
మరుగుదొడ్ల బిల్లులు గోవిందా !
జిల్లాలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో 75 శాతం కేంద్ర, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చర్యలు చేపట్టారు.
జిల్లాలో వ్యక్తిగత మరుగుదొడ్లను నిర్మించుకుంటున్న లబ్ధిదారులకో దుర్వార్త. లబ్ధిదారులు త్వరితగతిన మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయకుంటే వాటికి బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి రాబోతోంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం జిల్లాలో రూ.6.57కోట్ల బిల్లుల చెల్లింపులపై ప్రభావం చూపనుంది.
* జిల్లాలో రూ.6.57కోట్ల చెల్లింపులు అనుమానమే
* వారంలో పూర్తిచేయని మరుగుదొడ్లకు బిల్లులు ఉండవు
* ప్రాధాన్యత క్రమంలో కొన్ని పంచాయతీల్లోనే నిర్మాణాలు
* ఆన్లైన్లో ఇతర పంచాయతీల వివరాల తొలగింపు
బి.కొత్తకోట : జిల్లాలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్లు నిర్మించాలన్న లక్ష్యంతో 75 శాతం కేంద్ర, 25 శాతం రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చర్యలు చేపట్టారు.
ఈ ఏడాది మేలో మండలాలకు మరుగుదొడ్ల లక్ష్యాలను నిర్దేశించారు. రూ.12వేలతో మరుగుదొడ్లు, రూ.15వేలతో బాత్రూం, మరుగుదొడ్లు నిర్మించుకునేందుకు పథకం అమలులోకి తెచ్చారు. జిల్లాలోని 65 మండలాల్లో 1,56,465 మరుగుదొడ్లను నిర్మించేందుకు నిర్ణయించారు. దీనికోసం 222.37కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా వేశారు. మండలంలోని పంచాయతీల సంఖ్య మేరకు మరుగుదొడ్లను మంజూరు చేశారు.
ఇందులో పనులు చేపట్టిన లబ్ధిదారుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేశారు. ఎంతపని చేశారు, చెల్లించిన, పెండింగ్ బిల్లుల వివరాలను ఉంచారు. మేలో ఈ కార్యక్రమం ప్రారంభిస్తే ఇంతవరకు ఒక్క మండలంలోనూ పూర్తిస్థాయిలో నిర్మాణాలు జరగలేదు. జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఈ పనులు జరుగుతున్నా దశలవారీగా వీటిని పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక మండలంలో 3 లేక 4 పంచాయతీలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వాటిలోనే మరుగుదొడ్ల పనులు చేయిస్తారు.
ఉదాహరణకు బి.కొత్తకోట మండలంలో 11 పంచాయతీలు ఉన్నాయి. వీటిలో కోటావూరు, శీలంవారిపల్లె, బండారువారిపల్లె పంచాయతీల్లో మాత్రమే మరుగుదొడ్లు నిర్మించేందుకుఎంపిక చేశారు. వీటిలో పనులు పూర్తయ్యాక మిగిలిన పంచాయతీల్లో పనులు చేపడుతారు. అప్పటివరకు మిగిలిన పంచాయతీల వివరాలు ఆన్లైన్ నుంచి తొలగిస్తారు. మిగిలిన పంచాయతీల వంతు వచ్చేవరకు లబ్ధిదారులు బిల్లుల కోసం ఎదురుచూడాల్సిందే.
6.57కోట్ల పెండింగ్
జిల్లావ్యాప్తంగా మరుగుదొడ్ల నిర్మాణాల్లో మంగళవారం నాటికి 23,283 మరుగుదొడ్ల పనులు పూర్తిచేశారనేది అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇదికాక 28,052 మరుగుదొడ్లు బేస్మెంట్ స్థాయిలో నిర్మాణాలు జరిగాయి. ఇప్పటివరకు చెల్లించిన రూ.39.45కోట్ల బిల్లులు పోగా, మంగళవారం నాటికి రూ.6,57, 57,000 చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయి. వీటిని లబ్ధిదారులకు ఇంకా చెల్లించలేదు. ఈ బిల్లులు పొందాలంటే వారం పది రోజుల్లో పనులను పూర్తి చే స్తే చెల్లింపులకు అవకాశం ఉందని, లేదంటే జాప్యం తప్పదని అధికారులే అంటున్నారు.
అప్పు చేసి కట్టాను
మరుగుదొడ్డి త్వరగా కట్టేస్తే బిల్లులు పెడతామని లేకుంటే రద్దు అయిపోతుందని అధికారులు చెబితే అప్పు చేసి గోడల వరకు కట్టాను. దీనికి రూ.9వేల ఖర్చైంది. గోడలుకట్టి నెలైనా ఒక బిల్లూ రాలేదు. అధికారులను కోరుతున్నా అతీగతీ లేదు.
- చెరువు రెడ్డెప్ప, గారచెట్లపల్లె,పీటీఎం మండలం
రెండు బిల్లులు రావాలి
మరుగుదొడ్డి నిర్మాణం పూర్తి చేసినా ఇంకా రెండు బిల్లులు ఇవ్వలేదు. రూ.6వేల బిల్లు ఇచ్చారు. మిగిలిన బిల్లుల కోసం నాలుగు నెలలుగా తిరుగుతున్నా ఫలితం లేదు. బిల్లులిస్తే అప్పులు తీర్చుకుంటాను.
- రజాక్ సాహెబ్, జంగావారిపల్లె, కురబలకోట మండలం