వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

వైఎస్ షర్మిల - Sakshi


హైదరాబాద్:  తనను కించపరుస్తూ  సోషల్ మీడియాలో  దుష్ప్రచారం చేయడంపై  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు  వైఎస్ షర్మిల ప్రజలకు ఒక బహిరంగ లేఖ రాశారు. ఆమెపై జరుగుతున్న తప్పుడు ప్రచారానికి రాష్ట్ర వ్యాప్తంగా పలువురు ఎంపిలు, ఎమ్మెల్యేలు, న్యాయవాదులు, మహిళా సంఘాల నేతలు స్పందించారు.  ఈ విషయంలో షర్మిలకు అండగా ఉంటామని పలువురు తెలిపారు. మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఒక మహిళా రాజకీయ నాయకురాలిపై ఈ విధంగా ప్రచారం చేయడాన్ని వారు ముక్తకంఠంతో ఖండించారు.



సోషల్ మీడియాలో తనకు అవమానం కలిగించే విధంగా  రాతలు రాసిన వారిపై  షర్మిల పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపి  వై.వి.సుబ్బారెడ్డి, పార్టీ సలహాదారులు డిఏ సోమయాజులు ఈరోజు ఉదయం  హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డిని కలిసి   ఫిర్యాదు పత్రాన్ని అందచేశారు. అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ షర్మిలపై  20-25 వెబ్ సైట్లలో పనిగట్టుకుని చెప్పుకోలేని రీతిలో అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  పోలీసులను కోరినట్లు తెలిపారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా నిలబడి షర్మిల ప్రచారం చేస్తున్నారనే ఇటువంటి ప్రచారానికి ఒడిగడుతున్నారన్నారు.  సైబర్ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని సీపీ మహేందర్ రెడ్డి చెప్పినట్లు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.



ఇదిలా ఉండగా,  షర్మిలను కించపరుస్తూ సోషల్ మీడియాలో అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి, ఫొటోలు మార్ఫింగ్ చేసి పెట్టిన  ఇద్దరు యువకులను సీసీఎస్ సైబర్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. అంబర్‌పేట శంకర్‌నగర్‌కు చెందిన వెబ్ డిజైనర్ శ్రీపతి నరేశ్, వరంగల్ జిల్లా హన్మకొండకు చెందిన కార్తీక్‌లు మరో ఇద్దరితో కలసి మూడు నెలల క్రితం ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.  అప్పట్లో ఈ ఉదంతంపై వైఎస్సార్ సీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో సీసీఎస్ పోలీసులు నెల క్రితమే ఒకరిని పట్టుకోగా.. తాజాగా శ్రీపతి నరేశ్, కార్తీక్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు సీపీఎస్ డీసీపీ పాలరాజు తెలిపారు.



ఈ సందర్భంగా వైఎస్ షర్మిల బహిరంగ లేఖ రాశారు. ఆ లేఖ పూర్తి పాఠం:



జూన్ 14, 2014

 ప్రియమైన సోదరీ, సోదరులకు...



 ఒక మహిళ తన గురించి తాను, అదీ ఎవరో కొందరు ఆమె పట్ల సాగిస్తున్న దుష్ప్రచారానికి సమాధానం చెప్పుకోవలసి రావడంచాలా దుర్భరమైన స్థితి.  ఒక మహిళ శక్తిమంతురాలిగా ఆవిర్భవిస్తుందని భావించే తరుణంలో  కరుడుగట్టిన ద్వేషం పగ, ప్రతీకారంతో నిండిన క్రూరమైన మనస్తత్వంతో పనిగట్టుకుని కొందరు ఆమెపై బురద జల్లుతుంటారు. అలాంటి నికృష్టుల దాడికి నేను కూడా లక్ష్యంగా మారాను. ఈరోజు  రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయంటే  ఒక మహిళ పట్ల కనీస  మర్యాద పాటించాలన్న స్పృహను సైతం కూడా అవి కోల్పోయాయి.



 ఈ మధ్య కాలంలో నాకు ఒక తెలుగు నటుడితో సంబందాన్ని అంటగడుతూ ఇంటర్నెట్లో పుకార్లు  లేవదీశారు. కనీసం ఆ నటుడు ఎవరో కూడా నేను  ఎప్పుడూ చూడలేదు,  కలవలేదు. ఎప్పుడూ మాట్లాడను కూడా లేదు. నా  గౌరవ, మర్యాదలను మంట గలిపే ఏకైక దురద్దేశంతో పరమ దుర్మార్గమైన రీతిలో నాపై బురదజల్లే కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా నేను ఒక వాస్తవం చెప్పదలచుకున్నాను. ఈ పుకార్లను ప్రచారం చేస్తున్న వందలాది  వెబ్సైట్లలో తమ ప్రచారానికి రుజువుగా ఒక్క సాక్ష్యం కూడా  చూపలేకపోయారు. అంటే దీనిని బట్టే ఈ పుకార్లు ఎంత నిరాధారమైనవో  అర్ధం అవుతుంది.  ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న శక్తులు ఎవరో, వారి అంతిమ లక్ష్యం ఏమిటో  విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించవలసిందిగా కోరతూ నేను ఈ  రోజు ఒక చట్టబద్దమైన ఫిర్యాదును కూడా చేశాను.



 నాకు తెలుసు, ఇదో పెద్ద చర్చనీయమైన అంశం అవుతుందని. ఇందులో నాకు తగిన న్యాయం జరగుతుందో లేదో కూడా నాకు తెలవదు. ఈ విచారణ ద్వారా నాకు, నన్ను అమితంగా ప్రేమించే నా కుటుంబ సభ్యులు,  స్నేహితుల మనసులకు తగిలిన గాయం మానుతుందన్న నమ్మకంలేదు.  నీతిబాహ్యమైన, అల్పబుద్ధి కలిగిన కొందరు వ్యక్తులు సాగించే ఈ చౌకబారు దుష్ప్రచారంపై  నేను అనవసరంగా స్పందించి వాటికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నానన్న సంగతి కూడా తెలుసు. దీని వలన నిస్సిగ్గుగా అలాంటి  ద్వేషపూరితమైన పుకార్లను ప్రచారం చేస్తున్న దుష్టులకు మరింత ప్రచారం కల్పించినట్లవుతుందని కూడా నాకు తెలుసు. ఇతరుల బాధను చూసి  ఆనందించే ఇలాంటి శాడిస్టులను ఊరికే వదలకుండా  వారిపై పోరాటానికి  నేను సిద్ధం అయినప్పుడు నాతోపాటు  నా కుటుంబ సభ్యులు, స్నేహితులు  సైతం తెరచాటుగా వారు మాపై సాగించే దొంగ యుద్ధానికి లక్ష్యం కావలసి ఉంటుందనని కూడా నాకు తెలుసు.



 కానీ, ఇలాంటి ప్రతికూల  పరిస్థితుల మధ్య పోరాటానికి దిగడం వలన ఈ  దుర్మార్గులు మాపై మరింతగా విషం చిమ్ముతార్న భయంతో  నేను మౌనంగా  ఉండదలచుకోలేదు. అమానుషమైన రీతిలో నన్ను అభాసుపాలు చేయడానికి  సాగుతున్న కుట్రలో మౌనంగా సమిధనైపోవడానికి నేను సిద్ధంగా లేను.  భారతీయ స్త్రీగా నేను... నైతిక విలువలు కలిగిన ఒక భార్యను, ఒక తల్లిని, ఒక  కుమార్తెను, ఒక సహోదరినిని... నా నైతిక నిష్ఠకు ఆ భగవంతుడే సాక్షి. ఈ రోజున, బరువెక్కిన గుండెతో, బాధాతప్త హృదయంతో, నేను మీకు ఈ లేఖ  రాస్తున్నాను. ఎంత బాధగా ఉందంటే .. ఎలాంటి నేరం చేయనప్పటికీ , నా గౌరవ  మర్యాదలు కాపాడుకోవడానికి, నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు ఈ  రోజున నేను బోను ఎక్కవలసి వచ్చింది. నా గుండె తీవ్రంగా గాయపడింది. మనసు ఆగ్రహంతో రగిలిపోతోంది.  గౌరవ మర్యాదలతో  జీవించే ఏ మహిళకైనా ఇలాగే ఉంటుంది.

 

 ఇది నా ఒక్కరికి సంబంధించిన  సమస్యే కాదు... ప్రతి ఒక్క మహిళ పరువు,  హోదాకు సంబంధించినది. ఇది పరువు, ప్రతిష్టలు కలిగిన ప్రతి ఒక్క భార్య,  ప్రతి తల్లి, ప్రతి కుమార్తె, ప్రతి సోదరికి సంబంధించిన విషయం. మీరు అమితంగా ప్రేమించేవారెవరికైనా ఇదే పరిస్థితి ఎదురుకావచ్చు.  అందువల్ల, నేను మీకు విన్నవించేదేమిటంటే ఇలాంటి దుర్మార్గాలకు మౌన సాక్షిలా మారవద్దు.  ప్రతి మనిషికి ఒకటే జీవితం ఉంటుంది. ఇతరుల జీవితాలతో  తమ  ఇష్టానుసారం ఆటలాడాలని ఎవరైనా అనుకుంటే, మన శక్తి, సత్తా ఏమిటో  వారికి నిరూపించాల్సిన సమయం ఆసన్నమైంది.



 మీడియా, శాసన కర్తలు, చట్టాన్ని పరిరక్షించేవారు., దేశాభిమానులు ఒక్కరుగా  నిలబడి ఇలాంటి నీచమైన దుష్ప్రచారాలకు ఒడిగట్టే వారి దుస్సాహసాన్ని  నిలదీయాలి.  ప్రజలను, సమాజాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దగలడన్న దృఢమైన  నమ్మకం, విశ్వాసం ఉన్నందునే నా అన్న కోసం నేను పోరాడాను. వైఎస్సార్  కాంగ్రెస్ పార్టీ లక్ష్యాలను నేను ముమ్మూటికీ విశ్వసింశాను. అందుకే ఆ లక్ష్య  సాధన కోసం ప్రచారం చేశాను. నా విశ్వాసం, నమ్మకం పట్ల ఎవరికైనా  ఆక్షేపణ ఉండి నన్ను సవాలు చేయదలచుకుంగే  వారు నాతో  ముఖాముఖి తలపడాలి. అలాంటి ప్రయత్నాన్ని నేను గౌరవించి, అది ఒక మహిళను  అవమానించే చర్యగా నేను ఎన్నడూ పరిగణించే దానిని కాదు. కానీ ఇలా  అతి నీచమైన రీతిలో  పిరికిపందల్లా వెన్నుపోటుకు దిగే చర్యలు ఏమాత్రం  సహించదగ్గవి కాదు. ఏ మహిళ కూడా వీటిని సహిస్తూ, భరించలేదు.



 నా భావాలతో ఏకీభవించే వారందరికీ నా విన్నపం ఒక్కటే. మహిళా  ఆత్మగౌరం కోసం నేను చేసే ఈ పోరాటంలో నాకు తోడుగా నిలబడండి.  మహిళలకు సమానత్వం, సమాన హక్కులు, సమాన అధికారం వంటి  విశిష్టమైన హామీలు నెరవేరడానికి ముందుగా సమాజంలో మహిళ సమాన  ఆత్మగౌరంతో  జీవించే అవకాశం కల్పిస్తే చాలు. నా కుటుంబం,  స్నేహితులు నా ప్రతిస్పందనను అర్ధం చేసుకోగలరు. వాళ్ళు  నన్ను ఇసుమంత కూడా శంకించరని  నాకు తెలుసు. వాళ్ళు నన్ను అమితంగా  ప్రేమిస్తారు. నాకు అనుక్షణం రక్షణగా నిలబడతారు.  ఇలాంటి సమయంలో   వారు నా భావాలను మనస్పూర్తిగా గౌరవించడంతో పాటు  నాకు మరింత  మనోబలాన్ని ఇస్తారని కూడా తెలుసు. నా జీవితం పట్ల నేను ఎంతగా గర్వపడతానో నా కుటుంబం, స్నేహితుల పట్ల కూడా అంత గర్వపడతాను.



 ఈ విష ప్రచారంలోకి ఏ నటుడినైతే  లాగారో వారు కూడా ఈ పిరికిపందల చర్యలను గుర్తించి దొంగచాటుగా సాగిస్తున్నఈ పుకార్లను తీవ్రంగా ఖండిస్తారని ఆశిస్తున్నా. మహిళలను న్యూనతపరిచేలా నిరాధారంగా, ద్రోహచింతనతో,  ద్వేషపూరితంగా సాగించే  ఈ దుష్ప్రచారానికి తెరదింపాలి.  రాజకీయాలలోకి  చొచ్చుకు వస్తున్న ఇలాంటి కుళ్ళును కడిగివేయాలంటే మనమంతా సమష్టిగా నిలబడి నిర్భయంగా పోరాడాలి.



భయ, భీతులకు లోను చేసే ఇలాంటి పిరికిపందల ముందు నేను కనురెప్పలు కూడా వాల్చను. సిగ్గుతో తలదించుకోబోను. ఇలాంటి విష ప్రచారకుల విశృంకల కార్యకలాపాలకు మీరే చెక్ పెడతారని నమ్మకం కూడా  నాకు ఉంది. రాజకీయాలు అంటే అవి మురికి కూపం కాదని మనం నిరూపిద్దాం. మనందరం చేతులు కలిపి రాజకీయాలను దృఢ విశ్వాసానికి, రక్షణకు అత్యంత ఘనమైన వేదికగా తీర్చిదిద్దుదాం.



-వైఎస్ షర్మిల రెడ్డి  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top