ఆ గ్రామంలో మద్యం విస్తారంగా లభిస్తుంది. 1200 జనాభా ఉన్న ఆ గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులున్నాయి.
పేరేపల్లి (చిట్యాల), న్యూస్లైన్: ఆ గ్రామంలో మద్యం విస్తారంగా లభిస్తుంది. 1200 జనాభా ఉన్న ఆ గ్రామంలో పదికి పైగా బెల్ట్ షాపులున్నాయి. వీటిలో ఖరీదైన మద్యంతోపాటు, సారా కూడా లభిస్తుంది. స్థానికులతోపాటు ఇతర గ్రామాల ప్రజలు సైతం ఇక్కడికి వచ్చి మద్యం సేవించి మత్తులో జోగుతుంటారు. ఫలితంగా అసాంఘిక కార్యకలాపాలు అధికమవుతున్నాయి. వీటిని నిలయంగా మారింది పేరేపల్లి గ్రామం. ఈ విపత్తును గుర్తించిన గ్రామ మహిళలు మద్యం మహమ్మారిని పారదోలాలని నడుం బిగించారు. ఈ విషయాన్ని సర్పంచ్ అంతటి శైలజకు వివరించారు. ఆమె కూడా ఈ ఉద్యమంలో పాలుపంచుకుంది.
మద్యపాన నిషేధానికి ప్రమాణం
గ్రామంలోని మహిళలు, యువకులు శుక్రవారం గ్రామంలోని రామాలయం వద్దకు చేరుకున్నారు. సర్పంచ్ శైలజవెంకటేష్ ఆధ్వర్యంలో గ్రామంలో మద్యం ఎవరూ అమ్మవద్దని, తాగవద్దని ప్ర తిజ్ఞ చేశారు. గ్రామంలో ర్యాలీని నిర్వహించారు. బెల్ట్ షాపుల వారి ఇళ్లకు వెళ్లి మద్యం అమ్మకాలను నిలిపివేయాలని గ్రామస్తులు సూచించారు. కార్యక్రమంలో గ్రామ మా జీ సర్పంచ్ కొలను సతీష్ గౌడ్, వార్డు సభ్యులు అంతటి శివ, అనగంటి కిరణ్, అంతటి రాజేష్, మహిళా సంఘం అధ్యక్షురాలు రూపని బక్కమ్మ, కత్తుల అడవమ్మ, అంతటి పార్వతమ్మ, అంతటి నర్సింహ, పున్న మురళి, రాచమల్ల స్వప్న, భవాని, పార్వతమ్మ, లలిత పాల్గొన్నారు.