రహదారుల విస్తరణ ఇలానా..? | World Bank Discontent on Road Sector Project | Sakshi
Sakshi News home page

రహదారుల విస్తరణ ఇలానా..?

Sep 9 2013 4:24 AM | Updated on Sep 4 2018 5:07 PM

ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో రాష్ట్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులు నత్తనడకన సాగుతున్నాయి.

సాక్షి, హైదరాబాద్: ప్రపంచ బ్యాంకు ఆర్థిక సాయంతో రాష్ట్రంలో చేపట్టిన రోడ్ల విస్తరణ, నిర్వహణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ, సహాయ, పునరావాస పనులు పెండింగ్‌లో ఉండటంతో పనులు ముందుకు సాగడం లేదు. 17 జిల్లాల్లో 429 కి.మీ.రహదారుల విస్తరణ, 6,241 కి.మీ. రహదారి నిర్వహణ పనులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రోడ్డు సెక్టార్ ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. 2009లో రూ. 3,165 కోట్ల వ్యయంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు పనులు నాలుగేళ్లు కావస్తున్నా సగం కూడా పూర్తికాలేదు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు అమలు తీరుపై సమీక్ష జరిపిన ప్రపంచ బ్యాంకు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. నాలుగేళ్లైనా ప్రాజెక్టు రుణంలో 24 శాతం నిధులు మాత్రమే వ్యయం చేసినట్లు బ్యాంకు పేర్కొం ది. నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వ్యయం చేయడంలో అధికారులు వెనుకబడినట్లు గుర్తించింది.
 
  రహదారుల విస్తరణకు కాంట్రాక్టర్లు అవసరమైన మెటీరియల్, మిషనరీతో పాటు మానవ వనరులను సమకూర్చడం లేదని, భూసేకరణ, సహాయ, పునరావాస పనులు పెండింగ్‌లో ఉండడం వల్ల కూడా పనుల్లో జాప్యం జరుగుతోందని ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి కార్పొరేషన్‌కు ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కల్పించకపోవడాన్ని తప్పుపట్టింది. 2015 జూన్ 30 నాటికి ప్రాజెక్టు పూర్తి చేయాల్సి ఉన్నందున పనులను వేగవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 3,165 కోట్లలో ప్రపంచ బ్యాం కు రుణం రూ. 1,568 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.1,597 కోట్ల వ్యయాన్ని భరించనుంది. కాగా ప్రాజెక్టు వ్యయంలో ఇప్పటివరకు రూ. 1,250 కోట్లు మాత్రమే వ్యయం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం లో రూ. 400 కోట్లు వ్యయం చేయాల్సి ఉండగా ఇప్ప టివరకు రూ. 144 కోట్లను మాత్రమే ఖర్చు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement