల పేరుతో ఫోన్లు వస్తున్నాయి. గతంలో వినియోగించిన సెల్‌ఫోన్‌ కంపెనీ, ఇంటర్‌నెట్‌ డేటాకార్డ్‌ సంస్థ పేర్లతో ఈ కాల్స్‌ చేస్తున్నారు. తొలుత కోర్టు అధికారినంటూ పరిచయం చేసుకునే ఓ వ్యక్తి మీ పైన కేసు ఉందని, విచారణ కోసం రావాల్సి వస్తుందని బెదిరిస్తూ అడ్వకేట్‌దని చెబుతూ మరో నంబర్‌ ఇస్తాడు. వినియోగదారుడు సదరు నంబర్‌కు ఫోన్‌ చేస్తే  పాత కంపెనీ మీపై కేసు వేసిందని, మీరు కోర్టు వరకు రాకుండా  సెటిల్‌ చేసేందుకు రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు చెల్లించాలని ఓ అకౌంట్‌ నెంబర్‌ ఇస్తున్నారు. వారి మాటలు నమ్మిన అనేక మంది నగదు చెల్లిస్తున్న సందర్భాలు ఉన్నాయి. 

తక్కువ ధరకు ఫోన్లంటూ...
ఐ–ఫోన్లపై యువతకు ఉన్న క్రేజ్‌ను ఆధారంగా చేసుకున్న నేరగాళ్లు ఈ ఫోన్లను తక్కువ ధరకు విక్రయిస్తామంటూ ఆన్‌లైన్‌లో ప్రకటన ఇవ్వడంతో పాటు నెట్‌ వినియోగదారులకు పాప్‌అప్స్‌ పంపిస్తున్నారు. 80 నుంచి 90 శాతం తక్కువ ధరకు ఇస్తామంటూ ప్రకటించడంతో ఆకర్షితులై సంప్రదించిన వారితో వెబ్‌సైట్‌ ద్వారానే దరఖాస్తు పూరించేలా చేస్తున్నారు. ఆపై అడ్వాన్స్‌ పేరుతో అందినకాడికి తమ ఖాతాల్లో వేయించుకుని స్వాహా చేస్తున్నారు. క్రెడిట్‌కార్డు ద్వారా చెల్లింపులు చేయాలనుకున్న వినియోగదారుల కార్డు నెంబర్, పిన్‌ తదితరాలను సంగ్రహించి వాటి ద్వారా ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేసి వినియోగదారుడి జేబులు గుల్ల చేస్తున్నారు. 

కేవైసీ పక్కాగా లేనందునే...
ఈ పంథాల్లో రెచ్చిపోతున్న సైబర్‌ నేరగాళ్లకు వ్యవస్థాపరంగా ఉన్న అనేక లోపాలు కలిసి వస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. సౌతాఫ్రికా దేశాలు కేంద్రంగా ఈ వ్యవహారాలు సాగిస్తున్న నైజీరియన్లు ఏ సందర్భంలోనూ ఇక్కడకు రాకుండా, పోలీసులకు ఆధారాలు చిక్కకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ స్కామ్స్‌లో వినియోగదారులకు ఫోన్‌ చేసేందుకు సెల్‌ నెంబర్లు, వారి ద్వారా డబ్బు వేయించడానికి బ్యాంకు ఖాతాలు ఎంతోకీలకం. వీటిని వారే నేరుగా తెరిస్తే పోలీసులకు దొరికే అవకాశాలు ఉండటంతో వారు ముంబై, ఢిల్లీల్లో కొందరు ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతకు ఎరవేస్తున్న ఈ ఏజెంట్లు బోగస్‌ చిరునామాలతో తయారు చేసిన తప్పుడు ధ్రువీకరణలు అందించడం ద్వారా సిమ్‌కార్డులు తీసుకోవడం, బ్యాంకు ఖాతాలను తెరిపించడం చేస్తున్నారు. ఆయా బ్యాంకులు, సర్వీస్‌ ప్రొవైడర్లు కచ్చితంగా పాటించాల్సిన నో యువర్‌ కస్టమర్‌ (కేవైసీ) నిబంధనను నిర్లక్ష్యం చేయడం మోసగాళ్లకు కలిసి వస్తోంది.

ఆర్బీఐనీ వదలని వైనం..
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పేరుతోనూ ‘నెట్‌జను’లకు ఈ–మెయిల్స్‌ వస్తున్నాయి. ఆయా సంస్థలు, బ్యాంకులకు చెందిన అధికారులే వీటిని పంపినట్లు ఫొటోలు, లోగోలు కూడా వినియోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో లాటరీలు వచ్చాయంటూ, భారీ మొత్తం మీ ఖాతాలో డిపాజిట్‌ కానుందనీ ఈ–మెయిల్‌ ద్వారా వల వేస్తున్న సైబర్‌ నేరగాళ్లు కస్టమ్స్‌ క్లియరెన్స్, ట్యాక్సుల పేరుతో అందినకాడికి దండుకుంటున్నారు. వీటితో పాటు న్యూ ఢిల్లీ, ఫరీదాబాద్‌ చిరునామాలతో ఉన్న గుర్తింపు పత్రాలు, బ్రిటీష్‌ కంపెనీకి సంబంధించిన ఐడీ కార్డు కూడా పంపుతున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top