కోవిడ్‌కు వ్యాక్సిన్‌! సెన్సెక్స్‌ హైజంప్‌ | Sensex jumps on covid-19 vaccine expectations | Sakshi
Sakshi News home page

కోవిడ్‌కు వ్యాక్సిన్‌! సెన్సెక్స్‌ హైజంప్‌

Jul 2 2020 3:56 PM | Updated on Jul 2 2020 3:56 PM

Sensex jumps on covid-19 vaccine expectations - Sakshi

యూఎస్‌ ఫార్మా దిగ్గజం ఫైజర్‌ ఇంక్‌ కోవిడ్‌-19 చికిత్సకు అభివృద్ధి చేస్తున్న ఔషధంపై ఆశలతో దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడటంతో సెన్సెక్స్‌ 429 పాయింట్లు జంప్‌చేసి 35,844 వద్ద ముగిసింది. తద్వారా 36,000 పాయింట్ల మైలురాయికి చేరువలో నిలిచింది. వెరసి రెండు రోజుల్లో సెన్సెక్స్‌ 928 పాయింట్లు ర్యాలీ చేసింది. నిఫ్టీ సైతం 122 పాయింట్లు పెరిగి 10,552 వద్ద స్థిరపడింది. జర్మన్‌ కంపెనీ బయోఎన్‌టెక్‌తో కలసి రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ క్లినికల్‌ పరీక్షల్లో సత్ఫలితాలు ఇస్తున్నట్లు ఫైజర్‌ ఇంక్‌ బుధవారం వెల్లడించింది.దీంతో సెంటిమెంటుకు బలమొచ్చినట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఫలితంగా రోజంతా మార్కెట్లు హుషారుగా కదిలాయి. 35,604 వద్ద ప్రారంభమైన సెన్సెక్స్‌ సమయం గడిచేకొద్దీ బలపడుతూ వచ్చి ఇంట్రాడేలో 36,015 వద్ద గరిష్టానికి చేరింది. ఈ బాటలో 10,493 వద్ద ప్రారంభమైన నిఫ్టీ 10,598 వరకూ ఎగసింది. డాలరుతో మారకంలో రూపాయి ఒక్కసారిగా జంప్‌చేయడం కూడా ఇన్వెస్టర్లకు ప్రోత్సాహాన్నిచ్చినట్లు నిపుణులు తెలియజేశారు.

మెటల్‌, ఫార్మా సైతం
ఎన్‌ఎస్‌ఈలో ప్రధానంగా ఆటో, ఐటీ రంగాలు దాదాపు 3 శాతం చొప్పున ఎగశాయి. మెటల్‌, ఫార్మా 1-0.6 శాతం చొప్పున పుంజుకున్నాయి. నిఫ్టీ దిగ్గజాలలో ఎంఅండ్‌ఎం, హీరో మోటో, సిప్లా, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫోసిస్‌, ఐవోసీ, టాటా స్టీల్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ 6.4-3.2 శాతం మధ్య జంప్‌చేశాయి. ఇతర బ్లూచిప్స్‌లో యాక్సిస్‌, యూపీఎల్‌, వేదాంతా, హెచ్‌యూఎల్‌, ఐషర్‌ మాత్రమే (2-0.5 శాతం మధ్య) డీలాపడ్డాయి. 

ఫైనాన్స్‌ స్పీడ్‌
డెరివేటివ్‌ కౌంటర్లలో టాటా పవర్‌, మదర్‌సన్‌, ఈక్విటాస్‌, ఎంఅండ్‌ఎం ఫైనాన్స్‌, బంధన్‌ బ్యాంక్‌, బాష్‌, కేడిలా హెల్త్‌, నాల్కో 7.6-5 శాతం మధ్య జంప్‌చేశాయి. అయితే మరోవైపు జస్ట్‌డయల్‌, దివీస్‌ ల్యాబ్‌, ఐడియా, సెంచురీ టెక్స్‌, లుపిన్‌, మెక్‌డోవెల్‌ 3-0.6 శాతం మధ్య నీరసించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 1 శాతం స్థాయిలో ఎగశాయి. ట్రేడైన షేర్లలో 1715 లాభపడగా.. 1048 నష్టాలతో నిలిచాయి.

డీఐఐల పెట్టుబడులు
నగదు విభాగంలో  బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) రూ. 1696 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. దేశీ ఫండ్స్‌(డీఐఐలు) రూ. 1377 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి. మంగళవారం ఎఫ్‌పీఐలు రూ. 2000 కోట్ల అమ్మకాలు చేపట్టగా.. దేశీ ఫండ్స్‌ రూ. 2051 కోట్లను ఇన్వెస్ట్‌ చేశాయి. సోమవారం ఎఫ్‌పీఐలు రూ. 1937 కోట్ల పెట్టుబడులను వెనక్కి తీసుకోగా.. డీఐఐలు రూ. 1036 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement