ఏసీబీ వలలో ఎస్‌ఐ

ACB Officials Arrested Sub Inspector In Chittoor - Sakshi

కేసు నమోదు చేయకుండా ఉండేందుకు డబ్బులు డిమాండ్‌

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన వైనం

మదనపల్లె క్రైం : చౌడేపల్లె ఎస్‌ఐ శ్రీనివాస్‌ రూ.30వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ  డీఎస్పీ తిరుమలేశ్వర్‌రెడ్డి, సీఐలు చంద్రశేఖర్, విజయశేఖర్, ప్రసాద్‌రెడ్డి కథనం ప్రకారం..పుంగనూరుకు చెందిన దీపక్‌ గతనెల 19న చౌడేపల్లె మండలంలోని బోయకొండ ఆలయానికి స్నేహితులతో వెళ్లాడు. అక్కడ స్థానికులతో గొడవపడ్డాడు. దీపక్, అతని అనుచరులపై కేసు నమోదు చేస్తానని ఎస్‌ఐ చెప్పారు. ఈ క్రమంలో దీపక్‌ ఆందోళనకు గురయ్యాడు.

కేసు నమోదు చేయకుండా ఉండాలంటే 50వేల రూపాయలు ఇవ్వాలని ఎస్‌ఐ డిమాండ్‌ చేశారు. తొలుత దీపక్‌ ఎస్‌ఐ ఖాతాలోకి రూ.20వేలు డిపాజిట్‌ చేశారు. తర్వాత ఏసీబీని ఆశ్రయించాడు. వారి సూచన మేరకు మిగిలిన 30వేల రూపాయలు తీసుకుని సోమవారం రాత్రి మదనపల్లెకు వెళ్లాడు. ఆ మొత్తాన్ని ఎస్‌ఐ శ్రీనివాస్‌ తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రంగప్రవేశం చేసి పట్టుకున్నారు. ఆయన్ను అరెస్టు చేసినట్లు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top