
మూడున్నరేళ్ల బాలికపై లైంగిక దాడి
దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి గ్రామంలో మూడున్నరేళ్ల వయస్సుగల బాలికపై ...
- నిందితులు ఇద్దరు మైనర్లు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లి
- గ్రామంలో దర్యాప్తు చేసిన పోలీసులు
దత్తిరాజేరు(గజపతినగరం): దత్తిరాజేరు మండలంలోని ఇంగిలాపల్లి గ్రామంలో మూడున్నరేళ్ల వయస్సుగల బాలికపై .. 14, 13 ఏళ్ల వయస్సు గల ఇద్దరు బా లురు లైంగిక దాడి చేశారు. బాలిక తల్లి చేసిన ఫిర్యాదు మేరకు స్థానిక సీఐ కె.కె.వి.విజయ్నాథ్ గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. అనంతరం పెదమానాపురం పోలీస్ స్టేషన్లో గురువారం విలేకర్ల సమావేశంలో సంఘటన వివరాలు వెల్లడించారు. ఇంగిలాపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన బాలిక తల్లిదండ్రులు నిరుపేదలు. రాయగడలో కూలిపనులు చేయడానికి తండ్రి వెళ్లాడు.
తల్లి అదే గ్రామంలో కూలి పనులు చేస్తోంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలున్నారు. అయితే ఈనెల 18న ఆమె కూలి పనికి వెళ్లి మధ్యాహ్నం 3 గంటల సమయాని ఇంటికి చేరుకుంది. చిన్న కూతురు ఇంటివద్ద లేక పోవడంతో ఇరుగు,పొరుగు వారి వద్ద వాకబు చేసింది. ఇద్దరు పిల్లలతో ఆటకు వెళ్లిందని వారు తెలిపారు. దీంతో ఆమె గ్రామానికి దగ్గరలో ఉన్న రాజుగారి మామిడి తోటలోకి వెళ్లి చూడగా తన కూతురిపై ఇద్దరు బాలురు లైంగికదాడి చేస్తున్నట్టు గమనించి, వారిని మందలించింది. తన కూతురిని ఇంటికి తీసుకువచ్చింది.
అప్పటికే బాలికకు రక్తస్రావం జరగడంతో గ్రామంలోని పెద్దలకు తెలియజేసింది. నెలరోజుల కిందట కూడా ఇలాగే జరిగడంతో ఆమె పంచాయతీ పెద్దలను ఆశ్రయించింది. వారు ఇరు వర్గాల వారికి సర్దిచెప్పి పంపించేశారు. మళ్లీ అదే ఆ బాలుడు ఇప్పుడు కూడా తన కుమార్తెపై లైంగికదాడి చేశాడని చెప్పింది. మంగళ, బుధవారాల్లో ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయి. బాలుడి(14) అక్క శీర శ్రీదేవి, మేనత్త పోలమ్మలు బాలిక తల్లి ముఖంపై వేడిగంజి పోసి నానదుర్బాషలాడి దాడికి దిగారు. దీంతో బుధవారం రాత్రి ఒంటి గంటసమయంలో పెదమానాపురం పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది. సీఐ గురువారం గ్రామంలో దర్యాప్తు జరిపి ఇద్దరు మైనర్లపై కేసు నమోదు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం విజయనగరం మహారాజా ఆస్పత్రికి తరలించినట్టు సీఐ చెప్పారు. ఈ సమావేశంలో పెదమానాపురం, బూర్జివలస ఎస్సైలు యు.మహేష్, వై.సింహచలం తదితరులు పాల్గొన్నారు.