
జౌళి రంగానికి మరింత ఉత్తేజం!
జౌళి రంగానికి సంబంధించి టెక్నాలజీ అప్గ్రెడేషన్ ఫండ్ స్కీమ్ (టీయూఎఫ్ఎస్) సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది
► టీయూఎఫ్ పథకం సవరణకు ప్రభుత్వం ఆమోదం
► 30 లక్షల ఉద్యోగాల సృష్టి, ఎగుమతుల వృద్ధి లక్ష్యం
న్యూఢిల్లీ: జౌళి రంగానికి సంబంధించి టెక్నాలజీ అప్గ్రెడేషన్ ఫండ్ స్కీమ్ (టీయూఎఫ్ఎస్) సవరణకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుత రివైజ్డ్ రీస్ట్రక్చర్డ్ టీయూఎఫ్ స్కీమ్ స్థానంలో అమలుకానున్న సవరిత టీయూఎఫ్ఎస్ వల్ల జౌళి రంగంలో సాంకేతికత మరింత పురోగతి సాధించనుంది. దీనితోపాటు ఈ రంగంలో ఎగుమతుల పెంపునకు, రూ. లక్ష కోట్ల వరకూ పెట్టుబడులను ఆకర్షించడానికి, మేక్ ఇన్ ఇండియా లక్ష్యాలు నెరవేరడానికి కూడా ఈ నిర్ణయం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో బుధవారం ఇక్కడ సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ తాజా నిర్ణయం తీసుకుంది. ముఖ్యాంశాలు చూస్తే...
పథకానికి సంబంధించి రూ.17,822 కోట్ల బడ్జెట్ ప్రొవిజన్ను ఆమోదించింది. ఈ మొత్తంలో రూ.12,671 కోట్లు ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకం కింద ఇప్పటికే నిర్ణయించిన అంశాలకు ఉద్దేశించింది. సవరించిన టీయూఎఫ్కు సంబంధించి తాజా అంశాలకు మిగిలిన మొత్తం రూ.5,151 కోట్లు కేటాయించడం జరిగింది.
కొత్త పథకం ప్రకారం ప్రధానంగా దుస్తులు, వస్త్రాలు- టెక్నికల్ టెక్స్టైల్స్ అనే రెండు విస్తృత కేటగిరీల కింద, అలాగే మిగిలిన విభాగాలకు సంబంధించిన పెట్టుబడులపై సబ్సిడీలు అందుతాయి.
టెక్స్టైల్స్ కమిషనర్ ఆఫీస్ (టీఎక్స్సీ) కార్యాలయాన్ని పునర్ వ్యవస్థీకరించారు. ప్రతి రాష్ర్టంలో సంబంధిత కార్యాలయాలు ఏర్పాటవుతాయి. ఈ రంగంలో పారిశ్రామిక వేత్తలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు, కొత్త పరిశ్రమల ఏర్పాటు, పురోగతి వంటి కార్యకలాపాలను టీఎక్స్సీ నిర్వహిస్తుంది.