ఈ సార్వత్రిక ఎన్నికలకు రూపొందించిన ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అర్హులైన ఓట్లు ఊరూరా మాయమయ్యాయి.
కొన్ని నియోజకవర్గాల్లో టోకున చేర్పులు
సార్వత్రిక ఎన్నికలకు తప్పుల
తడకగానే ఓటరు జాబితా
ఆందోళనలో రాజకీయ పార్టీల నాయకులు
సాక్షి, గుంటూరు
ఈ సార్వత్రిక ఎన్నికలకు రూపొందించిన ఓటరు జాబితాలో చిత్ర విచిత్రాలు చోటు చేసుకున్నాయి. అర్హులైన ఓట్లు ఊరూరా మాయమయ్యాయి. ఓటరు జాబితాలో అవకతవకలు అనేక రకాలుగా జరిగాయి. తప్పుల్లేని ఓటరు జాబితా తయారవుతుందనుకుంటే తప్పుల తడకగానే జాబితా ఉండటంతో రాజకీయ పార్టీలు అందోళన వ్యక్తం చేస్తున్నాయి. విచిత్రం ఏంటంటే బోగస్ ఓట్లు తొలగించాలని ప్రత్యేకంగా రాజకీయ పార్టీలు ఇచ్చిన పేర్లు యథాతథంగానే ఉన్నాయి. పైగా ఓటరు తుది జాబితా ప్రచురణ అనంతరం కూడా టోకున ఓట్లు చేరాయంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఓటరు జాబితా తయారీలో పలువురు రెవెన్యూ అధికారులకు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టరు సైతం ఈ ఆరోపణలపై కొందరు అధికారుల్ని నిలదీసిన సందర్భాలున్నాయి. మొత్తానికి ఓటరు నమోదు ప్రక్రియను అపహాస్యం చేస్తూ ఈ దఫా ఓటరు జాబితా రూపొందడం గమనార్హం. అధికారుల చెలగాటం.. ఓటరుకు సంకటంగానే ప్రస్తుత పరిస్థితి ఉంది. గుంటూరు నగరంలోని రెండు నియోజకవర్గాలతో పాటు సత్తెనపల్లి, చిలకలూరిపేట, తెనాలి నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో అర్హులైన వారి ఓట్లు తీసివేతలతో పాటు బోగస్ ఓట్లు చేర్చారు.
నరసరావుపేట నియోజకవర్గంలో పలు చోట్ల బోగస్ ఓట్లు టోకున చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓట్ల నమోదు విషయంలో రెవెన్యూ అధికారులు, బూత్ లెవల్ అధికారులు, అంగన్వాడీలు ఇచ్చిన నివేదికల్లో తేడాలున్నాయని సమాచారం. సత్తెనపల్లి నియోజకవర్గంలో ధూళిపాళ్ళ గ్రామంలో ఒకే ఇంటిపేరుతో పదుల సంఖ్యలో ఓట్లు చేర్చారు. పెదమక్కెన, పాకాలపాడులో అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయి. రాజుపాలెం మండలం గణపవరంలో ఓట్ల నమోదు, తొలగింపుల్లో అధికారులే అవకతవకలకు పాల్పడ్డారు. గుంటూరు నగరంలో డబుల్ ఎంట్రీలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే సమయంలో ఓటరు జాబితాలో ఇంతటి స్థాయిలో తప్పులుండటంతో జిల్లా అధికార యంత్రాం గం తీవ్ర ఆందోళనలో ఉంది. ఇప్పటికే జిల్లా కలెక్టరు ఈ అంశంపై సీరియస్గా ఉన్నారు. ఓటరు జాబితాలో అవకతవకలు ఆయా మండలాల తహశీల్దార్లకు తెలిసి జరిగాయా, లేక డేటా ఎంట్రీ ఆపరేటర్లు తప్పుదోవ పట్టించారా అన్న అంశంపైనా లోతుగా విచారణ నిర్వహిస్తున్నారు.
డేటా ఎంట్రీ చేసిన కంప్యూటర్ ఆపరేటర్లపైనా చర్యలు తీసుకున్నారు. సత్తెనపల్లి డిప్యూటీ తహశీల్దారుతో పాటు వీఆర్వోల్ని సస్పెండ్ చేశారు. అయితే సత్తెనపల్లిలో ఓ రెవెన్యూ అధికారి ఉద్దేశపూర్వకంగానే ఓటరు జాబితాలో తప్పులు ప్రచురించారని జోరుగా ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే స్థాయిలో ఓట్లనమోదులో అవకతవకలు జరిగాయన్న అనుమానాలు పలువురు అధికారులు వ్యక్తం చేయడం పరిశీలనాంశం.