ఉరి వేసుకుని నవ వధువు ఆత్మహత్య

Bride Commits Suicide In West Godavari - Sakshi

పశ్చిమగోదావరి ,నిడదవోలు:  సమిశ్రగూడెం లోహియానగర్‌లో నవ వధువు శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడింది. లోహియాగర్‌లో నివాసం ఉంటున్న కాసాని దుర్గాప్రసాద్, వరలక్ష్మి(20) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. వారిద్దరి ఇళ్లల్లో పెద్దలు అంగీకరించడంతో మే 7న ప్రేమ వివాహం చేసుకున్నారు. భర్త దుర్గా ప్రసాద్‌ తాపీ పని చేస్తుంటాడు. వరలక్ష్మి నిడదవోలులో ఓ క్రిస్టియన్‌ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిన్న పిల్లల స్కూల్లో టీచర్‌గా పని చేస్తోంది. ఎప్పటి మాదిరిగానే దుర్గా ప్రసాద్‌ శుక్రవారం ఉదయం తాపీ పనికి వెళ్లాడు. వరలక్ష్మి అత్త శాంతి రత్నంతో కలిసి సమిశ్రగూడెం శివారున ఉన్న ప్రార్థనా మందిరానికి వెళ్లారు. ప్రార్థన ముగించుకుని అక్కడి నుంచి   మధ్యాహ్నం 2 గంటల సమయంలో పింఛన్‌ కోసం అత్త శాంతి రత్నం డి. ముప్పవరం వెళ్లింది. వరలక్ష్మి లోహినగర్‌కు చేరుకుంది. ఏం జరిగిందో తెలియదు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని వరలక్ష్మి మృతిచెందింది.

స్థానికంగా ఉన్న పదేళ్ల చిన్నారి ఇంటికి వచ్చి కిటికీలోంచి చూడటంతో వరలక్ష్మి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించింది. అత్త శాంతి రత్నం రాగానే స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టి లోపలి వెళ్లి విగతజీవిగా ఉన్న వరలక్ష్మి మృతదేహం వద్ద బోరున విలపించారు. మృతురాలి తల్లి సత్యవతి ఫిర్యాదు మేరకు సమిశ్రగూడెం ఏస్సై డి. రవికుమార్‌ అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. వరలక్ష్మి ఆత్మహత్యకు కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top