టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన నగరి మున్సిపల్ చైర్పర్సన్ కె.జె.శాంతి కుమార్ను పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు.
రుయాలో వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
తిరుపతి మెడికల్ : టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన నగరి మున్సిపల్ చైర్పర్సన్ కె.జె.శాంతి కుమార్ను పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పరామర్శించారు. సోమవారం తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న శాంతితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా శాంతి, ఆమె కుటుంబ సభ్యులు మాట్లాడుతూ రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలకు ప్రభుత్వ కానుకలను అందించామన్నారు. జీర్ణించుకోలేని ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమ నాయుడు, ఆయన అనుచరులు తమను అడ్డుకుని దుర్భాషలాడారన్నారు. పోలీస్టేషన్లో ఫిర్యాదు ఇచ్చేందుకు వెళ్లిన తనపై అమృతరాజ్, మైఖేల్రాజ్, మునిరెడ్డి దాడిచేశారన్నారు. మూడు నెలల క్రితం ఉదర సమస్యకు చెన్నై అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్ చేసుకున్నానన్నారు. ప్రస్తుతం అదేచోట బలంగా తన్నడంతో గాయం తిరగబెట్టిందని కన్నీటి పర్యంతమయ్యారు.
ఈనేపథ్యంలో రుయా సూపరింటెండెంట్ డాక్టర్ సిద్దానాయక్ను పిలిపించి శాంతి ఆరోగ్య సమస్యపై పెద్దిరెడ్డి అడిగి తెలుసుకున్నారు. గతంలో కె.జె.శాంతికుమార్కు ఆపరేషన్ నిర్వహించిన చెన్నై అపోలో ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో కుటుంబ సభ్యులు శాంతిని ప్రత్యేక అంబులెన్స్లో చెన్నైకి తీసుకెళ్లారు. కెజే శాంతిని పరామర్శించిన వారిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవితో పాటు పలువురు నాయకులున్నారు.